తెలుగు సినీప్రేక్షకులు భవిష్యత్తులోకి వెళ్లారు. కలియుగం అంతానికి వచ్చినప్పుడు ఎలా ఉంటుందో చూశారు. ‘కల్కి 2898 ఏడీ’ సినిమా చేసిన మాయ ఇది. పురాణాలను, సైన్స్ అండ్ టెక్నాలజీని మిళితం చేసి నాగ్ అశ్విన్ సృష్టించిన మాయాజాలం ఈ చిత్రం. భవిష్యత్తు ఎలా ఉండబోతున్నదో… ఆయన మస్తిష్కంలో మెదిలిన భావాల పరంపరే ఈ సెల్యులాయిడ్ వండర్. ఇందులో మోక్షనగరి కాశి కనిపించింది. సప్త చిరంజీవుల్లో ఒకరైన అశ్వత్థామ కనిపిస్తాడు. పరమయోగులు ఒక్కసారైనా చూడాలని పరిపరి విధాలా పరితపించే శంబలా నగర ప్రాశస్త్యమూ గోచరమవుతుంది. ‘కల్కి..’ సినిమా కథకూ, శంబలకూ ఉన్న లింక్ తెలిసిపోయింది. శంబలను పురాణాలు ఎలా వర్ణించాయో చూద్దాం..
Shambhala | శంబల వేదభూమి. మహిమాన్వితులు, పరమహంసలకు మాత్రమే దీని చిరునామా తెలుసు. వేల జన్మల పుణ్యం చేసుకుంటే గానీ.. శంబల దరిదాపుల్లోకి చేరుకోలేమని పురాణ వాఙ్మయం చెబుతుంది. ఆదియోగిని అదుపు ఆజ్ఞల్లో ఉంచగలిగే రహస్య నగరి ఇది. శ్రీమహావిష్ణువు దశావతారం కల్కికి జన్మనిచ్చే పవిత్రక్షేత్రం శంబల. హిమాలయ సానువుల్లో వేలాది మైళ్ల దూరంలో ఉన్న ఈ నగరం.. భూలోక స్వర్గంగా పేరొందింది. బాహ్య ప్రపంచానికి ఈ అలౌకిక క్షేత్రం ఎలా ఉంటుందో తెలియదు. ఈ కలియుగంలోనూ ఇక్కడ ధర్మం నాలుగు పాదాలా నడుస్తుందట. దేవతలు సైతం అడపాదడపా శంబలకు వచ్చి విహరిస్తుంటారట. బలవంతులు, సంపన్నులు దీన్ని చేరుకోలేరు. యోగసాధనలో సుషుమ్న నాడిని వశపరచుకున్న యోగులకు శంబల నుంచి ఆహ్వానం అందుతుందట. యుగాలుగా అక్కడే ఉన్న మహాతపస్వులు దిశానిర్దేశం చేస్తూ వారిని రప్పించుకుంటారట.
పురాణాల ప్రకారం శంబల భూలోక స్వర్గం. 60 లక్షల సంవత్సరాల కిందటే ఈ నగరం ఆవిర్భవించింది. ఇక్కడ ప్రకృతి పరవశింపజేస్తుంది. వృక్షాలు పరిమళాలు వెదజల్లుతాయి. శంబల నగరవాసులు దీర్ఘాయుష్కులు. సదా యోగ ధ్యానంలో ఉంటారు. వారి తపఃఫలంగానే భూలోకం మనుగడ సాగిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అధర్మం పెచ్చరిల్లి… ధర్మానికి ఆపద ఏర్పడినప్పుడు శంబలలోని యోగులు ఈ లోక పరిపాలనను తమ అధీనంలోకి తీసుకుంటారని విశ్వసిస్తారు. కలియుగం అంతరించే దశలో.. శ్రీమహావిష్ణువు శంబల నగరంలో జన్మిస్తాడని విష్ణుపురాణం చెబుతున్నది. ఇక్కడ నివాసం ఉంటున్న విష్ణుశయనుడు అనే పండితుడి ఇంట కల్కి రూపంలో అవతరిస్తాడట. తెల్లటి గుర్రాన్ని ఎక్కి, ఖడ్గాన్ని ధరించి తన పరాక్రమంతో దుష్టుల్ని సంహరించి లోకంలో తిరిగి ధర్మాన్ని ప్రతిష్ఠిస్తాడని, అప్పటినుంచి సత్యయుగం పునఃప్రారంభం అవుతుందని కథ.
శంబల నగర నిర్మాణం సినిమాలో ఎలా చూపించినా.. పురాణాల్లో మాత్రం ఈ నగరానికి సంబంధించి అనేక విషయాలు కనిపిస్తాయి. నగరం చుట్టూ అష్టదళ పద్మం ఆకారంలో ఎత్తయిన పర్వతాలు ఉంటాయట. వాటి మధ్యలో శుద్ధస్ఫాటిక శ్రీచక్రం కాంతులీనుతూ ఉంటుందట. ఈ శ్రీచక్రాకృతిలో ఉన్న సౌధంలో భూమిని పోలిన నమూనా ఉంటుంది. అది తిరగబడిన పిరమిడ్ ఆకృతితో కనిపిస్తుంది. అందులో కొలువుదీరిన చింతామణి అనే దివ్యమైన మణి కోటి సూర్యకాంతులు వెదజల్లుతూ ఉంటుందట. సిద్ధులైన యోగులు ఈ మణికి నిత్యం పూజలు చేస్తూ ఉంటారని చెబుతారు. ఈ మణి కోరిన వరాలన్నీ ప్రసాదిస్తుందని ప్రతీతి. విష్ణుమూర్తి కల్కి మూర్తిగా జన్మించిన తర్వాత ఈ మణిని ధరించి… దుష్టసంహారానికి పూనుకుంటాడని పురాణ కథనం.
బౌద్ధ సాహిత్యంలోనూ శంబల గురించి కనిపిస్తుంది. వారి సంప్రదాయం ప్రకారం చింతామణి మంత్రాన్ని ఉపాసన చేస్తారు. ఆధునిక వైజ్ఞానిక శాస్త్రవేత్తలు కూడా దీంతో భేదించలేకపోయారు. ఈ నగరంలో 12 గంటల ప్రమాణం.. బాహ్య ప్రపంచంలో రెండు వారాలకు సమానం. ఈ నగరాన్ని అన్వేషించడానికి బయల్దేరిన ఓ బృందానికి వింత అనుభవం ఎదురైందన్న కథ ప్రచారంలో ఉంది. శంబలకు చేరువైన తర్వాత బృందసభ్యులకు అకస్మాత్తుగా వయసు పెరగడం ప్రారంభమైందట. కొన్ని దశాబ్దాల వయసు పెరగడంతో వెనక్కి వచ్చిన తర్వాత కూడా వయోభారంతో కన్నుమూశారట. ఇక పాశ్చాత్యులు శంబలను ‘ఫర్బిడెన్ ల్యాండ్’, ‘హిడెన్ సిటీ’, ‘ద ల్యాండ్ ఆఫ్ వైట్ వాటర్స్’ తదితర పేర్లతో పిలుస్తారు. అలెగ్జాండ్రా డేవిడ్ నీల్, హెన్రిచ్ హిమ్లర్ వంటి ఎంతోమంది పాశ్చాత్యులు ఈ నగరాన్ని చేరుకోవాలని, ఇక్కడి విశేషాలు తెలుసుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేశారు కానీ సాధ్యపడలేదు. శంబల నగర విశేషాలపై 1933లో జేమ్స్ హిల్టన్ అనే ఆంగ్ల రచయిత ‘లాస్ట్ హురైజన్’ అనే నవలను రాశారు. ఈ నవల ఆధారంగా అదేపేరుతో 1973లో హాలీవుడ్ చిత్రం కూడా వచ్చింది.