అమీరు ఒకరు, గరీబు ఒకరు.. ఇద్దరూ మంచి స్నేహితులు! అధికారి ఒకరు, కూలివాడు మరొకరు..ఇద్దరూ జాన్జిగిరీలు! నిజజీవితంలో ఇలాంటి స్నేహాలు కోకొల్లలు. ఇదే ఫార్ములాతో విజయవంతమైన సినిమాలెన్నో. నిరుపేదల స్నేహం ఎంత రిచ్గా ఉంటుందో చూపించిన ‘దోస్తీ’. బాలీవుడ్ తోటలో విరిసిన ఈ స్నేహ కుసుమానికి ఇప్పుడు అరవై ఏండ్లు. ఫ్రెండ్షిప్ డే రోజు తప్పకుండా చూడాల్సిన చిత్రమిది.
తెగిన రెండు గాలిపటాలు… చిటారు కొమ్మన చిక్కుకుంటే.. గాలివాటానికి దారాలు పెనవేసుకొని.. రెండు పతంగులూ హత్తుకున్న దృశ్యం ఎంత మనోహరంగా ఉంటుందో కదా! 1964లో విడుదలైన హిందీ చిత్రం ‘దోస్తీ’లో రామ్నాథ్ గుప్త, రాధామోహన్ పాత్రలు అలాంటివే! విధి ఆడిన వింత నాటకంలో రామ్నాథ్ ఒక కాలు కోల్పోతాడు. తల్లి కన్నుమూస్తుంది. అంతకుముందే తండ్రి కాలం చేస్తాడు. తాను ఉన్నతంగా చదివి, ప్రయోజకుడిని అవుతానని తల్లికి మాట ఇస్తాడు రామ్నాథ్. రెండు కాళ్లూ ఉన్ననాడు, తండ్రి మరణానికి పరిహారం వస్తుందని ఆశలు సజీవంగా ఉన్ననాడు చేసిన ప్రతిజ్ఞ అది. కానీ, అనాథగా, కర్ర కాళ్ల సాయంతో నడుస్తూ.. బతుకే బరువైతే, ఆ మాట నిలుపుకోవడం ఎట్లా?
కానీ, రామ్నాథ్ తల్లికిచ్చిన మాట చెల్లిస్తాడు. పదో తరగతి ఫస్టుగా పాసవుతాడు. ఇంటర్లో రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకులో నిలుస్తాడు. ఓ అంధుడి అండతో తన కలను నిజం చేసుకుంటాడు. ఆ గుడ్డివాడు రాధామోహన్. ఒకప్పుడు చూపున్నవాడు. విశాల నేత్రాలు కలిగినవాడు. అన్నిటికీ మంచి మనసున్నవాడు. అనుకోకుండా ఓ రోజు.. చూపు కోల్పోతాడు. తనను కంటికి రెప్పలా చూసుకునే అక్కకు ఓ పెనుతుఫాను రాత్రి దూరమైపోతాడు.
ఢక్కాముక్కీలు తినడానికి ఇద్దరూ ఎవరికివారే పట్నం వస్తారు. నిరుపేదలు తలదాచుకునే ఫుట్పాత్ పైకి చేరుకుంటారు. అనుకోకుండా ఒకరికొకరు తారసపడతారు. ఒకరి సమస్యలు ఒకరికి తెలుస్తాయి. కానీ, ఇద్దరూ వాటిని పరిష్కరించలేని స్థితిలోనే ఉంటారు. రెక్కలాడించాలంటే.. డొక్కలో శక్తి ఉండాలి. అదీ వాళ్లకు సాధ్యం కాదు. కాలక్షేపానికి రామ్నాథ్ మౌత్ఆర్గాన్ వాయిస్తుంటాడు. తన స్నేహితుడు ఎంత రసరమ్యంగా వాయిస్తున్నాడో అని మురిసిపోతాడు మోహన్. ఓసారి తనూ గొంతు కలుపుతాడు. ‘జానే వాలో జరా.. ముడ్ కే దేఖో ముఝే.. ఏక్ ఇన్సాన్ హూఁ, మై తుమ్హారీ తరాఁహ్’… పాట. క్లుప్తంగా ‘నేనూ మీలాంటి మనిషినే…’ అని భావం. సంగీత ద్వయం లక్ష్మీకాంత్-ప్యారేలాల్ మ్యూజిక్. మజ్రూహ్ సుల్తాన్పురీ సాహిత్యం. పాడింది మహమ్మద్ రఫీ. తర్వాత ఇంకోపాట.. ‘రాహీ మన్వా దుఃఖ్ కీ చింతా’… మరో అద్భుతం. ఆపై మరో పాట.. ‘మేరీ దోస్తీ మేరా ప్యార్..’ మహాద్భుతం. అన్నిటికీ మించి ‘చాహూంగా మై తుఝే.. సాంజ్ సవేరీ.. ఫిర్ బీ కభీ అబ్ నామ్ కో తేరీ.. ఆవాజ్ మైన దూంగా’ ఎవర్గ్రీన్ హిట్. ప్రతిపాటా బాలీవుడ్ సాహిత్యంలో పేరెన్నికగన్నదే, రఫీ అమృత గళం నుంచి పెల్లుబుకిందే. సినిమా విడుదలకు ముందుగానే.. ‘దోస్తీ’ పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పటికీ ఈ పాటలు ఎప్పుడు విన్నా.. మనసును ద్రవింపజేసేవే!!
‘అమ్మ కోసం.. నీ భవిష్యత్తు కోసం.. నా ఆనందం కోసం.. చదువుకో నేస్తం’ అంటాడు మోహన్. ఈ మాట మరెవరైనా చెబితే వినేవాడు కాదు రామ్నాథ్. తన స్నేహితుడు చెప్పడంతో కాదనలేకపోతాడు. రోజూ పాటలు పాడుతూ.. స్నేహితుడి బాధ్యతను భుజానికెత్తుకుంటాడు మోహన్.
మళ్లీ కథలోకి వస్తే.. మోహన్ గాత్రం విన్నవాళ్లంతా ఫిదా అయిపోతుంటారు. రామ్నాథ్ వాద్యఘోషకు మైమరచిపోతారు. ఈ దివ్యాంగులకు తోచినంత సాయం చేస్తారు. వాటితో రోజులు వెళ్లదీసుకోవచ్చని అనుకుంటాడు రామ్నాథ్. తానున్న పరిస్థితుల్లో తల్లికిచ్చిన మాట దేవుడెరుగు! పూట గడిస్తే చాలు అనుకుంటాడు. కానీ, తన స్నేహితుడి గతం తెలుసుకున్న మోహన్.. ‘నీ చదువు బాధ్యత నాది’ అంటాడు. ‘అదెలా?’ అంటాడు రామ్నాథ్. ‘నువ్వు బడికి వెళ్తూ… ఏదైనా వీధిలో నన్ను విడిచిపెట్టు. నేను పాటలు పాడుతూ.. రోజుకింత సంపాదిస్తాను. ఆ మొత్తంతో నీ చదువు కొనసాగించు’ అని అభయమిస్తాడు. రామ్నాథ్ ఒప్పుకోడు. ‘అమ్మ కోసం.. నీ భవిష్యత్తు కోసం.. నా ఆనందం కోసం.. చదువుకో నేస్తం’ అంటాడు మోహన్. ఈ మాట మరెవరైనా చెబితే వినేవాడు కాదు రామ్నాథ్. తన స్నేహితుడు చెప్పడంతో కాదనలేకపోతాడు. రోజూ పాటలు పాడుతూ.. స్నేహితుడి బాధ్యతను భుజానికెత్తుకుంటాడు మోహన్. చిన్నప్పటి నుంచి చురుకైన విద్యార్థి కావడంతో రామ్నాథ్కు ఉపాధ్యాయుల సహకారం లభిస్తుంది. ఈ ఇద్దరు స్నేహితులు ఓ మురికివాడలో చిన్న గది కిరాయికి తీసుకుంటారు. అక్కడ పరిస్థితులను గమనించిన ఓ ఉపాధ్యాయుడు ‘నువ్వు ఇక్కడుంటే చదువు కొనసాగదు’ అని తన ఇంటికి తీసుకెళ్తాడు. భారంగానే వెళ్తాడు రామ్నాథ్. మోహన్ గుండె పగిలినంత పని అవుతుంది. రామ్నాథ్కు చేయూతనిచ్చిన ఉపాధ్యాయుడు ఆకస్మికంగా కన్నుమూస్తాడు. ఇంటర్ పరీక్షలకు ఫీజు చెల్లించలేని దుస్థితి. స్నేహితుణ్ని అడిగి ఇబ్బంది పెట్టొద్దని నిర్ణయించుకుంటాడు. మిత్రుడి పరిస్థితి తెలుసుకొని.. అతనికి తెలియకుండా పరీక్ష రుసుం చెల్లిస్తాడు మోహన్. రామ్నాథ్ పరీక్షలు రాస్తాడు. రాష్ట్రస్థాయిలో మొదటిస్థానంలో నిలుస్తాడు. తర్వాత ఇద్దరు మిత్రులూ కలుసుకుంటారు. కథ సుఖాంతం.
‘దోస్తీ’లో ప్రతి సీనూ గుండెను పిండేసినట్టు ఉంటుంది. అయినా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. దర్శకుడు సత్యేన్ బోస్ టేకింగ్ అలా ఉంటుంది. నిష్కల్మషమైన స్నేహాన్ని హృద్యమైన కావ్యంగా అందించాడు దర్శకుడు. అంతర్లీనంగా మరో రెండు ఉపకథలు సాగుతాయి. అవి కూడా మనసును హత్తుకుంటాయి. పేదాగొప్ప అంతరాలు పట్టని స్నేహం.. బీదాబిక్కీ అని మాత్రం ఆలోచిస్తుందా చెప్పండి!!