నడుం పూర్తిగా వంగిపోయిన ఒక ముసలివాడు నడుస్తున్నాడు. “తాతా! యేం వెతుకుతున్నావు?” అని అడిగింది ఒక చిన్నది. “పోయిన యౌవనాన్ని వెతుక్కుంటున్నాను.” అన్నాడు వృద్ధుడు. ప్రశ్నోత్తర రూపంలో వున్న ఈ ఫార్సీ కవిత రాజు జహంగీరూ, రాణి నూర్జహానూ మధ్య జరిగిన సంభాషణ. నడ్డి వంగి నడుస్తున్న ముసలివాడు పోయిన యౌవనాన్ని వెతుక్కుంటున్న వాడిలా వున్నాడని చమత్కారం.
మా మదర్సా (బడి)లో మౌల్వీ (పంతులు) ఈ కవిత చదివి అర్థం చెబుతుంటే నేను నా ధోరణిలో చిన్నతనంలో అనువదించుకున్నాను.
ఇది ఎందుకు జ్ఞాపకం వచ్చిందంటే ఈ మధ్య ఒక మిత్రుడు నాతో చదువుకున్నవాడు కలిసి “నీ ముఖంలో అప్పుడే వృద్ధాప్యపు ఛాయలు కనపడుతున్నాయేమోయ్?” అని నన్ను అడిగాడు. అతను డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్గా ఇప్పుడు పని చేస్తున్నాడు, దృఢకాయుడు. కానైతే నా వయస్సే యాభై అయిదు. యాభై అయిదులో రెండు అయిదులున్నాయి కదా! అయిదుతో అయిదు ప్లస్ చేస్తే బాల్యం (పదేండ్లు). అయిదుతో అయిదు ఇంటూ చేస్తే యౌవనం (పాతిక). అయిదు పక్కన అయిదు వ్రాస్తే యాభై అయిదు. వార్ధక్య ద్వారం! అయిదులో మరో చమత్కారం వుంది.
మన్ను, మిన్ను, గాలి, నీరు, వెలుతురు కలిసి పంచభూతాలు. ఇవి ఒక ఫార్ములా ప్రకారం సమ్మేళనం చెందితే ప్రాణి ఉద్భవిస్తుంది. ఆ సమ్మేళన భగ్నమైతే ప్రాణి చనిపోతుంది. పంచభూతాల సమ్మేళనం జననం పంచభూతాలు ఛిన్నాభిన్నం కావడం మరణం. సుప్రసిద్ధ ఉర్దూ కవి బ్రిజ్ నారాయణ్ చక్బస్తు కవితలను మేము తరచు చదువుతూ ఉండేవాళ్ళం. ఆయన కవితల్లో సుప్రసిద్ధమైనది ఇదే అర్థాన్ని బోధిస్తున్నది. నేను ఇలా అనువదించాను. “పంచభూతాల కలయిక ప్రాణమౌను వాని విడిపోవుటయె అవసానమౌను” ఏభై అయిదేళ్ళ వయసులో అప్పుడే ముసలితనం ప్రవేశిస్తుందని నేను నమ్మను. అరవై దాటేక చూసుకుందాం. అప్పటివరకు యౌవనోత్సాహంతోనే సాగిపోతాను. వయసు కంటే మనసు ముఖ్యం కదా!