పాతికేండ్ల కిందట.. ఓ పసిపాప ఈ లోకంలోకి వచ్చింది. ఆ పుట్టిన పసికందు ఈ లోకం చూడలేని అంధురాలు అని తేలింది. పేగుబంధాన్ని కాదనుకున్నారు తల్లిదండ్రులు. బిడ్డను జల్గావ్ రైల్వేస్టేషన్లోని ఓ చెత్తకుండీలో పడవేసి చీకట్లో కలిసిపోయారు. బిడ్డను చేరదీసిన పోలీసులు తల్లిదండ్రుల ఆచూకీ కోసం ప్రయత్నించారు. దొరకలేదు. పసికందును జల్గావ్లోని రిమాండ్హోమ్కు తరలించారు. అక్కడ దివ్యాంగులకు పునరావాసం కల్పించే వ్యవస్థలేదు. దీంతో ఆ చిన్నారిని దివ్యాంగ్ బీవర్స్ చిల్డ్రన్స్ హోమ్ డైరెక్టర్ శంకర్ బాబా పాపల్కర్కు అందజేశారు. అనాథలకు అండగా ఉండే శంకర్బాబా పద్మశ్రీ పురస్కార గ్రహీత. అతని చల్లని చేతులు ఆ చిట్టితల్లిని అందుకున్నాయి. మాలా పాపల్కర్ అని నామకరణం చేశాడు.
125 మంది అనాథలు, దివ్యాంగులు ఉండే బాలల గృహంలో మాల జీవనయానం మొదలైంది. శంకర్బాబా ప్రోత్సాహంతో చదువు కొనసాగించింది. విదర్భ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నాలెడ్జ్ నుంచి బీఏలో ఉత్తీర్ణత సాధించింది. 2019 నుంచి పోటీ పరీక్షలకు సిద్ధమైంది. యూనిక్ అకాడమీ డైరెక్టర్ అమోల్ పాటిల్ ఆధ్వర్యంలో మాల మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎంపీఎస్సీ) పరీక్షకు సిద్ధమైంది.
రెండుసార్లు విఫలమైంది. పట్టుదలగా చదివింది. ఈసారి ఆమె పట్టుదలకు దురదృష్టం తోకముడిచింది. అదృష్టం వెంట నడిచింది. ఎంపీఎస్సీ పరీక్షల్లో టైపిస్ట్ ఉద్యోగానికి ఎంపికైంది. గత నెల 16న ఫలితాలు వెలువడ్డాయి. మాల ఎందరో దివ్యాంగులకు ఆదర్శంగా నిలిచింది. ‘ఉద్యోగం సాధించినందుకు సంతోషంగా ఉంది. నా ప్రయాణం ఇప్పుడే మొదలైంది. సివిల్స్లో విజయం సాధించడమే నా లక్ష్యం’ అని చెప్పుకొచ్చింది మాలా పాపల్కర్.
– పాసికంటి శంకర్, భీవండి