డాక్టర్ కేయస్ రాజన్నకు పదకొండేండ్ల వయసులోనే జీవితం తలకిందులయ్యే పరిస్థితి ఎదురైంది. పోలియో మహమ్మారి బారినపడటంతో ఆయన కాళ్లు చేతులు కోల్పోయారు. అయినప్పటికీ తన శారీరక పరిమితులను దాటుకుని రాజన్న తన జీవిత ప్రయాణంలో నిలిచి గెలిచారు. నడవడం కష్టమైన పరిస్థితుల్లో ఆయన మోకాళ్ల మీద నడక నేర్చుకున్నారు. కష్టపడి చదువుకుని మెకానికల్ ఇంజినీరింగ్ పట్టా అందుకున్నారు. 2002 పారాలింపిక్స్లో రాజన్న డిస్కస్ త్రో పోటీల్లో భారతదేశానికి బంగారు పతకాన్ని, స్విమింగ్లో వెండి పతకాలను సాధించిపెట్టారు.
బెంగళూరుకు చెందిన రాజన్నకు ఇప్పుడు అరవైనాలుగు ఏండ్లు. సామాజిక సేవలో సంతృప్తి వెతుక్కున్న ఆయన తన జీవితాన్ని దివ్యాంగుల సహాయానికి అంకితం చేశారు. అలా తాను సవాళ్లను ఎదుర్కొంటున్నా తనలాంటి వారిని సాధికారత దిశగా నడిపిస్తున్నారు. ఆయన ప్రయత్నాలకు తొలి గుర్తింపు 2013లో లభించింది.
కర్ణాటక ప్రభుత్వం రాజన్నను ఆ రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్కు కమిషనర్గా నియమించింది. ఆ పదవి చేపట్టిన తొలి దివ్యాంగుడు రాజన్నే కావడం విశేషం. ఇప్పుడు ఆయన విజయవంతమైన ఆంత్రప్రెన్యూర్గా 350కి మందికి ఉపాధి కల్పిస్తున్నారు. వీరిలో ఎక్కువగా దివ్యాంగులే ఉండటం గమనార్హం. పదిమందికి మేలు చేసే దిశగా ఆయన చూపుతున్న చొరవ, సాటిలేని నిబద్ధత, సేవలకుగాను భారత ప్రభుత్వం రాజన్నను ఈ ఏడాది పద్మశ్రీతో గౌరవించింది. ఇటీవలే ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ అందుకున్నారు.
“ఇది కేవలం అవార్డుగా మాత్రమే నిలిచిపోదు. నా సామాజిక కార్యక్రమానికి మరింత ప్రోత్సాహంగా నిలుస్తుంది. దివ్యాంగులకు రాజకీయంగా ఎలాంటి రిజర్వేషన్లూ లేవు. కాబట్టి రాష్ర్టాల విధానపరిషత్లు, రాజ్యసభకు ఒక దివ్యాంగుణ్ని నామినేట్ చేయడానికి ఈ అవార్డు ప్రేరకంగా నిలుస్తుందని భావిస్తున్నాను. మేం సానుభూతి కోరుకోవడం లేదు. మా హక్కులను అనుభవించడానికి ఓ అవకాశం కావాలంతే” అంటారు రాజన్న. పోలియో తనను కదలలేని స్థితికి తీసుకువచ్చినా పట్టుదల, ధైర్యంతో విజయాలు సాధ్యమే అనడానికి రాజన్న జీవితం ఓ ఉదాహరణ.