‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజాగ్రంథాలయం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2022’లో రూ.2 వేల బహుమతి పొందిన కథ.
బయట హోరున కురుస్తున్న వాన వైపే చూస్తూ..
“గిప్పుడు మనం అమ్మను గీ పట్నం సర్కారు దవాఖానా కాన్నుంచెల్లి మన ఊరికి దీస్కపోవుడు గంత అవుసరమా అయ్యా?” అడిగింది పుష్ప.. వదలని భయంతో, అయోమయంగా!
కూతురి తల నిమురుతూ పూడుకుపోతున్న గొంతును బలవంతాన సవరించుకుంటూ..
“తీస్కపోవుడైతే తప్పదు బిడ్డా! మీ అమ్మ పానం ఎప్పుడేమైతదో సెప్పలేని తీరుగుంది గదా?” అన్నాడు మల్లయ్య.
పుష్ప గొంతు బాధతో, భయంతో కీచుమన్నది.
“మల్ల గందుకనే అంటన్న.. గిసుంటి పరిస్తితిల్ల దవాఖానలనే ఉంచుడు మంచిదైతది గదా? బతకనీకి చాన్సుండొచ్చు. ఊరు దీస్కపోవుడు పాగల్ పనైతదిగదనే?!”.. అన్నది పుష్ప.
కన్నీళ్లను ఆపుకొంటూ, కూతురికి ధైర్యం కలిగించే ప్రయత్నం చేస్తూ..
“ఏంగాదులే బిడ్డా! బగమంతుని మీద బారమేద్దాం. ఏంజేస్తం జెప్పు? జూస్తనే ఉంటివి గద.. నిన్న రాత్రినుంచెల్లి మీయమ్మ ఒకటే తీరుగ కండ్ల నీరుబెట్టుకుని అంటానే ఉన్నది.. ‘నన్ను మన ఊరికి తీస్కపోన్రీ! నేను అత్తమ్మను జూడాలే.. బతికినా సచ్చినా ఆమె ఒల్లోనే!’ అని. గిప్పుడు మనం తీస్కపోకుంటే.. ఇయ్యాల్నో రేపో గామెకు ఏమైన ఐతే.. ‘అరే.. అంతగ మొత్తుకు జెప్పిన భీ పాపమామె ఆకరి కోర్కెను దీర్చకుండగ జంపితిమే’ అని బతుకంతా ఏడ్వాలెగదా” అని స్వగతంగా పలుకుతున్నట్లు గొణిగాడు మల్లయ్య వేదనగా.
తండ్రి మాటలతో ఏకీభవిస్తూ.. బెంగతోనే తల నిలువుగా ఆడించింది పుష్ప.
కూతురు కూడా గుండె రాయి చేసుకుని, సమ్మతించినందుకు కొద్దిగా ధైర్యం తెచ్చుకుని..
“నేనెల్లి అంబులెన్సు మాట్లాడస్త బిడ్డా! మన ఊరి డాక్టరు సాబ్ దావఖానల పెద్దోల్లకు జెప్పి, పేషంట్ని గిసుంటి పరిస్తితుల్ల భీ తీస్కపోవుడుకు ఒప్పించిండు. గదేదో.. ఆక్సీజన్ బందోబస్తున్న అంబులెన్సులనే తీస్కెల్లాల్నంట” అంటూ.. వర్షంనుంచి కొంతైనా కాపాడుకోవడానికి పైబట్ట తలమీదుగా కప్పుకొని, పరుగులాంటి నడకతో హాస్పిటల్ గేటువైపు వేగంగా సాగాడు మల్లయ్య. అపస్మారకంగా పడున్న తల్లివైపే బెంగగా చూస్తూ కూర్చుండి పోయింది పుష్ప.
భర్త తనను ఊరికి తీసుకుపోతానని అనడం చెవినపడ్డ సారమ్మలో కొంత కదలిక వచ్చి, చిరు ఆనందం కారణంగా కొద్దిపాటి శక్తి లభించి.. కూతురి కళ్లలోకి చూస్తున్నది.
ఉరుకుల మీద గాంధీ హాస్పిటల్ మెయిన్ గేటు దాటి బయటికి చేరుకున్న మల్లయ్యను ఓ అంబులెన్స్ వద్ద తడవకుండా గొడుగు చేతబట్టి నిల్చుని ఉన్న అటెండర్ నరసింహ చూసి..
“ఓ పెద్ద మడిసీ! ఇక్కడ.. ఈడకి రా” అంటూ, చెయ్యి ఊపుతూ పిలిచాడు.
వాన చినుకుల మధ్యగా కళ్లు చిట్లించుకు చూస్తూ అటు పరిగెత్తాడు మల్లయ్య.
“గొడుగు కిందికి రా ముందు సెప్త.. తడిసిపోతన్నవు” అని దగ్గరికి లాక్కుని..
“ఈ అంబులెన్సాయనకు అంతా చెప్పిన. ఇతని పేరు పరమేశ్. శా.. నా మంచోడు. ఈ అంబులెన్సుల ఆక్సిజన్ గిట్ల మొత్తమున్నయి. పేషంట్ను, మిమ్ముల్ని బద్రంగ మీ ఊర్కి తీస్కపోతడు. ఇన్నవా? కిరాయి ఎంతనేడిది నువ్వూ, ఈయనా మాట్లాడుకోన్రి” అన్నాడు నరసింహ.
“అదిభీ నువ్వే మాట్లాడరాదయ్య.. పున్నెముంటది!” బతిమాలాడు మల్లయ్య. .
“అమ్మా! గా పని నేన్జెయ్య. మల్ల మజ్జన నేనేదో దంద నడిపిన అనుకుంటరు. పాపం.. ఊరి నుంచెల్లి వచ్చినోల్లూ.. పరిస్తితి జూస్తే అట్లుండెనని జాలితో ఓ మంచి అంబులెన్స్ మీకు చూపించాలెననే నేను బయటికచ్చిన. ఇన్నవా.. ఏమంటున్న? ఇగ మీరు మీరు మాట్లాడుకోన్రి. నువ్వు తడిసిపోతవు.. ముందు లోపల గూసుని మాట్లాడుకో” అని, తనే తలుపు తీసి.. మల్లయ్యను అంబులెన్స్ డ్రైవర్ పక్క సీటులోనికి ఎక్కించి..
“పరమేశన్నా! జర జూడు పాపం. ఈళ్లను ఈళ్ల ఊర్ల జాగర్తగ దింపేసి వచ్చినంక, గా సంగతి నాకు జెప్పాలె మల్ల” అని చెప్పి, హాస్పిటల్ లోపలికి వెళ్లిపోతున్నప్పుడు.. నరసింహ కుడికన్ను కొట్టుకున్న వింత విన్యాసంలోని భావాన్ని చదివే శక్తి మల్లయ్యకు లేదు.
లోపలికి ఎక్కి కూర్చుని, అంబులెన్స్ డ్రైవర్ పరమేశ్ను ఆప్తుడిగా భావిస్తూ.. అతని నుంచి సానుభూతిని ఆశిస్తూ.. వాననీటితో కలిసి చెంపల మీదుగా జారుతూన్న కన్నీటిని పైబట్టతో అద్దుకుంటూ..
“నా బార్య సావుబతుకుల మజ్జనుంది. ‘ఏం జెప్పలేం!’ అంటుండు డాక్టర్ సాబ్. ఆమెనేమో.. ‘నన్ను మన ఊరికి దీస్కపోన్రీ.. నేను అత్తమ్మను జూడాలె’ అంటూ ఒకే తీరుగ మొత్తుకుంటాంది. ఆమె అంటే ఈమెకు, ఈమె అంటే ఆమెకూ పానం. ఇదొక ఇంత.. గీ లోకంల. ఎప్పుడు తిట్టుకునే, కొట్టుకునే అత్తకోడండ్లను జూస్తం గానీ.. ఈళ్ల లెక్క ఒకరంటే ఒకరు పానమిచ్చుకునే అత్తకోడండ్లను ఏడభీ సూడం. ముసిలామేమో జారిపడి కాలిరుసుకుని ఇంటికాడనే ఉంది. పిచ్చి పనో మంచి పనో నాకైతే ఎరికైతలేదు గానీ, గిప్పుడైతే గీమెను తీస్కపోవుడైతె తప్పదు. బీబీనగర్ మా ఊరు. చెప్పు నాయినా! ఎంతియ్యమంటవు?” పరిస్థితి అంతా వివరించి చెప్పి, అడిగాడు మల్లయ్య.
పరమేశ్ తల పంకించి, కళ్లు మూసుకుని, కనుకొలకులలో వేళ్లు గుచ్చుకుని, దీర్ఘంగా ఆలోచిస్తూ రెండు
నిమిషాలుండి, చాలా నిజాయతీగా అడుగుతూన్న ధోరణిలో..
“చూడు పెద్దాయనా! చీకటి పడింది. వాన గూడ వస్తాంది. గీ రాత్రిపూట పేషంట్ను, మిమ్ముల్ని జాగర్తగ మీ ఊరు తీస్కపోయి వదిలి, మల్ల నేను హైదరాబాదు తిరిగి రావాలె. నిజానికైతే నేనిప్పుడు వచ్చే పరిస్థితైతే లేదు. నర్సిమ్మ జెప్పిండని, మీ పరిస్థితి జూసి జాలిపడి రావాలె. ఊఁ..” అంటూ సాగదీస్తూ మళ్లీ ఓ నిమిషం ఆలోచించి, తెగించి నిర్ణయం తీసుకున్నట్లు ఒక్కసారి తల విదిల్చి..
“సరే పోదం! ఇరవై వేలియ్యున్రి” అన్నాడు.
పక్కలో బాంబు పేలినట్లు అదిరిపడ్డాడు మల్లయ్య.
“ఇ..ర్..వై వేలా?!!”..
“ఏంది గట్ల ఉలిక్కిపడినవ్? ‘ఇరవై వేలా’ అంటూ! అది శాన తక్కువ. గిదే కరోన టైమైతే.. యాభై వేలు తీస్కుంటుంటిమి. ఇన్నవా? అసల్కు నేను వచ్చే పరిస్తితైతే లే! నా కొడుకు యాపీ బర్త్డే ఇయ్యాల. ఇంటికిబోయి, ఆని దోస్తులకు దావత్ ఇయ్యాల్సుండే. కానీ, మిమ్ముల్ని తీస్కపోకపోతే నర్సిమ్మన్న ఫీలైతడని వస్తా అన్న. గంతే!”.
తెరుచుకున్న నోటిని ప్రయత్నం మీద మూస్తూ..
“గంత నేను ఇచ్చుకోలేనయ్య. దగ్గరనే గదా.. ఏదో నాలుగైదు వేలైతే…” నీళ్లు నమిలాడు మల్లయ్య.
“నాలుగైదు వేలు సిటీలో దించుడుకే ఇస్తరు!” అని ఓ క్షణం ఆగి..
“ఏందీ చుట్టూ జూస్తున్నవు? వేరే అంబులెన్స్ ఎవుల్లన్న వస్తరేమోననా? రాత్రి సమయంల.. వానల.. ఎవ్వల్ రారు. వచ్చినా.. నేన్జెప్తున్న ఇను పెద్ద మడిసీ.. అంతా బద్మాష్గాళ్లు ఈడ. దార్ల కిరికిరి వెడుతరు. నీ భార్యను దిక్కుమొక్కులేని సోట జంపుకొనుడైతది జెప్తున్న. తర్వాత నీ ఇట్టం మల్ల” అన్నాడు పరమేశ్.. బెదిరింపు అస్త్రం ప్రయోగిస్తూ కచ్చితంగా.
మతి పనిజెయ్యడం మానేసింది మల్లయ్యకు. యాంత్రికంగా తలుపు తీసుకుని కిందికి దిగాడు.
“ఆలోచించుకుని, పది నిమిషాల్ల చెప్పాలె పెద్దాయినా! నేను గీడనే ఉంట. నేను శానా తక్కువ అడిగిన. వేరెవ్వల్లూ రారు!” అరిచాడు పరమేశ్ వెనగ్గా.
అతగాడికి తెలుసు.. తనను కాదని ముందుకు వచ్చే మరో అంబులెన్స్ డ్రైవర్ అక్కడ ఎవ్వరూ లేరని.
యాంత్రికంగా అడుగులు వేస్తూ హాస్పిటల్లోకి నడిచాడు మల్లయ్య. డీలా పడ్డ మొహంతో తిరిగి వచ్చిన తండ్రిని చూసి..
“ఏమైందయ్యా?” అనడిగింది పుష్ప.
“గా అంబులెన్సాయన మస్తు పైసలడుగుతాండు బేటా!” నిరాశ కారణంగా మల్లయ్య గొంతు లోతైన బావిలోంచి మాట్లాడుతున్నట్లు ధ్వనించింది.
“ఎంత?”.
“ఇరవై వేలు.. ‘రాత్రేల.. వాన పడతున్నది. మల్ల నేను అయిద్రాబాదుకు ఊకెనే వాపసు రావాలె!’ అంటున్నడు!”.
“ఇరవై వేలా?!” అప్రయత్నంగా పుష్ప చెయ్యి గుండెల మీదికి చేరింది.
“అవ్ బిడ్డా! ఒక్క పైస తగ్గడట. ఏంజెయ్యాల్నో అర్తమైతలేదు!”.
పుష్ప దృష్టి సన్నగా మూలుగుతూన్న తల్లి మీదికి మళ్లింది. సారమ్మ మొహంలో ఇందాక ఉబికిన ఆ కొద్దిపాటి ఆనందం స్థానంలో నిరాశ, దిగులు కనిపిస్త్తున్నాయి. చనిపోయేలోగా అత్తమ్మను చూడాలన్నది బహుశా ఆమె ఆఖరి కోరికే కావచ్చు. కూతురితోబాటు భార్య మొహంలోని బెంగతో కూడిన నిరాశను మల్లయ్యా చదివాడు. పుట్టెడు దుఃఖం తన్నుకొస్తున్నది లోనుంచి.
గబుక్కున ఒక్కసారిగా అడిగింది పుష్ప..
“అయ్యా! గా రాంలాల్ సేఠ్ తాన నాకోసం పదారు వేలు దాచినవ్ గదా?”.
కనుబొమలు ముడిచి చూసి..
“అయి ఇంటి మీద సేసిన అప్పు బిడ్డా! నీ పెండ్లికని దాచిన. అంతా మంచిగుంటే వచ్చే నెల్ల నీ పెండ్లి చేయాలనుకుంటి. గింతల..” అని తండ్రి అంటుండగానే వారించి..
“గిప్పుడు నా పెండ్లికైతే తొందరేం లేదు.. గా పైసలు, మన తానున్న పైసలు కలిపి ఇద్దంలే! తీస్క రమ్మను అంబులెన్స్ను” అన్నది పుష్ప. దృఢ నిశ్చయంగా.
తెల్లబోయిన మల్లయ్య..
“గా పైసల్ మనం ముట్టొద్దు బిడ్డా…” అని కంగారుగా అనబోతే..
“ఇగ వేరే ఆలోచనే లేదు. నువ్వు బోయి గా అంబులెన్స్ తీసుకొచ్చుడు.. అమ్మను మనం గిప్పుడు మన ఊరికి తీస్కబోయి, అవ్వకు జూపించుడు జరగాలె. గంతే!” తన నిశ్చయానికి తిరుగు లేదన్నంత కచ్చితంగా ఒత్తి పలికింది పుష్ప.
కూతురి నిర్ణయానికి తిరుగుండదని తెలుసు మల్లయ్యకు. కూతురి పెళ్లికోసం దాచిన డబ్బు ఖర్చయి పోతున్నదేనన్న బాధ, ఆ పిల్ల పట్ల జాలి నిండిన ప్రేమ, భార్య కోరికను తీర్చకుండా ఉండలేని అశక్తత ముప్పేటలుగా మనసును కమ్మెయ్యగా.. కూతురి తల నిమిరి, భార్య చేతి మీద మృదువుగా, ఆత్మీయంగా తడుతూ..
“నిన్ను నీ అత్తమ్మ కాడికి తీస్కపోతున్నాం సారమ్మా!” అన్నాడు మల్లయ్య.
అంత అనారోగ్యంలోనూ ఉబికిన ఉత్సాహంతో భర్త చేతిని అందుకున్నది సారమ్మ.
పేషెంట్ సారమ్మనూ, మల్లయ్య, పుష్పనూ అంబులెన్సులోకి ఎక్కించి, కొంచెం ఎడంగా పోయి.. తన భార్య పద్మశ్రీకి ఫోన్చేసి వివరాలతో శుభవార్త చెప్పి..
“గీ మాత్రం దూరానికి కిరాయి ఎంతో ఎరుకనా? ఇరవై వేలు” అన్నాడు పరమేశ్.. లోనుంచి తన్నుకొస్తున్న ఆనందాన్ని బలవంతాన అదుపుజేసుకుంటూ.
“నిజమేనా.. గప్పాలా?” నమ్మలేక పోయింది అతగాడి ధర్మపత్ని.
“ఇంటికి పైసల్ దెస్త గదా. గంత నమ్మకం లేదా? గీడ ఊరోల్లు దొరికిన్రు”.
“అబ్బో.. కరోనా రోజుల్నుంచెల్లి నీగ్గూడా దిమాక్ మంచిగనే పంజెయ్యబట్టినట్లున్నదే!? కరోనా గిరాకీలతోని ఇల్లు గట్టినవ్. ఇంక గిసుంటి బేరాలు మూడు నాలుగు తలిగితే.. నా ఒడ్డానానికి గూడ పైసల్ సరిపోతయి!”.
“నువ్వు సన్నబడరాదు.. గప్పుడే సరిపోతయి!” కిచకిచ నవ్వాడు.
“సంపుత!..” తనూ నవ్వింది.
“మల్లెపూలు, తెల్ల చీరతోని సోగతం పలకాలె నాకు రాత్రికి”.
“ఛీ.. సిగ్గు లేదు. గసుంటి మాటల్ మాట్లాడుతరా పోన్ల? పెట్టెయ్యి పోను!” నవ్వుతూ కసిరింది పద్మశ్రీ.
ఈ రాత్రికి ఇంటి దగ్గర గడపబోయే సరస సన్నివేశాలను ఊహించుకుంటూ, ఈలపాట సాయంతో వచ్చి.. అంబులెన్స్ను ముందుకు ఉరికించాడు పరమేశ్.
సారమ్మ వైపే ఆశగా చూస్తూ, కూర్చుని ఉన్నారు తండ్రీకూతుళ్లు.
తగ్గిందనుకున్న వాన మళ్లీ పెరిగి, రెచ్చిపోయి కొడుతున్నది. బండి ఘట్కేసర్ దాటింది.
“అన్నా! అమ్మ కండ్లు జూస్తాంటే బయమైతాంది. జర సూడన్నా”.. పరమేశ్తో గాభరాగా అన్నది పుష్ప.
“అవ్! గట్ల పెడ్తందేంది కండ్లను?!” అన్నాడు మల్లయ్య కూడా ఆందోళనతో.
బండిని ఆపి, వచ్చి.. సారమ్మ మొహంలోకి చూస్తూ..
“సచ్చిపోయిందా ఏందీ?” అని గొణిగాడు పరమేశ్.
ఆ మాటలకు కెవ్వుమన్నది పుష్ప.
“గట్లనకయ్య” అన్నాడు మల్లయ్య కంగారుగా.
“సూడనీకి గట్ల కండ్లబడితే అన్ననంతే..” అంటూ పనిచెయ్యని ఉత్తి ఆక్సిజన్ ట్యూబులను అటూఇటూ కదిపి..
“మంచిగ ఎక్కుతాంది ఆక్సీజను. ఇగ మన అదురుస్టం మల్ల!”.. చక్కగా అబద్ధమాడాడు పరమేశ్. ఆపైన..
“గిట్లంటున్ననని తప్పుగా అనుకోకున్రీ.. చెప్పలేదంటరు. దార్ల పేషంటు గిట్ల సచ్చిపోతే మూడొందలు ఎక్కువియ్యాలె”.
అతని మాటలకు చాలా బాధపడుతూ.. సారమ్మ ముఖంలోకే చూస్తున్నారు తండ్రీకూతుళ్లు భయంభయంగా, బెంగగా.
ఎలాగైతేనేం.. పడుతూ లేస్తూ చివరికి గమ్యం చేరింది అంబులెన్స్. వాన పూర్తిగా తగ్గింది కూడా.
“జల్ది పేషెంటును దింపుకొని పైసలిచ్చి పంపున్రి నన్ను!” అని తొందరపెట్టాడు పరమేశ్.. జేబులో మోగుతున్న ఫోన్ తీసుకుని మాట్లాడటానికి దూరంగా వెళ్తూ..
పొరుగువారి సాయంతో సారమ్మను జాగర్తగా మోసుకు వెళ్లి, కుక్కి మంచం మీద గోడకు జారగిలబడి, కట్టున్న కాలు జాపుకొని కూర్చుని ఉన్న తన తల్లి యాదమ్మ పక్కనే పడుకోబెట్టాడు మల్లయ్య. చలనం లేని సారమ్మలో ప్రాణం ఉందా లేదా అన్న అనుమానం అందర్లోనూ పీకుతూనే ఉన్నది.
“అమ్మ అమ్మ.. నా కోడలచ్చినదా!? నా బంగారు తల్లచ్చినదా..” అంటూ కళ్ల నీళ్లయిపోతూ, ఆమె తలను ఒళ్లోకి తీసుకుని, నుదుటిమీద తన చల్లని చేత్తో రుద్దసాగింది యాదమ్మ.
అంతే!.. వింతగా చలనమొచ్చింది సారమ్మలో. నెమ్మదిగా కండ్లు తెరిచింది. అత్తను చూసింది. పెల్లుబికిన ఆనందంతో ఆమె చెంపలు అదిరాయి. “అ..త్త..మ్మా” అనడానికి ఆమె పెదవులు కదిలాయి.
ఆ పెదవుల కదలిక అర్థమైన యాదమ్మ..
“అత్తమ్మనే అమ్మా.. నేనే తల్లీ! గిట్లయిపోయినవేందే అమ్మా. సిక్కి కంపయిపోయినవ్. ఇగ నువ్వే దవ్వఖానకూ పోవద్దు బిడ్డా.. నేను జూసుకుంటా.. ఆఁ.. కండ్లల బెట్టుకుని నా బిడ్డను నేనే జూసుకుంటా! నూరేండ్లు బతుకుతది బిడ్డ..” గద్గద స్వరంతో అంటూ, సారమ్మను పొదివి పట్టుకున్నది యాదమ్మ.
ఆ ఆత్మీయతకు సారమ్మలో నూతనోత్సాహం వచ్చింది.
“అత్తమ్మా” అంటూ ప్రయత్న పూర్వకంగా చేతులతో ఆమె విరిగిన కాలిమీద సుతారంగా రాస్తూ, దుఃఖంతో ముఖాన్ని ఆమె ఒడిలో దాచుకుంటూ, వెక్కుతూ నీరసంగా..
“ఇరిగిన కాలుతోని ఇంటికాడ పెద్దదానివి నువ్వొక్కదానివే ఉండి ఏం కట్టాలు పడుతున్నావోనని గక్కడ నా పానం కొట్టుకుంటనే ఉంది.. నిన్ను జూస్కోనీకి నేనుండొద్దా మల్ల!” అన్నది.
భళ్లున ఇద్దరూ ఆత్మీయంగా బావురుమన్నారు.
సారమ్మ ఆరోగ్యస్థితిలో వచ్చిన గొప్ప మార్పులకు సంభ్రమాశ్చర్యాలకు గురవుతూ.. మల్లయ్య, పుష్ప వెన్నెల విరిసినట్లు నవ్వుతూనే ఏడవసాగారు.. ఏడుస్తూనే నవ్వసాగారు!
“అమ్మకు మంచిగైతదిగ. నువ్వు సేఠ్ కాడికి గా అంబులెన్స్ డ్రైవర్ను తీస్కపోయి, కిరాయిప్పించి రా అయ్యా!” అన్నది పుష్ప.
“అవ్ బిడ్డా! గీ సంబురంల గా సంగతే మరిచిన. ముందుగాల ఆయినెకు మజ్జిగో మంచినీల్లో ఇయ్యాలె పాపం!” అంటూ బయటికి గబగబా నడిచాడు మల్లయ్య.
కానీ, అక్కడ పరమేశ్ లేడు. అసలు కనుచూపు మేరలో అంబులెన్సే లేదు.
“ఏదో పోనొచ్చినాది.. మాట్లాడి, పరేషాన్తోటి బండి దీస్కుని ఇస్పీడుగ ఎల్లిపోయిండు” అని చెప్పాడు పక్కింటి అబ్బాయి.
మల్లయ్యకేం తెలుసు.. ఆ వచ్చిన ఫోన్ హైదరాబాద్కు ముప్ఫై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊర్లోని పరమేశ్ ఇంటి నుంచి, అతగాడి తమ్ముడు చేశాడనీ..
‘వదినమ్మను పాము కరిచిందన్నా. ఈడ వాన బీబత్సంగ, భయంకరంగ కొడుతున్నది. రోడ్ల మీద చెట్లు, స్తంబాలు పడిపోయినయ్. ఏ బండీ కదిలెటందుకు జాగ లేదు. ఆమెను జల్ది హైదరాబాద్ తీస్కపోన్రనీ.. లేకుంటే ఆమె పానానికి ఏమైతదో చెప్పలేమని మన పక్కింటి డాక్టర్ సాబ్ అంటుండన్నా!’ అని ఏడుస్తూ చెప్పాడని!?
‘అరే.. పిచ్చోడు. పాపం.. పైసల్ తీస్కునుడు మర్చిపోయిండా ఏందీ? చ్చ్..చ్చ్.. పోన్ నెంబరన్న తీసుకోక పోతిని’ అని నొచ్చుకుంటూ.. అలాగే పైకి చూస్తూ ఉండిపోయాడు మల్లయ్య.
అతని కండ్లెదురుగా.. ఆకాశంలో మబ్బులు తొలగి నవ్వుతూ బయటికి వస్త్తున్న చందమామ.
“అత్తమ్మనే అమ్మా.. నేనే తల్లీ!
గిట్లయిపోయినవేందే అమ్మా.
సిక్కి కంపయిపోయినవ్. ఇగ నువ్వే దవ్వఖానకూ పోవద్దు బిడ్డా..
నేను జూసుకుంటా.. ఆఁ.. కండ్లల
బెట్టుకుని నా బిడ్డను జూసుకుంటా!”
గద్గద స్వరంతో అంటూ, సారమ్మను పొదివి పట్టుకున్నది యాదమ్మ.
తులసి బాలకృష్ణ
రచయితగా, రంగస్థల నటుడిగా, దర్శకుడిగా తెలుగువారికి సుపరిచితులు తులసి బాలకృష్ణ. నాలుగున్నర దశాబ్దాలుగా కళా సేవలో తరిస్తున్నారు. వీరి స్వస్థలం హైదరాబాద్. బ్యాంక్ మేనేజర్గా పనిచేసి, విరమణ పొందారు. ఇప్పటివరకూ 500లకు పైగా కథలు, 40 నాటికలు, 8 నవలలు, 3 నాటకాలు, కొన్ని రేడియో నాటకాలు, టీవీ నాటకాలు రాశారు. మొదటి కథ ‘నైజం’, స్వాతి మాస పత్రికలో ప్రచురితమైంది. వంశీ సంస్థ నిర్వహించిన కథల పోటీలో మొదటి బహుమతి దక్కించుకున్నది. ‘తులసీ దళాలు’, ‘గిలిగింతలు’ కథల సంపుటాలను వెలువరించారు. ‘పురుషులందు..’ కథ, ‘సంచలన చిత్రం’ సీరియల్ విశేష ఆదరణ పొందాయి. అన్ని ప్రముఖ తెలుగు దిన, వార పత్రికలతోపాటు ఆన్లైన్ పత్రికల్లో వీరి రచనలు ప్రచురితమయ్యాయి. నాటకాలలో వేషాలు, దర్శకత్వం, గుణ నిర్ణయ కర్తృత్వం నిర్వహిస్తుంటారు. కొన్ని టీవీ సీరియల్స్లోనూ నటించారు. ప్రాణమున్నంత వరకూ కళా రంగాన్ని విడిచిపెట్టబోనని చెబుతున్నారు తులసి బాలకృష్ణ.
తులసి బాలకృష్ణ
87901 15544