Kasi Majili Kathalu Episode 106 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : శ్రీదర్శనుడు కారణజన్ముడై పుట్టాడు. మాళవ రాజ్యానికి చేరి, అక్కడి రాజుకు క్షయరోగాన్ని పోగొట్టాడు. దాంతో మాళవ రాజయ్యాడు. అతనికి లభించిన విగ్రహానికి గుడి కట్టించాడు. ఆ విగ్రహం యజమానురాలైన అనంగలతికను స్వప్నంలో చూసి, మోహించాడు. వాళ్లిద్దరికీ పెళ్లయింది. చివరికి ఒకరోజు అనుకోకుండా శ్రీదర్శనుడి భార్యలిద్దరూ మరణించారు. విరక్తుడై అతను అరణ్యాల పాలయ్యాడు.
“స్వామీ! ముందుగా మీరీ పళ్లు తినండి. తరువాత మేమెవరమో చెబుతాం” అన్నారు దివ్యకన్యలు. “కుదరదు. నేనీ పళ్లను స్వీకరించాలంటే.. మీరెవరో నాకు తెలియాలి” అన్నాడు శ్రీదర్శనుడు. “మీరు మావెంట మా ఇంటికి దయచేస్తే అలాగే చెప్పగలం” అన్నారు వాళ్లు. శ్రీదర్శనుడు వారివెంట బయల్దేరాడు. రావిచెట్టుకు కొంతదూరంలో భూమిలో సహజమైన బిలమార్గం కనిపించింది. దానివెంట లోపలికి వెళ్లగా స్వర్ణమయమైన భవంతి కనిపించింది. అక్కడ శ్రీదర్శనుడిని కూర్చోబెట్టి ఆ దివ్యకన్యలు తమ కథను చెప్పసాగారు.
పూర్వం ప్రతిష్ఠానపురంలో పవిత్రాధరుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను పుట్టుకతోనే నిరుపేద. వయసు ముదిరేకొద్దీ తాను ధనవంతుణ్ని కాలేకపోయానన్న బాధ పెరగసాగింది. దాంతో అతనొక తాంత్రికుణ్ని ఆశ్రయించి.. ఐశ్వర్యాన్ని పొందేందుకు ఏదైనా మంత్రం ఉపదేశించమని కోరుకున్నాడు.
అందుకాయన..
“అబ్బాయీ! సముద్రంలో మునిగినా, మేరు శిఖరమెక్కినా, శత్రువులను జయించినా, వ్యవసాయం వాణిజ్యం వంటివి చేసినా, పక్షిలా ఆకాశానికి ఎగిరినా.. ఎవరికి ఎంతప్రాప్తమో అంతే దక్కుతుంది. దైవం మన నుదుటిమీద ఏది రాశాడో అది కొంచెమే అయినా, చాలా అయినా శ్మశానంలో ఉన్నా వస్తుంది. మేరుపర్వతం ఎక్కినా అంతకంటే ఒక్కపిసరు ఎక్కువరాదు. అయినా నువ్వు కోరావు కాబట్టి నీకొక యక్షిణీ సాధక మంత్రాన్ని ఉపదేశిస్తాను. నెలరోజులపాటు ఆ మంత్రాన్ని జపించి, జాజిపూలతో హోమం చేయాలి. అప్పుడు దేవత ప్రత్యక్షమై నువ్వు కోరిన కోర్కెలు నెరవేరుస్తుంది. కానీ జాగ్రత్త సుమా! మంత్రసాధనలో అనేక భ్రమలు కలుగుతాయి. వాటికి లోబడిపోయి జపం విఘ్నమైందంటే దేవత నిన్ను అణగదొక్కేస్తుంది” అని హెచ్చరించి తగిన విధానం ఉపదేశించాడు.
పవిత్రాధరుడు ఆ మంత్రాన్ని శ్రద్ధగా జపించసాగాడు. అతని దీక్షను భంగం చేయడానికి యక్షిణీ దేవత అనేక ఆటంకాలు కల్పించింది. కానీ అతని మొక్కవోని దీక్షముందు అవేవీ నిలవలేకపోయాయి. హోమం పూర్తయ్యే సమయానికి దేవత ప్రత్యక్షమై చేతులు కట్టుకుని..
“దేవా! నేను నీకు కింకరురాలినయ్యాను. ఏం చేయాలో తెలపండి” అన్నది. అప్పుడు కూడా ఆ బ్రాహ్మణుడు హోమాన్ని ఆపలేదు. చివరికి యక్షిణి దివ్యరూపంతో ప్రత్యక్షమైంది.
“ప్రాణేశ్వరా! నేనే నీకు భార్యనయ్యాను. నాతో నువ్వు అభీష్ట కామాలను నెరవేర్చుకోవచ్చు. నువ్వు కోరిన వినోదాలన్నీ నేను కల్పించగలను” అన్నది. అతను కోరినంత ధనమిచ్చింది. పవిత్రాధరుడు ఆమెతో మానవాతీతమైన సౌఖ్యాలను అనుభవించసాగాడు. చివరికి అతనికి కొడుకును ఎత్తుకోవాలనే కోరిక కలిగింది. ఆ సంగతి యక్షిణికి తెలియచేశాడు.
అప్పుడామె..
“నువ్విలాంటి కోరిక కోరుకోవడం కూడా దైవనిర్దేశమే. నీకిప్పుడు నీ పూర్వజన్మ గురించి చెప్పాల్సి ఉంది” అంటూ ఒక కథ చెప్పింది.
..పూర్వం ప్రతిష్ఠానపురంలోనే కమలగర్భుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి పద్మ, బల అని ఇద్దరు భార్యలు. ఆ దంపతులకు ఒకరిపై మరొకరికి అంతులేని ప్రేమానురాగాలు ఉండేవి. వారికి పెద్దవయసు వచ్చిన తరువాత.. తమలో ఎవరు ముందుగా మరణిస్తారో.. ప్రియతముల మరణాన్ని కళ్లారా చూడాల్సి వస్తుందే అనే చింత బయల్దేరింది.
ఎవరికి వారే ముందుగా తామే మరణించాలని కోరుకున్నారు. చివరికి ముగ్గురూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. ప్రయాగలోని త్రివేణీసంగమం వద్ద వటవృక్షంపైకి ఎక్కి..
‘జన్మజన్మలకూ మేమే భార్యాభర్తలుగా పుట్టాలి’ అని కోరిక చెప్పుకొని నీళ్లలోకి దూకి ప్రాణాలు విడిచిపెట్టారు.
ఆ పుణ్యం వల్ల ఆ బ్రాహ్మణుడు.. యక్షులలో దీప్తశిఖుడనే పేరుతో పుట్టాడు. ఇక వాని భార్యలు జ్యోతిర్లేఖ, ధూమలేఖ అనే పేర్లతో జన్మించారు. ఆ దీప్తశిఖునికి అట్టహాసుడనే అన్నయ్య ఉండేవాడు.అని చెబుతూ మధ్యలో కొంతసేపు ఆపి..
“పవిత్రాధరా! గత జన్మలో నువ్వే ఆ అట్టహాసునివి. నేను ఆ జన్మలో నిన్ను ప్రేమించిన సౌదామినిని. ఈ జన్మలో కూడా నిన్నే పొందాను” అన్నది.
అతను ఆశ్చర్యంతో చూస్తుండగా ఆ యక్షిణి తన కథనిలా కొనసాగించింది. అట్టహాసునికి సౌదామినితో పెళ్లి కుదిరింది. దీప్తశిఖునికి జ్యోతిర్లేఖ, ధూమలేఖ సంబంధాలు వచ్చాయి. త్వరలో వాళ్ల పెళ్లిళ్లు చేయాలని పెద్దలు నిర్ణయించుకున్నారు. ఇంతలో ఒకరోజున అన్నదమ్ములిద్దరూ కలిసి.. తోటి స్నేహితులతో కలిసి ఒక నాటకం వేశారు. ఆ నాటకంలో అట్టహాసుడు కుబేరుని వేషం, దీప్తశిఖుడు నలకూబరుని వేషం వేశారు. ఆ నాటకం ఎలా ఉంటుందంటే.. , కుబేరుడు తన మంత్రి అయిన మణిభద్రునితో మాట్లాడుతున్నాడు.
కుబేరుడు: మణిభద్రా! అమరావతిలో మహాసభ బాగా జరిగిందా? నేను రానందుకు మహేంద్రులవారు ఏమైనా కోపగించారా?!.
మణిభద్రుడు: లేదు మహారాజా! నేను మొత్తం సంగతినంతా ముందుగానే మనవి చేశాను. మీ దగ్గర ఉండే నవనిధులలో కచ్ఛపమనే నిధిలోని రత్నాలను ఎవరో దొంగిలించారని.. వాటిని వెతికే పనిలో ఉండి సభకు రాలేకపోతున్నందుకు మన్నించమని మీరు కోరారని.. నన్ను, నలకూబరులవారిని మీకు బదులుగా పంపారని తెలియచేశాను. మహేంద్రులవారు సమ్మతించారు.
కుబేరుడు: బాగుంది. సభలో విశేషాలేమిటి?
మణిభద్రుడు: సభ మొత్తానికి నారద మహర్షుల వారి ఉపన్యాసమే కీలకం అయింది మహారాజా! ఆయన చెప్పిందేంటంటే..
‘స్వర్గ, మర్త్య, పాతాళాలనే మూడు లోకాలకూ మహేంద్రుడే అధిపతి. ఇప్పుడు మానవులు, పాతాళలోక వాసులు వారి బాధలను మీతో చెప్పమని నన్ను పంపారు. స్వర్గలోక వాసులు జరామరణాలు, రోగశోకాలు లేకుండా నిత్యయౌవనులై సుఖిస్తున్నారు. వాళ్లు మాత్రం నిత్యం రోగాల చేత, దారిద్య్రం చేత బాధలు పొందుతూ, శోకాలతో స్వల్పాయుష్కులమై, క్షణయౌవనులై కునారిల్లుతున్నారట. ఈ పద్ధతి మార్చాలని మానవులు తెలియచేశారు.
ఇక నాగులు తాము అడుగున పడి, చీకటిలో కొట్టుకుంటున్నామని అంటున్నారు. ఇంతకూ వాళ్ల కోరికేమిటంటే.. వాళ్ల లోకానికి ఇతర లోకాలతో సంబంధాలు తెంచేయాలి. స్వతంత్రాధికారాలు కావాలి. జరామరణ రోగాలు లేకుండా నిత్యసుఖం కలిగేలా చేయాలి.. ఇది వారి మాటగా నేను మీకు తెలియచేశాను’ అని చెప్పి నారదుల వారు కూర్చున్నారు.
అప్పుడు బృహస్పతులవారు పైకి లేచి ఇలా ప్రసంగించారు. ‘స్వర్గలోకం, మానవలోకం, పాతాళలోకం అనే ఈ త్రిభువనాలూ ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉన్నాయి. మేఘాలకు అధికారి ఇంద్రుడు. మేఘాలు వర్షిస్తే కానీ నేల పండదు. ఈ మేఘాలెంతగా వర్షించినా.. దేవలోకంలో మట్టి లేదు. పంటలు లేవు. అందువల్ల వారికి ఆహారం లేదు. భూలోకవాసులు చేసే యాగాల వల్లనే దేవతలకు ఆహారం కలుగుతున్నది. ఈ రెండిటినీ విడదీస్తే అక్కడ పంటలుండవు. ఇక్కడ భోజనం ఉండదు. ఇక నాగుల విషయానికి వస్తే వారు వెలుగులో జీవించలేరు. చీకటే వారికి తగిన స్థావరం. ఈ మూడు లోకాలూ ఒకే తీగపై ఉన్నాయి. ఆ తీగ లాగేస్తే అన్నీ పడిపోతాయి. అక్కడినుంచి పుణ్యబలం చేత ఇక్కడికి వచ్చినవారికి ఇక్కడివారు ఉపచారాలు చేయకతప్పదు. ఆ విధంగా దేవతలు కూడా పరాధీనులే అవుతున్నారు. మూడు లోకాలూ ఒకే ఇంటిలోని మూడుగదుల వంటివి మాత్రమే’ అన్నారు. ఆ తర్వాత ఈ అంశంపై అనేకమంది ఉపన్యాసరీతిలో తమ అభిప్రాయాలు చెప్పారు. ఇంద్రుని కుమారులైన జయంతుల వారిచ్చిన ఉపన్యాసం కూడా అందరినీ ఆకర్షించింది.
కుబేరుడు: కొంచెం ఆగు మణిభద్రా! మన నలకూబరుడు ఏమని ఉపన్యసించాడో చెప్పు.
మణిభద్రుడు: (కొంచెం భయంతో) మీతో ముందే చెబితే కోపగిస్తారేమోనని ఊరుకున్నాను ప్రభూ! మన నలకూబరుల వారు సభ ప్రారంభానికి ముందే రంభతో కలిసి నందనవనానికి వెళ్లిపోయారు. సభ చివరలో నాట్యం చేయడానికి రంభను పిలిపిస్తే ఆమెతోపాటే వచ్చి సభలో కూర్చున్నారు.
కుబేరుడు: (బాధగా) కొడుకులు గుణవంతులు కాకపోతే ఇలాగే ఉంటుంది. ఇంతలో నలకూబరుని మామగారైన కచ్ఛపుడు ప్రవేశించాడు. కుబేరునికి నమస్కరించాడు. కుబేరుడు అతణ్ని కుశల ప్రశ్నలు అడిగాడు.
కచ్ఛపుడు: అల్లుడు వేశ్యాలోలుడై, కుమార్తెను పట్టించుకోకపోతే ఆ తండ్రి పడే బాధ పగవాడికి కూడా వద్దు ప్రభూ! మీ కోడలు రత్నపదిక సుగుణాలు లోకుల వలన తెలియాల్సినవే కానీ, నేను చెప్పాల్సినవి కాదు. రాచబిడ్డ కదా అని మీ ఐశ్వర్యానికి ఆశపడి నేను పిల్లనిచ్చాను. ఇన్నాళ్లుగా భర్త ఏం చేసినా నోరెత్తకుండా మీ కోడలు ఉపచారాలు చేస్తున్నది. ఊరుకుంటున్నది కదా అని ఉంపుడుకత్తెను తెచ్చి పడకింట్లోనే పెట్టుకోవడం.. భార్యచేతే దానికి ఊడిగం చేయించడం భావ్యమా?! ఇదంతా ఆమె తల్లివల్ల రహస్యంగా తెలుసుకుని, ఉండబట్టలేక మీతో చెప్పుకొందామని వచ్చాను. బావగారూ! మీరే ఎలాగైనా మీ కొడుక్కి నచ్చజెప్పండి. ఆ మాటలు విని కుబేరుడు కళ్లెర్ర జేశాడు.
కుబేరుడు: (గర్జిస్తూ..) నలకూబరుడెక్కడ? కొంతసేపటికే అతను వచ్చి తండ్రి ముందు నిలుచున్నాడు. కొడుకును చూసి పళ్లు కొరికాడు కుబేరుడు.
కుబేరుడు: ఏమిరా?! ఆ రంభను తెచ్చి, ఇంట్లో పుస్తెకట్టిన భార్యను వెళ్లగొట్టాలని చూస్తున్నావట?! ఇదెక్కడి ఆగడం?! వెంటనే ఆమెను బయటికి పంపకపోతే మహేంద్రునికి రాసి, నీ రంభను చెరసాలలో పెట్టించగలను. జాగ్రత్త!
నలకూబరుడు తలవాల్చుకుని ఏదో చెప్పబోయాడు.
.. ఇంతలో నిజమైన నలకూబరుడు అటువైపునుంచే ఆకాశమార్గంలో వెళ్తున్నాడు. వీరి నాటకం చూసి దగ్గరికి వచ్చాడు. జరుగుతున్నదంతా చూసి కోపోద్రిక్తుడై ఊగిపోతూ వేదిక మీదికి వచ్చేశాడు.
నాటకం వేస్తున్న వాళ్లందరూ గడగడ వణికిపోతూ ఆయనకు మొక్కారు.
“అట్టహాసా! మీరు మా భృత్యులై ఉండికూడా మా వేషాలే వేసి మమ్మల్నే ఆక్షేపించేటంత వారయ్యారా?! మా తండ్రి నాకు విధించే శిక్షను కూడా విన్న తరువాత రావాల్సింది. కోపం పట్టలేక ముందే వచ్చేశాను. పాపం.. మీకు మానవులంటే చాలా అభిమానం కాబోలు. మీరందరూ మానవులై భూలోకంలో జన్మించండి” అని శపించాడు.
దాంతో అట్టహాసుడు ఆయన పాదాలపై పడి..
“దేవా! ఏదో పిల్లవాళ్లం.. తెలియక వినోదం కోసం ఈ నాటకం ఆడుతున్నాం. మిమ్మల్ని ఆక్షేపించాలని ఎంత మాత్రమూ కాదు. దయతో ఈ శాపాన్ని ఉపసంహరించండి” అని వేడుకున్నాడు.
అందుకు నలకూబరుడు..
“అట్టహాసా! నా శాపం అమోఘం. అనుభవించక తప్పదు. మీరు నాపై చేసిన ఆక్షేపణలన్నీ లోకంలో ప్రచారంలో ఉన్నవే. సరే.. నువ్వు ముందుగా మానవుడివై జన్మిస్తావు. ఇప్పుడు నువ్వు వివాహమాడాలని నిశ్చయించుకున్న యక్షిణినే తపస్సుతో సాధించుకుంటావు. ఆమె వల్లనే నీ తమ్ముణ్ని పుత్రునిగా పొందుతావు. దానితో నీకు శాపం పూర్తవుతుంది. నీ తమ్ముడు మరికొంతకాలం భూమిపై ఉండక తప్పదు. అతనికి భార్యల వల్ల పూర్వస్మృతి కలిగినప్పుడు శాపాంతం అవుతుంది” అని సెలవిచ్చాడు.
.. అలా అట్టహాసుడు ప్రతిష్ఠానపురంలో పవిత్రాధరునిగా పుట్టాడు. యక్షకాంతను వశం చేసుకుని ఒక పుత్రుణ్ని కన్నాడు. ఆ పుత్రుణ్ని దేవదర్శనుడనే సోమయాజి యాగశాలలో ఉంచి.. తాను యక్షలోకానికి వెళ్లిపోయాడు.
ఆ పుత్రుడే శ్రీదర్శనుడు.. అంటే నువ్వే! మేమిద్దరం గతజన్మల్లో నీకు భార్యలమయ్యాం. పద్మిష్టగా, అనంగలతికగా వచ్చినవాళ్లం మేమే. ఆనాడు మాకు పూర్వస్మృతిని కలిగించేందుకు వచ్చినవారు మీ అన్నగారైన అట్టహాసుల వారే..
.. అని ఆ దివ్యకన్యలు చెప్పగానే శ్రీదర్శనుడికి పూర్తిగా పూర్వస్మృతి కలిగింది. అతని మానవదేహం పండుటాకులాగా నేలపై రాలిపోయింది. పూర్వపు యక్షరూపం కలిగింది. భూలోకాన్ని విడిచిపెట్టి, దీప్తశిఖుడనే నామంతో శ్రీదర్శనుడు భార్యలతో కలిసి అలకాపురానికి తరలిపోయాడు.
(వచ్చేవారం.. భక్త చింతామణి)
– అనుసృజన: నేతి సూర్యనారాయణ శర్మ