Jaya Senapathi | జరిగిన కథ : జాయపుని నెత్తిన కొత్త బాధ్యతలు పెట్టాడు చక్రవర్తి. అనుమకొండలో వీడ్కోలు తీసుకుంటూ.. అంతఃపురం వెళ్లాడు జాయపుడు. నారాంబ కన్నీరుమున్నీరయ్యింది. తమ్ముణ్ని ఆర్తిగా అల్లుకుంది. అక్క, మేనల్లుళ్లపై కుట్రలు జరుగుతున్న సమయంలో వాళ్లకు దూరం కావాల్సిరావడం.. జాయపుణ్ని విచికిత్సకు లోనుచేసింది. ఆ భయాన్ని తొలగిస్తూ అభయమిచ్చాడు గణపతిదేవుడు. అప్పుడే.. పెళ్లి ప్రస్తావన కూడా తెచ్చారు. తానొక గ్రామీణ యువతిని ఇష్టపడ్డాననీ, అందువల్ల మరో స్త్రీని భార్యగా స్వీకరించలేనని చెప్పాడు జాయపుడు. ఇద్దరూ నిరుత్తరులయ్యారు. జాయపుని వ్యక్తిగత సామగ్రి అంతా అప్పటికే వెలనాడువైపు పంపించారు. విక్రమ వద్ద నిలబడిన అంకమరట్టను మరోసారి అడిగాడు జాయపుడు..
“వైద్యుడి మరణం వెనక అసలువ్యక్తి ఎవరో.. తెలిసిందా అంకమా?”.
“ఇక ఆ సంగతి వదిలెయ్యండి నాట్యాచార్యా! మహామండలేశ్వరులు ప్రసాదిత్య సేనానిని స్వయంగా విచారించి తీవ్రంగా హెచ్చరించారని.. ఈ విషయంలో కుతూహలం చూపవద్దని.. నన్ను మా గూఢచార నియోగాధిపతి కూర్మయ హెచ్చరించారు”.
“ఓ.. విషయం అంతవరకూ వెళ్లిందన్నమాట. ఇక మనం దీనిని పక్కన పెట్టవచ్చా అంకమా?”.
“ప్రస్తుతానికి పక్కన పెడదాం నాట్యాచార్య!”. ప్రశాంతంగా ధనదప్రోలు వచ్చేశాడు జాయప.
తలగడదీవి గ్రామ పొలిమేరల్లోని కృష్ణాతీరం..
పినచోడుని సమాధి.. దాని చుట్టూ నిర్మించిన ఉద్యానవనం. జాయపుడు నిత్యమూ అక్కడికి వెళతాడు. తండ్రి సమాధిని చూస్తూ కూర్చుంటాడు. కాసేపటికి తండ్రి కర్మల రోజు కనిపించిన ఆమె.. ఆమెకోసం వెతుకుతాడు. కృష్ణమ్మ ఒడ్డున అదొక శిథిలమందిరాల ప్రాంతం. గొడ్లను మేపుకొనే కుర్రాళ్లను, అక్కడ తిరుగాడే పెద్దలను అడుగుతాడు. ప్చ్.. ప్రయోజనం శూన్యం. తండ్రి సమాధి వద్ద జారగిలపడతాడు. వెలనాడు వచ్చిననాటి నుంచి నిత్యమూ అదే కార్యక్రమం.
వెలనాడుకు పాలకుడిగా సోదరుడు జాయపుడు వస్తున్నాడంటే.. అయ్య కుటుంబమంతా ఆనంద డోలికల్లో ఉయ్యాలలూగింది. ఓ కొత్త పండుగ వాతావరణం.. కొత్త చైతన్యం ఏదో తలగడదీవి అంతటా పొంగి పొర్లింది. బావగారు నిర్దేశించకపొతే తమ్ముడు ఇక్కడికి వచ్చేవాడు కాదు. అక్కను, మేనల్లుళ్లను విడిచి అనుమకొండ వదిలి మరోచోటుకు.. అదీ జన్మభూమైనా జాయపుడు వస్తాడని అన్నదమ్ములు అనుకోలేదు.
వచ్చినందుకు వాళ్లంతా ఎంతో సంతుష్టి చెంది, జాయపుణ్ని అపురూపంగా చూడసాగారు.
అయితే జాయపుడు వాళ్లు ఊహించినంత ఉత్సాహంగా లేడు. చక్రవర్తి బావగారు, అక్క పొగుడుకున్నంత ఉత్తేజంగానూ లేడు. మహాయుద్ధ వీరత్వం కనిపించడం లేదు. ఏనుగులతో యుద్ధతంత్రాలు పన్నిన విశేష లక్షణం గోచరించడం లేదు. సాక్షాత్తూ శివుడే దిగివచ్చి నాట్యమాడుతున్నాడనే చురుకు ఎటుపోయిందో!? అక్కల పెళ్లి నాడున్న ఉత్సాహం, దూకుడు కూడా ఇప్పుడు కనిపించలేదు.
దినదినమూ ప్రవర్తన అలా స్తబ్ధుగా ఉంటున్నది.
కానీ ఓ రోజు.. పినచోడుని సమాధి వద్ద కూర్చుని ఉన్నాడు జాయపుడు.
దగ్గరగా కృష్ణ నీటిపాయపై సర్రున జారిపోతున్న నాటుపడవలు.. తోపుడు తెడ్లు వేస్తూ.. లాగుతూ జాలరుల మాటలో.. పాటలో.. స్పష్టాస్పష్ట పలుకుబడి సౌందర్యం, యాస మాధుర్యం వింటున్నాడు. వాటారుతున్న ఎండ.. గాలితో కలిసి కృష్ణా తరంగాలతో చెప్పే కబుర్ల చల్లదనపు గిలిగింతలు.. నదీ అలల లోనుంచి పైకి ఎగురుతున్న చేపలు.. ఎగిరినప్పుడల్లా పడమట వాలుతున్న సూర్యకిరణాలకు మిలమిలా మెరిసి.. మళ్లా గొప్ప ఈతగాడిలా నీటిలోకి సర్రున దూకుతున్నాయి. వాటి ఆటలను విభ్రమంగా చూస్తూ.. నీలి ఆకాశాన పల్లటీలు కొడుతున్న పిట్టలు, పక్షులు.
ఆ సాయంవేళ ఆహ్లాదపరుస్తున్న కృష్ణా తరంగాలలా ఆలోచనా తరంగాలు లోపలా బయటా చుట్టుకుని, మనసును ఒరుసుకుని ప్రవహిస్తున్నాయి.
నారాంబ తమ్మునిగా రాజనగరికి చేరాక జరిగిన సంఘటనలు.. సంఘర్షణలు.. యవ్వన ఉదంతాలు. కాకతి, ఇంద్రాణి, లలితాంబ..
మొత్తంగా జీవితంలో ఓడిన ప్రేమికుడిగా మిగలడం.. తల విదిల్చాడు. ఓటమి ఏమిటి??
ఒళ్లంతా వణికింది. జాయపునికి ఎప్పుడూ ఆ భావన కలగలేదు. అసలు ఓటమి అనేదే తెలియదు. ఆలోచనల్లో.. యుద్ధాల్లో.. నాట్యాల్లో.. ఓటమి ఇప్పటివరకూ ఎప్పుడూ దరిచేరలేదు. అది ఎలా ఉంటుందో కూడా తెలియదు.
కానీ, కానీ ఈ యవ్వనోల్బణ వేళ.. ఈ అమ్మాయిల ప్రేమ సమాగమంలో మాత్రం ఎందుకు కలిగింది??
కాకతి వద్దనుకుని దూరమైంది. అది ఓటమి కాదా!? కాకతి సరే.. ఇంద్రాణి ఎందుకు తనను వద్దనుకున్నది? అదొక ఓటమి కాదా!? లలితాంబ?? ‘ఛీ పో!’.. అన్నది. అది ఓటమి కాదా!?
ఇద్దరిని వదిలేయ్. కాకతి ఆలోచనే ఓ శృంగారబంధం. ఆమె తనలో పూర్తిగా నిండి ఉంది. తన చుట్టూ నృత్త మాడుతుంది. తాకీ తాకకుండా తాకుతుంది. నవ్వుతుంది. ఆమె నవ్వు తనకు వినిపిస్తుంది. ఆమె చెప్పే కబుర్లు అన్నీ.. తనను మోహావేశంలో ముంచెత్తుతాయి. ఆమె ఊహే వసంత కాలపు పూదోట.. ఆమెతో నృత్తానుభూతిని మించిన సంసార సాన్నిహిత్య మధురిమ ఏముంటుంది? అందులో ఓటమి ఏముంది??
దూరమైన కాకతి ఎప్పటికైనా దరి చేరుతుంది. అప్పటిదాకా ఎన్ని సంవత్సరాలైనా.. ఎన్ని యుగాలైనా ఎదురుచూస్తాడు. ఇక ఓటమి అన్నభావనే జీవితంలో లేదు. ఎప్పటికి.. ఎప్పటికీ దరి చేరదు. ఓటమి అనే భావనను భరించుకోలేకపోతున్నాడు.
ఓటమట.. ఓటమి.. ఆ భావనే భరించలేనట్లు ఉద్వేగంతో ఊగిపోయాడు. చివ్వున లేచాడు. కృష్ణమ్మ జడుసుకునేలా పెనుకేకలు పెట్టాడు. అటూ ఇటూ పరుగులు పెట్టాడు. నదిలో నావలు ఒరిగిపోయేలా అరిచాడు.. అరిచాడు.. మళ్లీ మళ్లీ! అంతే వేగంతో నడబంధంలో ఉన్న చురకను లాగాడు. దూరంగా గలగలా నవ్వుతున్న కృష్ణమ్మ పైకి విసిరేశాడు. చురక గాలిని చీల్చుకుంటూ వెళ్లి కృష్ణా తోయమాలికలపై రెండు మూడు పల్లటీలు కొట్టి, అప్పుడే పైకి ఎగసిన ఓ మహామత్స్యాన్ని మధ్యగా చీల్చుకుని ఆవల ఒడ్డుపై వెళ్లి పడింది.
అప్పుడు చల్లారింది జాయపునిలో ఉవ్వెత్తున ఎగసిన ఓటమి భావన లోలోన రగిలించిన బడబాగ్ని!!
ధనదుపుర వీధులు..
సంధ్యవేళ హాయిగా ప్రశాంతంగా వీధినంతా పరికిస్తూ ముందుకు పోతున్నాడు జాయపుడు. ఇప్పుడు మండలాధీశుడులా లేడు. నారాంబక్క ఎంపికచేసిన రాజదుస్తులు, ఆభరణాలు.. సేనాని, గజసాహిణి పదవులొచ్చి అలంకరించిన రాజోచిత చిహ్నాలు త్యజించాడు. ఓ సాధారణ కుర్రాడిలా తిరుగసాగాడు.
బాబయ బ్రహ్మయచోడుని చెంత అన్న పృథ్వీశ్వరునితో చెప్పాడు జాయపుడు..
“బావగారి మాటపై పదవిని స్వీకరించాను కానీ నిజానికి రాజతంత్రంలో ప్రతిభలేదు నాకు. యుద్ధతంత్రం అనండి, నాట్యతంత్రం అనండి.. నేను సై! నాతో పోటీ పడేవాడేలేడు. కాబట్టి నన్ను నా మానాన వదిలేసి దయచేసి మీరే పాలనాభారాన్ని వహించండి అన్నా!” అని.
“కానీ, బావగారు నిర్దేశించినట్లు పాలన నీ నామంతోనే కొనసాగుతుంది తమ్ముడూ. దీన్ని కాదనకు..” అన్నాడు పృథ్వీశ్వరచోడుడు.
బ్రహ్మయ వార్ధక్యం వల్ల మందిరానికి పరిమితం కాగా.. రాజ్య వ్యవహారాలు పృథ్వీశ్వరుడే నిర్వహిస్తున్నాడు.
“ఇన్నేళ్లకు ఇంటికి వచ్చావు. హాయిగా ఇక్కడి సమస్యలు, అక్కడి సమస్యలు, నీ మనసులోని సమస్యలు.. అన్నీ పక్కనపెట్టి, హాయిగా కొంతకాలం ఇక్కడే ఈ కృష్ణాతీరంలో విశ్రాంతిగా గడుపు జాయా!”.. అన్న మాటల్లోని ఆత్మీయత.. చుట్టూ నిలబడి చూస్తున్న అన్నదమ్ముల కళ్లల్లో కూడా తొణికిసలాడటం.. జాయపుని హృదయానికి తాకింది. మనసు ఆర్ద్రమయ్యింది.
విశ్రాంతిగా ధనదపురంలో కొన్నిరోజులు, తలగడదీవిలో కొన్నిరోజులు గడిపాడు. తర్వాత కొంత తెప్పరిల్లాడు. బయటికి పోవాలని మనసు లాగుతున్నది.
అనుమకొండలోలాగే వెలనాడు సమాజంలో తిరగాలి. మిళితం కావాలి. ముఖ్యంగా జనపదాలలో.. చతుష్పథాల వద్ద, వెలివాడల్లో.. తిరుగుతూ లోకధర్మి, నాట్యధర్మి.. రెండూ అవలోకించాలి. అదే తనకు సౌకర్యవంతంగా ఉంటుంది. సాధారణ దుస్తులలో తలగడదీవికోట దాటి బయటికి వచ్చాడు.
అప్పుడు అనుమకొండలో.. ఇప్పుడు ధనదుపురంలో.. తలగడదీవిలో.. హంసలదీవిలో.. నంగేగడ్డలో.. తూర్పు సముద్రపు అంచుల్లో.. కృష్ణమ్మ ప్రవహించే అన్నిపాయల.. ఆ ఒడ్డున ఈ ఒడ్డున. వెలనాడు కృష్ణానదికి పడమట వైపు ఉంటుంది. ద్వీపం తూర్పువైపు ఉంటుంది. ఈ నడుమ నదీమతల్లి చాలా విశాలంగా, నిండుగా ప్రవహిస్తూ ఉంటుంది. ద్వీపం వెలనాడులో భాగమైనా.. నది రెండుగా విడదీయడంవల్ల అటూ ఇటూ ప్రయాణాలు కష్టతరం. కానీ ఎన్నోరకాల పడవలు, నావలు, నౌకలు.. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటాయి.
అయ్యవంశస్తుల నివాసం తలగడదీవికోట ద్వీపంలో ఉంటే.. వెలనాడు పాలనానివాసం ధనదుపురంలో ఉంది. ఈ రెండిటి మధ్య రాజ్యవంశీయులు లేదా వేగులు, వార్తాహరులు, సైనికులు నిరంతరం అటూ ఇటూ తిరుగుతూనే ఉంటారు. వీళ్ల కోసం నది ఎక్కడైతే కాస్త పల్లంగా ఉంటుందో.. అక్కడ పెద్దఎత్తున ఇసుకతో మేట వేసి రాచబాట ఏర్పరిచారు. ఆ ఇసుక నది ఆటుపోట్లకు కొట్టుకుపోకుండా ఆ రాచబాటకు ఇరువైపులా పెరికె సంచులతో ఇసుకను మూటలుగా కట్టి, వాటిని ఇనుప తీగతో కదలకుండా కట్టేశారు. రాత్రి, పగలు కూడా ఆ రాచబాటపై రాకపోకలు నడుస్తుంటాయి.
ఇలాంటి జనబాటలు కూడా ఇప్పుడు నది తక్కువలోతు ఉన్నచోటల్లా అనేకం ఉన్నాయి. అలాగే నది ఒడ్డున గుర్రాలు, ఏనుగులు, ఎద్దులు, గేదెలు, గాడిదలు తదితర వాహన జంతువులను కొంత అద్దెతో ఉంచుకునే జంతుశాలలు కూడా మిక్కుటంగా ఉన్నాయి. ఇక పౌరుల కోసం, రాజకులీనుల కోసం ఉన్న సత్రాలు, పూటకూళ్ల ఇళ్లు కోకొల్లలు. పరాయి గ్రామస్తులు చాలామంది మిత్రుల ఇళ్లలో రాత్రిళ్లు పరుండటం కూడా ఎక్కువే. ఇక బంధుమిత్రుల నివాసాలలో భోజనాలు సర్వసాధారణం. జాయపుడు ఆ రాచబాటపై నది దాటి విక్రమను జంతుశాల వద్ద అప్పగించి ప్రధాన వీధుల్లోకి ప్రవేశించాడు.
ధనదుపురం.. ధనదుడంటే కుబేరుడు. నిజానికి ఈ ప్రాంతాన్ని కుబేరకుడు అనే మహారాజు పాలించాడు. అతనివల్ల దీనికి కుబేరపురం లేదా ధనదుపురం అనే పేరు వచ్చింది. తర్వాత కాలానుగుణంగా ధనదువ్రోలు, ధనదుప్రోలు.. సనదువోలు.. అంటున్నారు.
అనుమకొండ రాజధాని అయితే ధనదపురం ధనవంతుల పట్టణం. అక్కడికి ఇక్కడికి వీధులలో తేడా పెద్దగా లేకున్నా.. అది సమస్త రాజ్యపౌరుల నివాసం. ఇది ధనవంతుల ఆవాసం. ఆ ధనమదాంధత వీధులలో, వాడలలో స్త్రీ పురుషుల ప్రవర్తనలో కనిపిస్తుంటుంది.
వెలనాడు సముద్రపు తీరాంధ్ర రాజ్యం కావడం వల్ల గాలి కాస్త విసురుగా.. ఎండ మరింత పెళుసుగా ఉంటుంది. గాలిలో తేమ తక్కువ. ఉమ్మది ఎక్కువ. తదనుగుణంగా చెమట మరీ ఎక్కువ. చెమట తుడుచుకుంటూ చేతులు వెనక్కు కట్టుకుని వీధులను, అంగళ్లను చూస్తూ ప్రధానవీధిలో నడుస్తున్నాడు.
వీధులలోని పౌరుల కదలికల్లో ముచ్చట్లలో స్వేచ్ఛానిబ్బరం, ఆత్మవిశ్వాస ప్రకటన స్పష్టంగా కనిపిస్తున్నది.
సంపాదన ఎక్కువ.. ఖర్చుపెట్టే ధోరణి కూడా ఎక్కువ. సకల సౌకర్యాలతో బతకాలనే సుఖలాలసత కూడా ఎక్కువేనని తెలుస్తున్నది.
సరుకు కన్నా అంగళ్ల అమరిక ఆకర్షణీయంగా ఉంది. అనేకానేక పదార్థాలు. అన్ని తాజాగానూ, నిగనిగలాడుతూ ఖరీదైనవిగా కనిపిస్తున్నాయి.
“ఓయ్.. తప్పుకో తప్పుకో!” అని అరవడంతో పక్కకు జరిగాడు.
(సశేషం)