ముంబై: పదిహేడేండ్ల సుదీర్ఘ విరామం తర్వాత టీ20 ప్రపంచకప్ గెలిచిన మూడ్ నుంచి అభిమానులు ఇంకా బయటకు రాకముందే భారత జట్టు మరో పర్యటనకు వెళ్లింది. సీనియర్ల గైర్హాజరీలో కుర్రాళ్లు జింబాబ్వేతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడేందుకు కుర్రాళ్లతో కూడిన యువ భారత్ మంగళవారం ముంబై విమానాశ్రయం నుంచి ప్రత్యేకవిమానంలో హరారే బయల్దేరింది. రియాన్ పరాగ్, తుషార్ దేశ్పాండే, అభిషేక్ శర్మ, రుతురాజ్, బిష్ణోయ్ వంటి యువకులతో కూడిన ఈ జట్టుకు నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ హెడ్కోచ్గా వ్యవహరించనున్నాడు.
ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యులుగా ఉన్న సంజూ శాంసన్, యశస్వీ జైస్వాల్, శివమ్ దూబె తుఫాను కారణంగా బార్బడోస్లోనే ఆగిపోవడంతో తొలి రెండు టీ20లకు ఆ ముగ్గురూ దూరమయ్యారు. దీంతో బీసీసీఐ వారి స్థానాలను ఐపీఎల్లో అదరగొట్టిన సాయి సుదర్శన్, జితేశ్ శర్మ, హర్షిత్ రాణాతో భర్తీ చేసింది.
లండన్లో కౌంటీ క్రికెట్ ఆడుతున్న సాయి బీసీసీఐ ఆదేశాలతో లండన్ నుంచి హుటాహుటిన హరారే విమానమెక్కాడు. భారత్కు వచ్చాక శాంసన్, జైస్వాల్, దూబె జింబాబ్వే వెళ్లనున్నారు. మిగిలిన మూడు మ్యాచ్ల నాటికి ఆ ముగ్గురూ అందుబాటులో ఉంటారని బీసీసీఐ పేర్కొంది. ఇక జింబాబ్వే టూర్లో భారత జట్టుకు సారథిగా వ్యవహరించనున్న శుభ్మన్ గిల్ అమెరికా నుంచి నేరుగా హరారేకు వెళ్లాడు.
రోహిత్, కోహ్లీ, జడేజా వంటి సీనియర్లు టీ20 ఫార్మాట్కు వీడ్కోలు పలికిన నేపథ్యంలో జట్టులో స్థానం సుస్థిరం చేసుకునేందుకు కుర్రాళ్లకు ఈ పర్యటన కీలకం కానుంది. ఈనెల 6 నుంచి 14 దాకా జరుగబోయే ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్కు హరారే ఆతిథ్యమివ్వనుంది.