న్యూఢిల్లీ: టీ20 వరల్డ్కప్లో ఇవాళ ఇండియా, సౌతాఫ్రికా మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనున్నది. అయితే బార్బడోస్లోని బ్రిడ్జ్టౌన్లో ఇవాళ వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. దీంతో మ్యాచ్కు అంతరాయం ఏర్పడనున్నట్లు తెలుస్తోంది. సెమీస్లో ఇంగ్లండ్పై ఇండియా, ఆఫ్ఘనిస్తాన్పై సౌతాఫ్రికా విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో రెండు జట్లూ ఇప్పటి వరకు ఓటమి చవిచూడలేదు. దీంతో పోరు ఆసక్తికరంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. కానీ వెదర్ ఎలా ఉంటుందో అన్న టెన్షన్ మొదలైంది. వర్షం పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో విజేతను ఎలా ప్రకటిస్తారో తెలుసుకుందాం.
ఒకవేళ ఇవాళ బ్రిడ్జ్టౌన్లో వర్షం పడినా.. ఫైనల్ కోసం రిజర్వ్ డేను ఉంచారు. ఒకవేళ రిజర్వ్ డే రోజున కూడా వర్షం వస్తే , అప్పుడు మ్యాచ్ను రద్దు చేయాల్సి ఉంటుంది. రేపు కూడా 99 శాతం ఆకాశం మేఘావృతమై ఉంటుందని వెదర్ రిపోర్టు చెబుతోంది. ఆదివారం కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నది. ఒకవేళ ఆదివారం కూడా వర్షం వల్ల మ్యాచ్ రద్దు అయితే అప్పుడు సౌతాఫ్రికా, ఇండియా జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు.