Virat Kohli | టీమ్ ఇండియా స్టార్ విరాట్ కోహ్లీ (Virat Kohli) లండన్ (London) బయల్దేరి వెళ్లారు. గురువారం రాత్రి ముంబైలో జరిగిన విజయోత్సవ వేడుకల్లో (Mumbai celebration) పాల్గొన్న కోహ్లీ.. అనంతరం లండన్ ఫ్లైట్ ఎక్కేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
కాగా, గత నెల 29న జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత హరికేన్ తుపాను కారణంగా బార్బడోస్లో చిక్కుకుపోయిన భారత ఆటగాళ్లు ఎట్టకేలకు గురువారం ఉదయం స్వదేశానికి తిరిగి వచ్చారు. ఇక ఉదయం నుంచి ఫుల్ బిజీగా గడిపారు. ప్రధాని మోదీతో భేటీ, ముంబై మెరైన్ డ్రైవ్లో ఓపెన్ టాప్ బస్సులో విక్టరీ పరేడ్, వాంఖడే స్టేడియంలో సత్కారం వంటి కార్యక్రమాలతో రోజు మొత్తం బిజీగా గడిపారు. ఇక సెలబ్రేషన్స్ పూర్తైన వెంటనే కోహ్లీ ముంబై ఎయిర్పోర్ట్లో దర్శనమిచ్చారు. లండన్కు బయల్దేరి వెళ్లినట్లు తెలిసింది.
కోహ్లీ ఇటీవలే రెండోసారి తండ్రైన విషయం తెలిసిందే. కోహ్లీ భార్య, ప్రముఖ బాలీవుడ్ నటి అనుష్క శర్మ (Anushka Sharma) ఈ ఏడాది ఫిబ్రవరిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం అనుష్క తన ఇద్దరు పిల్లలు వామిక, అకాయ్తో లండన్లోనే ఉన్నట్లు తెలిసింది. దీంతో వారిని కలుసుకునేందుకు కోహ్లీ టీ20 విక్టరీ సెలబ్రేషన్స్ అనంతరం వెంటనే లండన్ ఫ్లైట్ ఎక్కేశారు. భార్య, పిల్లలతో టీ20 విజయాన్ని సెలబ్రేట్ చేసుకోనున్నట్లు తెలుస్తోంది.
Also Read..
Sonu Sood | కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్లో సోనూసూద్ సందడి.. ఎలాంటి సాయం కావాలన్నా చేస్తా అంటూ హామీ
Chhattisgarh | ఛత్తీస్గఢ్లో విషాదం.. బావిలో విషవాయువు పీల్చి ఐదుగురు మృతి