Team India | బెరిల్ హరికేన్ (hurricane) ముప్పుతో ద్వీప దేశం బార్బడోస్ (Barbados)లో చిక్కుకుపోయిన భారత క్రికెట్ జట్టు (Team India) స్వదేశానికి రావడానికి మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. ముందుగా వారు జులై 2న అంటే మంగళవారం సాయంత్రం 6 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) అక్కడి నుంచి బయల్దేరి బుధవారం రాత్రి 7:45 గంటలకు ఢిల్లీ చేరుకుంటారని వార్తలు వచ్చాయి. అయితే, భారత జట్టు ప్రయాణం ఆలస్యం అయినట్లు సమాచారం.
తాజాగా అందుతున్న సమాచారం మేరకు భారత జట్టు జులై 4న అంటే గురువారం ఉదయం 6 గంటల కల్లా ఢిల్లీలో ల్యాండ్ అవుతుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. టీమ్ఇండియా క్రికెటర్లు, వారి కుటుంబ సభ్యులు, సహాయక సిబ్బంది, బీసీసీఐ ప్రతినిధి బృందం, స్పోర్ట్స్ జర్నలిస్టులు అంతా కలిపి 70 మంది వరకు ఉన్నట్లు అంచనా. వీరందరూ కలిసి బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో స్వదేశానికి తిరిగి రానున్నారు.
కాగా, వెస్టిండీస్లోని బ్రిడ్జ్టౌన్లో గత నెల 29న శనివారం దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. చివరి ఓవర్ వరకూ నరాలుతెగే ఉత్కంఠతో హోరాహోరీగా సాగిన ఫైనల్ పోరులో భారత్ 7 పరుగుల తేడాతో సఫారీలను మట్టికరిపించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. పొట్టి ఫార్మాట్ ఫైనల్ మ్యాచ్లో ఇంతవరకు ఇదే అత్యధిక స్కోరు. ఆ తరువాత బ్యాటింగ్కు దిగిన సఫారీలు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 169 పరుగులు మాత్రమే చేయగలిగారు.
దీంతో 17 ఏండ్ల (2007) తర్వాత టీ20 వరల్డ్ కప్ను భారత్ ముద్దాడింది. గత రెండు ప్రపంచకప్లలో తమను దెబ్బకొట్టిన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ను ఇంటికి పంపిన రోహిత్ సేన.. ఫైనల్లో సమిష్టి ఆటతీరుతో సఫారీలను మట్టికరిపించింది. పురుషుల క్రికెట్లో భారత్ ఐసీసీ కప్ను అందుకోవడం ఇది నాలుగోసారి. వన్డే క్రికెట్లో రెండుసార్లు ప్రపంచ చాంపియన్గా నిలిచిన భారత్, పొట్టి ఫార్మాట్లో కూడా దానిని సమం చేసింది. దీంతో యావత్ భారతావని సంబురాల్లో మునిగి తేలుతోంది. ఇక సొంతగడ్డపై భారత జట్టుకు ఘన స్వాగతం పలికేందుకు యావత్ దేశం సిద్ధంగా ఉంది. ఇక మ్యాచ్ అనంతరం జులై 1న వారు అక్కడి నుంచి బయల్దేరి రావాల్సి ఉంది. అయితే, బెరిల్ తుఫాన్ కారణంగా అక్కడ చిక్కుకుపోయారు.
Also Read..
Bhole Baba: భోలే బాబా అసలు పేరేంటి ?.. హాథ్రాస్ తొక్కిసలాటపై ఎఫ్ఐఆర్ నమోదు
Court verdict | కూతురిపై అఘాయిత్యం.. తండ్రికి 101 ఏండ్ల జైలు