Team India | టీ20 ప్రపంచకప్ విజేత టీమిండియా ఎట్టకేలకు బార్బడోస్ నుంచి సొంత దేశానికి ప్రయాణమైంది. బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో జట్టు భారత్లో రానున్నది. ఎయిర్ ఇండియా విమానం (AIC24WC) గురువారం ఉదయం ఆరు గంటలకు ఢిల్లీకి చేరుకుంటుందని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా వెల్లడించారు. అనంతరం 11 గంటలకు రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అవుతుందని తెలిపారు.
ఆ తర్వాత టీమిండియా బృందం ప్రత్యేక విమానంలో ముంబయికి బయలుదేరనున్నారు. ఈ సందర్భంగా విజయోత్సవం ర్యాలీ నిర్వహించనున్నారు. అలాగే, వాఖండే స్టేడియంలో బీసీసీఐ ప్రకటించిన రూ.125కోట్ల ప్రైజ్మనీ అందజేయనున్నట్లు రాజీవ్ శుక్లా తెలిపారు. బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ.. ‘భారత జట్టును తిరిగి తీసుకువచ్చేందుకు బీసీసీఐ ప్రత్యేకంగా ఎయిర్ ఇండియా విమానాన్ని పంపింది. అదే విమానంలో అక్కడ చిక్కుకుపోయిన మీడియా ప్రతినిధులను కూడా తిరిగి తీసుకువస్తాం. రేపు ఉదయం 6గంటలకు వారంతా ఢిల్లీకి చేరుకుంటారు. ప్రధానమంత్రి తన నివాసంలో ఉదయం 11 గంటలకు స్వాగత కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
కార్యక్రమం పూర్తయ్యాక ప్రత్యేక విమానంలో ముంబయికి బయలుదేరుతారు. నారిమన్ పాయింట్ నుంచి వాంఖడే స్టేడియం వరకు రోడ్ షో ఉంటుంది. జట్టు, కోచ్, సహాయక సిబ్బందిని సత్కరించి.. బీసీసీఐ ప్రకటించిన రూ.125కోట్ల పారితోషకం అందజేస్తాం’ అన్నారు. బీసీసీఐ సెక్రెటరీ జైషా సైతం టీమిండియా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా వివరాలను వెల్లడించారు. 4న సాయంత్రం 5 గంటలకు మెరైన్ డ్రైవ్ విజయోత్సవ ర్యాలీ ఉంటుందని.. వాఖండే స్టేడియంలో జరుపుకునేందుకు రావాలని అభిమానులకు పిలుపునిచ్చారు.