Team India | క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్ అందించింది. టీ20 ప్రపంకప్ గెలిచిన భారత జట్టు (Team India) బెరిల్ హరికేన్ (hurricane) తుఫాను కారణంగా బార్బడోస్ (Barbados)లోనే చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. అయితే, వారంతా స్వదేశానికి వచ్చేందుకు లైన్ క్లియర్ అయ్యింది. బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో భారత జట్టు బార్బడోస్ నుంచి స్వదేశానికి బయల్దేరేందుకు సిద్ధమైంది.
తాజాగా అందుతున్న సమాచారం మేరకు.. టీమ్ ఇండియా జట్టు ఇవాళ సాయంత్రం 6 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) బార్బడోస్లో బయల్దేరనుంది. బుధవారం సాయంత్రం 7:45 గంటలకు ఢిల్లీ చేరుకునే అవకాశం ఉంది. టీమ్ఇండియా క్రికెటర్లు, వారి కుటుంబ సభ్యులు, సహాయక సిబ్బంది, బీసీసీఐ ప్రతినిధి బృందం, స్పోర్ట్స్ జర్నలిస్టులు అంతా కలిపి 70 మంది వరకు ఉన్నట్లు అంచనా. వీరందరూ కలిసి చార్టెడ్ విమానంలో స్వదేశానికి తిరిగి రానున్నారు.
కాగా, వెస్టిండీస్లోని బ్రిడ్జ్టౌన్లో శనివారం దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. చివరి ఓవర్ వరకూ నరాలుతెగే ఉత్కంఠతో హోరాహోరీగా సాగిన ఫైనల్ పోరులో భారత్ 7 పరుగుల తేడాతో సఫారీలను మట్టికరిపించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. పొట్టి ఫార్మాట్ ఫైనల్ మ్యాచ్లో ఇంతవరకు ఇదే అత్యధిక స్కోరు. ఆ తరువాత బ్యాటింగ్కు దిగిన సఫారీలు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 169 పరుగులు మాత్రమే చేయగలిగారు.
దీంతో 17 ఏండ్ల (2007) తర్వాత టీ20 వరల్డ్ కప్ను భారత్ ముద్దాడింది. గత రెండు ప్రపంచకప్లలో తమను దెబ్బకొట్టిన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ను ఇంటికి పంపిన రోహిత్ సేన.. ఫైనల్లో సమిష్టి ఆటతీరుతో సఫారీలను మట్టికరిపించింది. పురుషుల క్రికెట్లో భారత్ ఐసీసీ కప్ను అందుకోవడం ఇది నాలుగోసారి. వన్డే క్రికెట్లో రెండుసార్లు ప్రపంచ చాంపియన్గా నిలిచిన భారత్, పొట్టి ఫార్మాట్లో కూడా దానిని సమం చేసింది. దీంతో యావత్ భారతావని సంబురాల్లో మునిగి తేలుతోంది. ఇక సొంతగడ్డపై భారత జట్టుకు ఘన స్వాగతం పలికేందుకు యావత్ దేశం సిద్ధంగా ఉంది.
చిగురుటాకులా వణుకుతున్న బార్బడోస్..
బెరిల్ తుఫాన్తో బార్బడోస్ తీర ప్రాంతం చిగురుటాకులా వణుకుతున్నది. సముద్రతీర ప్రాంతం కావడంతో పాటు బలమైన గాలులకు తోడు భారీ వర్షంతో బార్బడోస్ నగరం తడిసి ముద్దయ్యింది. టైప్-4 తుఫాన్గా భావిస్తున్న బెరిల్ గంటకు దాదాపు 209 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. దీంతో నగరం మొత్తం అధికారులు కర్ఫ్యూ విధించారు. భీకరమైన గాలులు వీస్తున్న నేపథ్యంలో బయటికి ఎవరూ రావద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. దీనికి తోడు స్థానిక విమానాశ్రయం తుఫాన్తో జలమయమైంది. విమానాలు ప్రయాణం చేసేందుకు అనువైన వాతావరణం లేకపోవడంతో ఎయిర్పోర్ట్ను తాత్కాలికంగా మూసివేశారు.
Also Read..
Rohit Sharma: ఆ అద్భుత క్షణాలను ఎంజాయ్ చేస్తున్నా.. బీసీసీఐ టీవీతో రోహిత్ శర్మ.. వీడియో
Rahul Gandhi | లోక్సభలో రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు.. రికార్డుల నుంచి తొలగింపు