Barbados | 17 ఏండ్ల (2007) తర్వాత టీ20 వరల్డ్ కప్ను భారత్ ముద్దాడింది. గత రెండు ప్రపంచకప్లలో తమను దెబ్బకొట్టిన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ను ఇంటికి పంపిన రోహిత్ సేన.. ఫైనల్లో సమిష్టి ఆటతీరుతో సఫారీలను మట్టికరిపించింది. పురుషుల క్రికెట్లో భారత్ ఐసీసీ కప్ను అందుకోవడం ఇది నాలుగోసారి. వన్డే క్రికెట్లో రెండుసార్లు ప్రపంచ చాంపియన్గా నిలిచిన భారత్, పొట్టి ఫార్మాట్లో కూడా దానిని సమం చేసింది. దీంతో యావత్ భారతావని సంబురాల్లో మునిగి తేలుతోంది. ఇక సొంతగడ్డపై భారత జట్టుకు ఘన స్వాగతం పలికేందుకు యావత్ దేశం సిద్ధంగా ఉంది. అయితే.. భారత అభిమానుల ఆశలకు హరికేన్ (Hurricane) తుఫాను గండి కొట్టింది. తుఫాను కారణంగా రోహిత్ సేన స్వదేశానికి రావడం ఆలస్యం కానుంది.
ఫైనల్ మ్యాచ్కు వేదికైన బార్బడోస్ (Barbados)లో ప్రస్తుతం ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. బెరిల్ హరికేన్ తుఫాను కారణంగా అక్కడ విమానరాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బార్బడోస్ విమానాశ్రయాన్ని కూడా మూసివేయాల్సి వచ్చింది. రెండో ప్రమాద హెచ్చరికలను జారీ చేసిన వెస్టిండీస్ అధికారులు.. ప్రజలెవరూ బయటకు రావొద్దని సూచించారు. ప్రస్తుతం అక్కడ గరిష్టంగా 210 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. ఫలితంగా ఎయిర్పోర్ట్స్లో రాకపోకలను నిలిపివేశారు. దీంతో టీమ్ఇండియా జట్టు మొత్తం అక్కడే చిక్కుకుపోయింది. వారంతా ప్రస్తుతం హోటల్లోనే ఉన్నట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి. అన్నీ అనుకూలంగా ఉండి ఉంటే ఇవాళ ఉదయం 11 గంటల కంతా భారత జట్టు స్వదేశంలో అడుగుపెట్టి ఉండేది.
మరోవైపు పొట్టి వరల్డ్ కప్ ట్రోఫీ గెలుపొంది యావత్ దేశాన్ని సంబురాల్లో ముంచిన రోహిత్ సేనను ఘనంగా సన్మానించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ జై షా స్వయంగా వెల్లడించారు. అయితే, జట్టు బార్బడోస్ నుంచి భారత్కు బయలుదేరిన తర్వాతే కార్యక్రమానికి ఏర్పాట్లు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం జట్టు మొత్తం అక్కడ చిక్కుకుపోయినట్లు పేర్కొన్నారు.
వెస్టిండీస్లోని బ్రిడ్జ్టౌన్లో శనివారం దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. చివరి ఓవర్ వరకూ నరాలుతెగే ఉత్కంఠతో హోరాహోరీగా సాగిన ఫైనల్ పోరులో భారత్ 7 పరుగుల తేడాతో సఫారీలను మట్టికరిపించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. పొట్టి ఫార్మాట్ ఫైనల్ మ్యాచ్లో ఇంతవరకు ఇదే అత్యధిక స్కోరు. ఆ తరువాత బ్యాటింగ్కు దిగిన సఫారీలు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 169 పరుగులు మాత్రమే చేయగలిగారు.
Also Read..
Team India | స్పిన్ తంత్రం పేస్ మంత్రం.. బౌలర్లే మ్యాచ్ విన్నర్లు
LPG cylinder | మరోసారి తగ్గిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర.. ఎంతంటే..?
Shatrughan Sinha | తీవ్ర జ్వరంతో ఆసుపత్రిలో చేరిన శత్రుఘ్న సిన్హా