సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఐసీసీ టీ20 ప్రపంచ చాంపియన్లుగా నిలిచిన భారత క్రికెట్ జట్టు స్వదేశానికి చేరుకుంది. 13 ఏండ్ల తర్వాత ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడి స్వదేశానికి తిరిగొచ్చిన టీమ్ఇండియాకు ‘ఢిల్లీ నుంచి ముంబై’ దాకా అడుగడుగునా ఘనస్వాగతం లభించింది. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైన అనంతరం ముంబైకి వచ్చిన రోహిత్ సేన ‘వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ మూవ్మెంట్’ను తనివితీరా ఆస్వాదించింది. వీరుల విజయోత్సవ ర్యాలీకి అరేబియా తీరం అభిమాన జన సంద్రమైంది.
నారీమన్ పాయింట్ నుంచి ఎటుచూసినా జనం..! జనం..!! జనం..!!! రోజూ సాయంత్ర వేళల్లో ప్రశాంతంగా ఉండే ఆ ప్రాంతమంతా ఇసుకేస్తే రాలనంత జన ప్రభంజనాన్ని తలపించింది. ‘ఇండియా.. ఇండియా’, ‘ముంబై చ రాజా.. రోహిత్శర్మ’, ‘కోహ్లీ.. కోహ్లీ’ అంటూ అభిమానులు చేసిన విజయనినాదాలకు అరేబియా సంద్రపు అలల హోరు మూగబోయింది. ‘లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్’ అన్నట్టుగా జైత్రయాత్ర ముగిశాక బీసీసీఐ ‘మెన్ ఇన్ బ్లూ’కు ఇస్తామని చెప్పిన రూ. 125 కోట్ల చెక్కును 36 వేల మంది అభిమానుల సమక్షంలో అందజేసింది.
Team India | ఢిల్లీ: ఐసీసీ టీ20 ప్రపంచకప్ను గెలుచుకున్న భారత జట్టు ఆరు రోజుల విరామం తర్వాత స్వదేశానికి చేరుకుంది. బుధవారం సాయంత్రం బార్బడోస్ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరిన టీమ్ఇండియా గురువారం ఉదయం 6 గంటలకే ఢిల్లీ విమానాశ్రయంలో దిగింది. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో వేలాది అభిమానులు ఘనస్వాగతం పలకగా చాణిక్యపురిలోని ఐటీసీ మౌర్య హోటల్కు వెళ్లిన భారత జట్టు..
అక్కడ్నుంచి నేరుగా ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో ఆయనతో సమావేశమైంది. ‘చాంపియన్ల’ను అభినందించిన అనంతరం వారితో కలిసి అల్పాహారం చేసిన మోదీ.. జట్టుతో కాసేపు ముచ్చటించి వారి అనుభవాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమం ముగిశాక టీమ్ఇండియా ప్రత్యేక విమానంలో దేశ ఆర్థిక రాజధానికి పయనమమైంది.
జనం.. నీరాజనం
అనుకున్న షెడ్యూల్ (సాయంత్రం 5 గంటలకు) కంటే విజయయాత్ర రెండు గంటల (రాత్రి 7.30 గంటలకు మొదలైంది) పాటు ఆలస్యమైనా అభిమానులు తమ అభిమాన ఆటగాళ్ల కోసం వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఆనందంగా వేచి చూశారు. ఇక ఓపెన్ టాప్ బస్సులో విక్టరీ పరేడ్ మొదలయ్యాక ఆటగాళ్లకు అడుగడుగునా జననీరాజనమే. రోహిత్, కోహ్లీ, పాండ్యా, సూర్య, పంత్, సిరాజ్ అభిమానులను ఉత్సాహాపరుస్తూ జైత్రయాత్రను నడిపించారు. అంగరంగ వైభవంగా సాగిన జైత్రయాత్ర రెండు గంటల తర్వాత వాంఖడే చేరిన భారత జట్టుకు బీసీసీఐ చిరు సత్కారం చేసింది.
అధ్యక్షుడు రోజర్ బిన్నీ, సెక్రటరీ జై షా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా భారత జట్టుకు రూ.125 కోట్ల ప్రైజ్మనీ చెక్ను అందజేశారు. అనంతరం వాంఖడేలో అభిమానుల కేరింతల నడుమ ఆటగాళ్లంతా వారికి కృతజ్ఞతలు చెబుతూ స్టేడియం అంతా కలియతిరిగారు. తమ ప్రపంచకప్ అనుభవాలను కెప్టెన్ రోహిత్శర్మ, విరాట్కోహ్లీ, బుమ్రా, చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పంచుకున్నారు. తమకు మద్దతు పలికేందుకు స్టేడియానికి వేలాదిగా తరలివచ్చిన అభిమానులకు క్రికెటర్లు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమం పూర్తయ్యే వరకు భారీగా పోలీసులను మోహరించారు.