ట్రినిడాడ్: ఐసీసీ టోర్నీల్లో తొలిసారిగా దక్షిణాఫ్రికా ఫైనల్కు చేరింది. టీ20 వరల్డ్కప్లో సంచలనాలతో అదరగొడుతున్న ఆఫ్ఘానిస్థాన్ను సెమీస్లో సఫారీలు మట్టికరిపించారు. దక్షిణాఫ్రికా బౌలర్ల ధాటికి వర్ వన్సైడ్ అన్నట్లుగా సాగింది. సఫారీ బౌలర్లు జాన్సెన్, షంసీ పదునైన బంతులకు కాబూలీలు 56 రన్స్కే చాపచుట్టేశారు. తొలి ఓవర్ నుంచే వికెట్ల వేట ప్రారంభించిన దక్షిణాఫ్రికా బౌలర్లు.. ఆఫ్ఘాన్లను 11 ఓవర్లలోనే ఆలౌట్ చేశారు. దీంతో టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే అతితక్కువ స్కోర్ చేసిన జట్టుగా ఆఫ్ఘానిస్థాన్ నిలిచిపోయింది. సఫారీల ఆల్రౌండ్ ప్రదర్షణతో ఆఫ్ఘాన్లు ఏ దశలో పోటీ ఇవ్వలేకపోయారు. మార్కో జాన్సెన్, తబ్రేజ్ షంసీ మూడేసి వికెట్లు తీయగా, కగిసో రబాడా 2, అన్రిచ్ నోకియా 2 చొప్పున వికెట్లు పడగొట్టారు.
స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు రంగంలోకి దిగిన దక్షిణిఫ్రికా.. తొలి ఓవర్లోనే ఓపెనర్ డికాక్ను (5) ఫారుఖీ పెవీలియన్కు పంపించాడు. అయితే తర్వాత వచ్చిన మార్క్రమ్తో కలిసి రీజా హెండిక్స్ ఆడుతూపాడుతు జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇరువురు 23 రన్స్, 29 పరుగుల చొప్పున చేయడంతో 8.5 ఓవర్లలోనే మ్యాచ్ ముగిసింది. దీంతో తొలిసారిగా టీ20 వరల్డ్ కప్ ఫైనల్కు సౌత్ఆఫ్రికా అడుగుపెట్టింది.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఆఫ్ఘాన్.. 11.5 ఓవర్లలో కేవలం 56 రన్స్కే ఆలౌటైంది. టోర్నీ ఆరంభం నుంచి అసాధారణ ప్రతిభ కనబరిన కాబూలీలు కీలక మ్యాచ్లో చేతులెత్తేశారు. అజ్మతుల్లా (10) మినహా మిగిలిన బ్యాటర్లంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. దక్షిణాఫ్రికా బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు పడగొడుతూ ఆఫ్ఘాన్ను కుప్పకూల్చారు. వచ్చినవారు వచ్చినట్లే వెనుతిరుగుతున్నప్పటికీ బమర్జాయ్ ఇన్నింగ్స్ను చక్కదిద్దేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో నోకియా బౌలింగ్లో స్టబ్స్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కెప్టెన్ రషీద్ ఖాన్ (8) కూడా ఆకట్టుకోలేకపోయాడు. రెహ్మానుల్లా, మహ్మద్ నబీ, నూర్ అహ్మద్ డకౌట్ అయ్యారు. కాగా, మరో సెమీస్లో భారత్, ఇంగ్లండ్ తలపడనున్నాయి.
South Africa are through to their first Men’s #T20WorldCup Final 🙌 pic.twitter.com/KwPr74MUJc
— ICC (@ICC) June 27, 2024