T20 World Cup | క్రికెట్.. క్రికెట్ ఈ మూడు అక్షరాల పదానికి ఉన్న క్రేజ్ మాటలకందనిది! ఏ క్షణాన మన దేశానికి పరిచయం అయ్యిందో కానీ ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగింది. సుదీర్ఘ క్రికెట్ చరిత్రలో భారత్ది మరుపురాని అధ్యాయం. స్వాతంత్య్రం రాక పూర్వం నుంచి నేటి ఏఐ యుగం వరకు దేశంలో క్రికెట్ ఒక మతంగా వర్ధిల్లుతూనే ఉన్నది. కాలం మారినా..తరాలు బదిలీ అవుతున్నా.. ఆట పట్ల అభిమానం అంతకంతకూ పెరుగుతూనే ఉన్నది. ఇది అంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే.. క్రికెట్ జగత్తును మరోమారు రంజింపచేస్తూ టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచిన వేళ జాతి యావత్తు సంబురాల్లో మునిగిపోయింది. చిన్నా, పెద్దా తేడా లేకుండా గెలుపు సంబురాల్లో తేలిపోయారు.
ఈ చిరస్మరణీయ విజయం వెనుక వెలకట్టలేని భావోద్వేగాలను ఎన్నో దాగున్నాయి. 2013 నుంచి నిన్న మొన్నటి వరకు అందినట్లే అంది చేజారుతున్న ఐసీసీ ట్రోఫీ ఎట్టకేలకు చెంతకు చేరడంపై ప్లేయర్లు ఎదుర్కొన్న బాధలు వారి చెమర్చిన కండ్లలోనే కనిపించాయి. 2014 టీ20 వరల్డ్కప్లో రన్నరప్ నుంచి మొదలుపెడితే స్వదేశం వేదికగా గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి వరకు మెగాటోర్నీలు మనల్ని ఊరిస్తూనే వచ్చాయి. కానీ కోట్లాది మంది భారతీయుల ఆశలు, ఆకాంక్షలు ఫలించిన సమయాన కరీబియన్ గడ్డపై రోహిత్సేన కొత్త చరిత్ర లిఖించింది.
కింగ్స్టన్ ఓవల్ మైదానంలో దక్షిణాఫ్రికాతో నువ్వానేనా అన్నట్లు సాగిన సమరంలో భారత్నే విజయం వరించింది. 17 ఏండ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ టీమ్ఇండియా రెండోసారి కప్ను ముద్దాడింది. మెగాటోర్నీలో ప్రత్యర్థులను చిత్తుచేస్తూ భారత్ అజేయంగా పొట్టి ప్రపంచకప్ను సగర్వంగా దక్కించుకుంది. ఐర్లాండ్తో పోరు నుంచి మొదలుపెడితే సఫారీలతో టైటిల్ ఫైట్ వరకు ఎక్కడా విశ్రమించకుండా మన వీరులు చూపించిన పోరాటం మాటల కందనిది. ఆఖరి టీ20 ప్రపంచకప్ ఆడిన విరాట్ కోహ్లీ, రోహిత్శర్మ, జడేజా కలను సాకారం చేసుకుని తమ కెరీర్కు ఘనమైన ముగింపు పలికారు.
వెస్టిండీస్, అమెరికా వేదికలుగా దాదాపు నెలన్నర రోజుల పాటు సాగిన మెగాటోర్నీలో భారత్ సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటింది. ఒక్క ప్లేయర్పైనే పూర్తిగా ఆధారపడకుండా పరిస్థితులకు అనుగుణంగా కీలకంగా వ్యవహరిస్తూ జట్టు విజయాల్లో పాలుపంచుకున్నారు. ఐపీఎల్ ముగిసిన వారం రోజుల వ్యవధిలోనే అమెరికాలో అడుగుపెట్టిన భారత్.. తమ లక్ష్యమేంటో చేతల్లో చూపెట్టింది.
అగ్రరాజ్యంలో క్రికెట్ అభివృద్ధి కోసం ఐసీసీ రూపొందించిన ప్రణాళికలో ‘డ్రాప్ ఇన్ పిచ్’ రూపంలో ఇబ్బందులు ఎదురైనా మొత్తంగా మెగాటోర్నీ విజయవంతంగా ముగిసింది. ఒకానొక దశలో భారత జట్టుకు అనుకూలంగా ఐసీసీ షెడ్యూల్ ఉందని పలువురు మాజీలు అనవసర విమర్శలు చేసినా..మన టైటిల్ విజయాన్ని అడ్డుకోలేకపోయారు.
ఐపీఎల్లో మెరుపులు మెరిపించిన విరాట్ కోహ్లీ.. ఓపెనర్గా విజయవంతం కావడంలో విఫలమైనా.. మేనేజ్మెంట్ అతనిపై ఎనలేని విశ్వాసాన్ని ఉంచింది. ఇది కెప్టెన్ రోహిత్శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ మాటల్లో చాలా స్పష్టంగా కనిపించింది. కోహ్లీ.. టైటిల్ ఫైట్లో తన విలువేంటో చూపెట్టాడు. ఇలా తమ పాత్రలకు న్యాయం చేస్తూ బ్యాటింగ్లో రోహిత్, పంత్, సూర్యకుమార్, హార్దిక్ బాధ్యాతాయుత ఇన్నింగ్స్లతో కదంతొక్కితే.. బుమ్రా, అర్ష్దీప్సింగ్, కుల్దీప్, అక్షర్ సమయోచితంగా వ్యవహరించారు.