World Chess Championship : ప్రపంచ చెస్ చాంపియన్షిప్ టోర్నీఆతిథ్యమివ్వాలనుకున్న భారత్కు నిరాశే ఎదురైంది. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీ నిర్వహణ హక్కులను సింగపూర్(Singapore) సొంతం చేసుకుంది. వరల్డ్ చాంపియన్షిప్ సింగపూర్ గడ్డపై జరగడం ఇదే మొదటిసారి. ఈ ఏడాది నవంబర్ – డిసెంబర్ మధ్యలో చెస్ చాంపియన్షిప్ జరుగనుంది. డిఫెండింగ్ చాంపియన్ డింగ్ లిరెన్ (Ding Liren)తో భారత గ్రాండ్మాస్టర్ డి.గుకేశ్ (Gukesh) తలపడనున్నాడు.
ఈ బిగ్ మ్యాచ్ నిర్వహణ కోసం ఢిల్లీ, చెన్నై దరఖాస్తు చేసుకున్నాయి. అయితే.. చివరకు సింగపూర్ ఆతిథ్యానికి ఎంపికైంది. నవంబర్ 20, డిసెంబర్ 15 మధ్య గుకేశ్, లిరెన్ గేమ్ ఉంటుందని అంతర్జాతీయ చెస్ సంఘం(FIDE) తెలిపింది. ‘వరల్డ్ చెస్ చాంపియన్షిప్ ఆతిథ్యం కోసం ఫిడేకు మూడు దరఖాస్తులు వచ్చాయి. భారత్ నుంచి ఢిల్లీ, చెన్నై నగరాలు.. సింగపూర్ పోటీలో నిలిచాయి. బిడ్స్ను పరిశీలించడంతో పాటు నిర్వహణకు ఆయా నగరాల్లో ఉన్న వసతులు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకున్నాక సింగపూర్ను ఎంపిక చేశాం’ అని ఫిడే ఓ ప్రకటనలో వెల్లడించింది.
వరల్డ్ చాంపియన్షిప్ మ్యాచ్లో 14 గేమ్స్ ఆడిస్తారు. 7.5 పాయింట్లు సాధించిన లేదా ఎక్కువ మ్యాచ్లు గెలిచిన ఆటగాడు విజేత అవుతాడు. 14 మ్యాచ్ల తర్వాత ఇద్దరి స్కోర్లు సమం అయితే అప్పడు టై బ్రేక్ ఆధారంగా విజేతను నిర్ణయిస్తారు. ఈ టోర్నీలో గెలుపొందిన ఆటగాడికి రూ.15 కోట్ల ప్రైజ్మనీ దక్కనుంది.