బ్రిడ్జ్టౌన్: వచ్చే ఏడాది జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్లో ఆడేందుకు సీనియర్ ఆటగాళ్లు భారత జట్టుకు అందుబాటులో ఉంటారని బీసీసీఐ కార్యదర్శి జే షా(Jay Shah) పేర్కొన్నారు. టీ20లకు గుడ్బై చెప్పిన కెప్టెన్ రోహిత్ శర్మ స్థానంలో జట్టు సారథ్యాన్ని హార్దిక్ పాండ్యాకు ఇస్తారా అన్న అంశంపై సెలెక్టర్లు నిర్ణయం తీసుకుంటారని ఆయన స్పష్టం చేశారు. శనివారం జరిగిన టీ20 వరల్డ్కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై ఇండియా థ్రిల్లింగ్ విక్టరీ కొట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాలు అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికారు. అయితే జే షా మీడియాతో మాట్లాడుతూ.. టీ20 వరల్డ్కప్ టైటిల్ గెలవడంలో సీనియర్ల పాత్ర కీలకమైందన్నారు.
ముగ్గురు గొప్ప ఆటగాళ్లు టీ20లకు స్వస్తి పలికారని, దీంతో జట్టులో మార్పులు స్టార్ట్ అయినట్లు షా తెలిపారు. జట్టు ఆడుతున్న తీరు చాలా ప్రగతిశీలంగా ఉందని, వరల్డ్ టెస్టు చాంపియన్షిప్, ఛాంపియన్స్ ట్రోఫీ నెగ్గడమే మన టార్గెట్ అని, ఇలాంటి జట్టుతోనే ఆ టోర్నీల్లో ఆడుతామని, సీనియర్లు ఉంటారని షా వెల్లడించారు. ఒకవేళ సీనియర్ క్రికెటర్లు ఫిట్గా ఉంటే, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పాకిస్థాన్లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ కన్నా ముందు భారత జట్టు కనీసం 9 వన్డేలు ఆడనున్నది. ఆ మ్యాచుల్లో సీనియర్లు ఆడే ఛాన్సు ఉన్నది. శ్రీలంక, న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లతో మూడేసి వన్డేలు ఇండియా ఆడాల్సి ఉన్నది.
కెప్టెన్ పాండ్యా !
టీ20 వరల్డ్కప్లో ఆల్రౌండర్ హార్ధిక్ పాండ్యా తన పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. అయితే రోహిత్ శర్మ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో ఆ బాధ్యతలను పాండ్యాకు అప్పగిస్తారన్న అంశంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. కెప్టెన్సీ అంశాన్ని సెలెక్టర్లే నిర్ణయిస్తారని పేర్కొన్నారు. సెలెక్టర్లతో చర్చలు జరిపిన తర్వాత ఆ అంశంపై ప్రకటన చేస్తామన్నారు. ఇండియా అన్ని టైటిళ్లను గెలవాలని ఉందని, తమ వద్ద బెంచ్ స్ట్రెంన్త్ ఎక్కువగా ఉందని, తాజా జట్టులోని ముగ్గురు ఆటగాళ్లు మాత్రమే జింబాబ్వేకు వెళ్తున్నారని, అవసరం అయితే మూడు జట్లను కూడా పోటీలో దింపేందుకు సిద్ధంగా ఉన్నామని జే షా తెలిపారు.