జార్జ్టౌన్: ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో భారత్ బాల్ ట్యాంపరింగ్కు పాల్పడినట్లు పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమాముల్ హక్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆ ఆరోపణలను భారత కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) ఖండించారు. ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్ల తమ బౌలర్లు రివర్స్ స్వింగ్ చేసినట్లు పేర్కొన్నారు. ఆసీస్తో మ్యాచ్లో 15వ ఓవర్లో హర్షదీప్ రివర్స్ స్వింగ్ బౌలింగ్ చేశారని, అంటే భారత ఆటగాళ్లు ట్యాంపరింగ్ పాల్పడినట్లు స్పష్టమవుతోందని ఇంజీ ఆరోపించారు. దీనిపై ప్రెస్ కాన్ఫరెన్స్లో అడిగిన ప్రశ్నకు రోహిత్ శర్మ బదులిచ్చాడు.
టీ20 వరల్డ్కప్ జరుగుతున్న ప్రదేశంలో వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయో గమనించాలని, ఇక్కడ వాతావరణం వల్ల రివర్స్ స్వింగ్ చాలా సహజంగా జరుగుతుందని రోహిత్ పేర్కొన్నాడు. దీని గురించి ఏం చెప్పగలమని, చాలా వేడి ఎండలో మ్యాచ్ ఆడుతున్నామని, వికెట్ చాలా డ్రైగా ఉందని, దీని వల్ల బంతి ఆటోమెటిక్ రివర్స్ అవుతుందని, అన్ని జట్లకు ఇలాగే అవుతోందని, మేమే కాదు, అన్ని జట్లూ రివర్స్ స్వింగ్ చేస్తున్నాయని, కొన్ని సందర్భాల్లో మనం మన బుర్రకు పనిపెట్టాలని, ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో ఆడుతున్నావన్న విషయాన్ని అర్థం చేసుకోవాలని, ఇంగ్లండ్ లేదా ఆస్ట్రేలియాలో ఈ మ్యాచ్ జరగడం లేదని, ఇది మాత్రమే తాను చెప్పగలనని రోహిత్ తెలిపాడు.