IND vs ENG : పొట్టి ప్రపంచ కప్లో టైటిల్ వేటకు చేరువైన భారత్(India) సెమీస్లో భారీ స్కోర్ చేయలేకపోయింది. ప్రధాన ఆటగాళ్లు చేతులెత్తేసిన చోట కెప్టెన్ రోహిత్ శర్మ(56) అర్ధ శతకంతో మెరిశాడు. సూర్యకుమార్ యాదవ్(47) సైతం ధనాధన్ ఆడాడు. 40 పరుగలకే రెండు వికెట్లు పడిన దశలో.. వీళ్లిద్దరూ కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. ఆఖర్లో హార్దిక్ పాండ్యా(23), రవీంద్ర జడేజా (17 నాటౌట్)లు ధాటిగా ఆడడంతో భారత్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది.
గయనాలో వర్షం కారణంగా మ్యాచ్ 75 నిమిషాలు ఆలస్యంగా మొదలైంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ సారథి టీమిండియాను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. అయితే.. ధాటిగా ఆడాలనుకున్న విరాట్ కోహ్లీ(9) టాప్లే వేసిన రెండో ఓవర్లో ఔటయ్యాడు. ఆ తర్వాత రిషభ్ పంత్(4) సైతం ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. ఆ పరిస్థితుల్లోరోహిత్ మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. సూర్యుకుమార్ యాదవ్(47)తో కలిసి విలువైన పరుగులు జోడించాడు. అయితే.. 8 ఓవర్లు ముగిశాక చినుకులు పడడంతో ఆటకు అంతరాయం కలిగింది. అప్పటికీ టీమిండియా స్కోర్ 65/2.
వాన తగ్గాక రోహిత్, సూర్యలు ధాటిగా ఆడారు. రన్రేటు 7కు తగ్గకుండా బ్యాటింగ్ చేశారు. దాంతో, టీమిండియా 13 ఓవర్లకు 110 రన్స్ స్కోర్ చేసింది. అయితే.. స్వల్ప వ్యవధిలోనూ ఇద్దరూ ఔటయ్యారు. ఆదిల్ రషీద్ ఓవర్లో రోహిత్ బౌల్డవ్వగా.. ఆర్చర్ ఊరించి వేసిన బంతికి సూర్య దొరికిపోయాడు.
The battle for ascendency is 🔛
India set their sights on a huge total as England look to snare few more wickets 🔥#T20WorldCup | #INDvENG | 📝: https://t.co/pAxooia0Bu pic.twitter.com/PAZcjbKqEm
— ICC (@ICC) June 27, 2024
ఆ తర్వాత హార్దిక్ పాండ్యా(23), రవీంద్ర జడేజా(17 నాటౌట్)లు జట్టుకు పోరాడగలిగే స్కోర్ అందించే బాధ్యత తీసుకున్నారు.ఈ సీజన్లో హ్యాట్రిక్ వీరుడు జోర్డాన్ వేసిన 18వ ఓవర్లో రెచ్చిపోయిన పాండ్యా వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. కానీ, వరుస బంతుల్లో పాండ్యా, శివం దూబే(0)లను జోర్డాన్ ఔట్ చేశాడు. ఆఖర్లో జడ్డూ, అక్షర్ పటేల్ (10) దూకుడుగా ఆడి జట్టు స్కోర్ 170 దాటించారు.