Retirement | సుదీర్ఘ భారత క్రికెట్లో ఒక శకం ముగిసింది! తమ అద్భుత ఆటతీరుతో కోట్లాది మంది భారతీయులను అలరించిన విరాట్కోహ్లీ, రోహిత్శర్మ, రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20లకు ఘనమైన ముగింపు పలికారు. వెస్టిండీస్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఈ ముగ్గురు పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలుకుతున్నట్టు ప్రకటించారు. యువతరానికి తమ ఘనమైన వారసత్వాన్ని అందిస్తూ భారత్ తరఫున వన్డేలు, టెస్టుల్లో కొనసాగుతామని పేర్కొన్నారు. 17 ఏండ్ల ప్రపంచకప్ కలను సాకారం చేసిన టీమ్ఇండియాకు బీసీసీఐ 125 కోట్ల బంపర్ ప్రైజ్మనీ ప్రకటించింది.
బ్రిడ్జ్టౌన్: భారత స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా..అంతర్జాతీయ టీ20 కెరీర్కు వీడ్కోలు పలికాడు. ఇప్పటికే పొట్టి ఫార్మాట్కు రోహిత్, కోహ్లీ గుడ్బై చెప్పగా తాజాగా జడేజా కూడా ఈ జాబితాలో చేరిపోయాడు. ఆదివారం ఇన్స్టాగ్రామ్ వేదికగా జడేజా తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు.
‘అంతర్జాతీయ టీ20లకు హృదయపూర్వకంగా వీడ్కోలు పలుకుతున్నాను. దేశం తరఫున అత్యుత్తమంగా రాణించేందుకు ప్రయత్నించాను. భవిష్యత్లోనూ ఇదే రీతిలో రాణిస్తాను’ అని రాసుకొచ్చాడు. తన కెరీర్లో 74 మ్యాచ్లాడిన జడేజా 515 పరుగులతో పాటు 54 వికెట్లు పడగొట్టాడు.