Rahul Dravid | టీమిండియా 17 సంవత్సరాల తర్వాత మళ్లీ టీ20 వరల్డ్ కప్ను నెగ్గింది. శనివారం బార్బడోస్ వేదికగా జరిగిన ఉత్కంఠ మ్యాచ్లో టీమిండియా ఏడుపరుగుల తేడాతో ప్రొటీస్ జట్టును ఓడించింది. ఈ మ్యాచ్ అనంతరం దిగ్గజ ఆటగాళ్లయిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టీ20 క్రికెట్కు వీడ్కోలు పలికారు. ఇక ప్రపంచకప్ టైటిల్తో రాహుల్ ద్రవిడ్ హెడ్కోచ్ పదవీకాలం ముగిసింది. ఈ సందర్భంగా రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ రోహిత్పై ప్రశంసలు కురిపించాడు. అతను జట్టు కెప్టెన్గా కంటే ఎక్కువగా వ్యక్తిగా ఉంటాడన్నారు. ఇకపై స్నేహితులగా ఉంటామని ఆశిస్తున్నానన్నారు. ఫైనల్లో జట్టు సభ్యులు పోరాడరని ప్రశంసించారు. జట్టు మొదటి ఆరు ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండగా.. ఆటగాళ్లు పోరాడారన్నారు.
‘ఒక ఆటగాడిగా నేను అత్యుత్తమ ఆటతీరు కనబరిచినప్పటికీ వరల్డ్ కప్ గెలిచే అదృష్టానికి నోచుకోలేదు. ఆ తర్వాత జట్టుకు కోచ్గా వ్యవహరించే అవకాశం తలుపుతట్టింది. నా అదృష్టం కొద్దీ కుర్రాళ్ల జట్టు నా కోసం ట్రోఫీని నెగ్గింది. ఈ భావన ఎంతో గొప్పగా ఉంది. వరల్డ్ కప్ గెలిస్తే చాలు. ఇక తప్పుకుందాం అనే లక్ష్యం ఎప్పుడు పెట్టుకోలేదు. ఇది నా వృత్తి అనుకున్నాను. ఏదేమైనా ఇదొక అద్భుతమైన ప్రస్థానం. ఇక వచ్చే వారం నుంచి నేను నిరుద్యోగిని. ఏమైనా అవకాశాలు ఉంటే చెప్పండి’ అంటూ ద్రవిడ్ చమత్కరించాడు. ‘రోహిత్, ఈ జట్టుతో కలిసి పని చేయడం చాలా ఇష్టం. ఇది ఒక గొప్ప ప్రయాణం. నిజంగా ఎంతో ఆనందంగా ఉంది. ఇలాంటి డ్రెసింగ్ రూమ్లో భాగం కావడం చాలా అదృష్టం. ఇది జీవితకాలం జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఇందుకోసం కృషి చేసిన జట్టుకు, సహాయక సిబ్బందికి కృతజ్ఞతలు. కోచ్లు, ఇతర సహాయక సిబ్బందితో కలిసి పని చేయడం అదృష్టంగా భావిస్తున్నాను’ అన్నారు.