లాహోర్: భారత్, పాక్ మధ్య మరో రసవత్తర పోరుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) రంగం సిద్ధం చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 దాకా స్వదేశంలో జరుగుబోయే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ కోసం రూపొందించిన డ్రాఫ్ట్ షెడ్యూల్ను ఐసీసీకి అందజేసిన పీసీబీ.. ఇందులో భాగంగా దాయాదుల పోరును మార్చి 1న నిర్ణయించింది. భారత ఆటగాళ్ల భద్రత దృష్ట్యా టీమ్ఇండియా ఆడే మ్యాచ్లన్నింటినీ లాహోర్లోని గడాఫీ స్టేడియం వేదికగానే జరపాలని పీసీబీ భావిస్తోంది. అయితే చాంపియన్స్ ట్రోఫీలో పాక్కు వెళ్లి ఆడే విషయమై బీసీసీఐ ఇంకా సమ్మతి తెలపలేదు.
బాయ్కాట్కు శస్త్రచికిత్స
లండన్: ఇంగ్లండ్ దిగ్గజ క్రికెటర్ జెఫ్రీ బాయ్కాట్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. తీవ్ర గొంతు క్యాన్సర్తో ఇబ్బంది పడుతున్న 83 ఏండ్ల బాయ్కాట్ రెండు వారాల వ్యవధిలో శస్త్రచికిత్స చేయించుకోబోతున్నాడు. ఈ విషయాన్ని ఆయన బుధవారం వెల్లడించాడు. ‘గత కొన్ని వారాలుగా వేర్వేరు స్కాన్స్తో పాటు బయాప్సీ చేశారు. పరీక్షల్లో గొంతు క్యాన్సర్ అని తేలింది. దీనికి చికిత్స తీసుకోబోతున్నాను’ అని పేర్కొన్నాడు.