Stephen Fleming : టీ20 వరల్డ్ కప్లో జోరుమీదున్న భారత జట్టు(Team India)కు అసలు సవాల్ ఎదురవ్వనుంది. మెగా టోర్నీలో సూపర్ 8 మ్యాచ్లు కరీబియన్ గడ్డపై జరుగనుండడమే అందుకు కారణం. అమెరికా పిచ్లపై ఆడలేకపోయిన టీమిండియా టాప్ గన్స్ బ్యాట్ ఝలిపించాలని అంతా కోరుకుంటున్నారు. సూపర్ 8 ఫైట్ కోసం రోహిత్ సేన సిద్దమవుతున్న వేళ న్యూజిలాండ్ మాజీ ఆటగాడు స్టీఫెన్ ఫ్లెమింగ్ (Stephen Fleming) భారత జట్టుపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
వరల్డ్ కప్ కోసం భారత బృందం ఎంపిక బాగుందని, సెలెక్టర్లు స్మార్ట్ జాబ్ చేశారని అతడు అన్నాడు. అంతేకాదు టీమిండియా సమతూకంగా ఉందని, విండీస్ గడ్డపై భారత స్పిన్నర్లు కీలక పాత్ర పోషిస్తారని ఫ్లెమింగ్ అభిప్రాయపడ్డాడు.
‘భారత జట్టును చూస్తుంటే ఫైనల్ ఆడడం ఖాయం అనిపిస్తోంది. ఎందుకంటే.. విండీస్ పిచ్లపై స్పిన్నర్లు ఆధిపత్యం చెలాయించే చాన్స్ ఉంది. భారత సెలెక్టర్లు చాలా తెలివిగా నలుగురు స్పిన్నర్లను ఎంపిక చేశారు. సెమీఫైనల్, ఫైనల్ వంటి కీలక మ్యాచ్ల్లో స్పిన్నర్లు ఉపయోగించుకోవచ్చు’ అని ఫ్లెమింగ్ వెల్లడించాడు. కివీస్ సారథిగా హిట్ కొట్టిన ఫ్లెమింగ్ ఐపీఎల్లో కోచ్గా సక్సెస్ అయ్యాడు. అతడి ఆధ్వర్యంలో చెన్నై సూపర్ కింగ్స్ ఏకంగా ఐదుసార్లు ట్రోఫీని కైవసం చేసుకుంది.
పొట్టి ప్రపంచకప్లో ఫేవరెట్ అయిన భారత్ లీగ్ దశలో అదరగొట్టింది. ఓటమన్నదే ఎరుగని రోహిత్ సేన 7 పాయింట్లతో గ్రూప్ ఏ టాపర్గా నిలిచింది. సూపర్ 8 స్టేజ్లో భారత్ జూన్ 20న అఫ్గనిస్థాన్తో.. ఆ తర్వాత బంగ్లాదేశ్.. ఆస్ట్రేలియాలతో తలపడనుంది. ఈ దశలో మూడింటా కనీసం రెండు మ్యాచ్లు గెలిస్తే సెమీస్ బెర్తు దక్కుతుంది.
దాంతో, రోహిత్ బృందం సూపర్ 8లోనూ తమ జైత్రయాత్రను కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. ఓపెనర్గా విఫలమవుతున్న విరాట్ కోహ్లీ(virat kohli) కరీబియన్ గడ్డపై జూలు విదిలించాలని మేనేమెంట్ కోరుకుంటోంది. మిడిలార్డర్లో రిషభ్ పంత్, శివం దూబే, హార్దిక్ పాండ్యాలు రాణించడం భారత్కు కలిసి రానుంది. బౌలింగ్ యూనిట్లో కుల్దీప్ యాదవ్(kuldeep yadav) ఉంటాడా? లేదా ? అనేది చూడాలి.