Pak Vs Ban | రావల్పిండి: స్వదేశంలో బంగ్లాదేశ్తో ఆడుతున్న తొలి టెస్టులో పాకిస్థాన్ భారీ స్కోరు సాధించింది. రెండో రోజు పాక్.. 113 ఓవర్లలో 448/6 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. ఓవర్నైట్ స్కోరు 158/4 వద్ద ఆట ఆరంభించిన పాకిస్థాన్.. వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ (171), యువ ఆటగాడు సౌద్ షకీల్ (141) శతకాలతో భారీ స్కోరు సాధించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లా 12 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి వికెట్లేమీ నష్టపోకుండా 27 పరుగులు చేసింది.
ప్రిక్వార్టర్స్లో ఓడిన సతీష్
యోకోహమ : జపాన్ ఓపెన్ సూపర్-750 బ్యాడ్మింటన్లో భారత షట్లర్ల పోరాటం ముగిసింది. ఈ టోర్నీలో భారత్ నుంచి ప్రిక్వార్టర్స్ చేరిన ఏకైక యువషట్లర్ సతీష్ కుమార్ పోరాడి ఓడాడు. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో సతీష్.. 21-18, 18-21, 18-21తో కంటఫొన్ వాంగ్చరొయెన్ చేతిలో ఓడాడు. గంటా పది నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్లో తొలి సెట్ను గెలుచుకున్న సతీష్ ఆ తర్వాత గాడి తప్పాడు. మాళవిక, అష్మిత, ఆకర్షి, కిరణ్ జార్జి వంటి షట్లర్లు తొలి రౌండ్లోనే ఇంటిబాట పట్టిన విషయం విదితమే.
ఆధిక్యంలో ఇంగ్లండ్
శ్రీలంక 236 ఆలౌట్
మాంచెస్టర్: శ్రీలంకతో మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ రెండో రోజూ ఆధిక్యం కొనసాగించింది. తొలి ఇన్నింగ్స్లో లంకేయులను 236 పరుగులకే ఆలౌట్ చేసిన ఇంగ్లండ్.. బ్యాటింగ్ చేస్తూ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 259 పరుగులు చేసింది. జెమీ స్మిత్ (72 నాటౌట్), హ్యారీ బ్రూక్ (56) అర్ధ సెంచరీలతో రాణించడంతో ఆ జట్టు 23 పరుగుల స్వల్ప ఆధిక్యంలో నిలిచింది.
లక్నోలో మోహన్ బగాన్, ఈస్ట్ బెంగాల్ మ్యాచ్
లక్నో: భారత ఫుట్బాల్ చరిత్రలో అత్యంత క్రేజ్ కలిగిన మోహన్ బగాన్, ఈస్ట్ బెంగాల్ మధ్య పోరుకు ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో ఆతిథ్యమివ్వనుంది. ఈ రెండు జట్ల మధ్య ఐదు రోజుల క్రితమే మ్యాచ్ జరగాల్సి ఉన్నా కోల్కతాలో మెడికో హత్య ఉదంతం తర్వాత శాంతి భద్రతలు అదుపు తప్పడంతో అది రద్దు అయింది.
కాగా సెప్టెంబర్ 2న లక్నోలోని కే.డీ. సింగ్ బాబు స్టేడియంలో రెండు జట్లూ తలపడతాయని యూపీ స్పోర్ట్స్ డైరెక్టర్ ఆర్.పీ. సింగ్ తెలిపాడు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ సైతం ఈ మ్యాచ్ను వీక్షించే అవకాశముంది.