Mohammad Hafeez : పొట్టి ప్రపంచ కప్లో రసవత్తర పోరుకు కౌంట్డౌన్ మొదలైంది. రేపటితో ఫైనల్ ఆడేది ఎవరో తేలిపోనుంది. రోహిత్ శర్మ(Rohit Sharma) సారథ్యంలోని భారత జట్టు ఐసీసీ ట్రోఫీ(ICC Trophy)కి రెండడగుల దూరంలో ఉందంతే. ఇంగ్లండ్తో సెమీ-ఫైనల్ సమరంపై ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ మహ్మద్ హఫీజ్(Mohammad Hafeez) సంచలన కామెంట్స్ చేశాడు. ఈసారి పొట్టి ప్రపంచ కప్ గెలిచే అర్హత కేవలం టీమిండియా నాయకుడు రోహిత్కే ఉందని హఫీజ్ అన్నాడు.
‘వరల్డ్ కప్లో రోహిత్ శర్మతో ఇతర ఆటగాళ్ల ప్రదర్శనను పోల్చి చూస్తే.. మైదానంలో వాళ్లు పడుతున్న శ్రమం చాలా చిన్నది. హిట్మ్యాన్ సెంచరీలు కొట్టాలని ఎప్పుడూ అనుకోడు. అతడు చాంపియన్ ఆటగాడు అవ్వాలనే కసితో ఉన్నాడు. అందుకనే అతడి పేరు క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ గుర్తిండిపోతుంది’ అని హఫీజ్ తెలిపాడు. 37 ఏండ్ల రోహిత్కు ఇది ఆఖరి టీ20 వరల్డ్ కప్. దాంతో, దేశానికి ఎలాగైనా తన కెప్టెన్సీలో ఒక్క ఐసీసీ ట్రోఫీ అయినా అందించాలనే పట్టుదలతో హిట్మ్యాన్ కనిపిస్తున్నాడు.
ఇక సూపర్ 8 ఆఖరి మ్యాచ్లో ఆస్ట్రేలియాపై భారత కెప్టెన్ వీరోచిత ఇన్నింగ్స్(92)కు అందరిలానే హఫీజ్ కూడా ఫిదా అయ్యాడు. ‘అది ఇన్నింగ్స్ మాత్రమే కాదు. నిరుడు వన్డే వరల్డ్ కప్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమికి భారత జట్టు ప్రతీకారం. రోహిత్ నిజంగా చాలా ఎఫర్ట్ పెట్టాడు. మరే ఆటగాడిని పొగిడినా అతడు భారత సారథికి సరితూగడు. ఈసారి వర్డ్ కప్ గెలిచేందుకు అన్ని అర్హతలు ఉన్న ఏకైక వ్యక్తి అతడే’ అని హఫీజ్ వెల్లడించాడు.
Defending champions England square off against impressive India in the second semi-final in Guyana 👊#T20WorldCup | #INDvENGhttps://t.co/3m5Pvz91vJ
— ICC (@ICC) June 26, 2024
ప్రపంచ కప్లో కీలక మ్యాచ్లకు రేపటితో తెరలేవునుంది. కరీబియన్ గడ్డపై సూపర్ 8లో అదరగొట్టిన నాలుగు జట్లు ఫైనల్ బెర్తు కోసం హోరాహోరీగా తలపడనున్నాయి. జూన్ 27న జరిగే తొలి సెమీస్లో అఫ్గనిస్థాన్ జట్టు దక్షిణాఫ్రికాను ఢీ కొట్టనుండగా.. రెండో పోరులో మాజీ చాంపియన్ ఇంగ్లండ్తో భారత్ ఎదురుపడనుంది.