Sachin Tendulkar | వెస్టిండిస్ వేదికగా జరిగిన టీ20 వరల్డ్కప్ ఫైనల్లో ప్రొటీస్ జట్టుపై టీమిండియా జయకేతనం ఎగురవేసింది. విశ్వకప్ను గెలిచిన తర్వాత ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లు టీ20 క్రికెట్కు వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా రోహిత్, విరాట్ కోహ్లీలను అభినందిస్తూ క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్టు పెట్టారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా బ్యాటింగ్ ద్వయం కెరియర్ ప్రారంభించిన టీ20 ప్రపంచకప్ను నెగ్గడం వరకు పలు అంశాలను గుర్తు చేశారు.
ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో టీమిండియా ఏడు పరుగులతో విజయం సాధించి.. 11 సంవత్సరాల తర్వాత మరో విశ్వకప్ను సాధించింది. దీంతో భారత క్రికెట్ అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులతో పాటు దిగ్గజ ఆటగాళ్లతో పాటు సెలబ్రిటీలు సైతం జట్టును అభినందించారు. మ్యాచ్ ముగిసిన అనంతరం ప్రజంటేషన్ కార్యక్రమంలో విరాట్ కోహ్లీ టీ20 క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ఇక రోహిత్ శర్మ విలేకరుల సమావేశంలో రిటైర్మెంట్పై ప్రకటన చేశాడు. ఇక వీరిద్దరిని దగ్గరగా చూసిన సచిన్ తన ఇన్స్టాగ్రామ్ పోస్టులో గత అనుభవాలను గుర్తు చేసుకున్నారు. ‘రోహిత్ కెరీర్ను ప్రారంభించినప్పటి నుంచి వరల్డ్కప్ కెప్టెన్గా ఎదిగేంత వరకు నీ ప్రాస్థానాన్ని దగ్గరుండి చూస్తున్నాను. నీ నిబద్ధత, ప్రత్యేకమైన నైపుణ్యం దేశానికి అత్యంత గర్వకారణంగా నిలిచాయి.
నీ తిరుగులేని కెరీర్కు టీ20 వరల్డ్ కప్ విజయంతో ముగింపు పలకడం పర్ఫెక్ట్గా సరిపోయింది. వెల్డన్ రోహిత్! అంటూ సచిన్ ప్రశంసించాడు. ఇక విరాట్ కోహ్లీని ఉద్దేశించి.. ‘క్రికెట్ ఆటలో నిజమైన చాంపియన్ నువ్వే. ఈ టోర్నమెంట్ మొదట్లో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నావు. గతరాత్రి ఆటలో జెంటిల్మన్ క్రీడలో గొప్ప ఆటగాళ్లలో ఒకరని నిరూపించావు. ఆరు వరల్డ్ కప్లలో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించి, చివరి ప్రయత్నంలో వరల్డ్ కప్ సాధించడం ఎంతటి మధురానుభూతిని కలిగిస్తుందో నాకు తెలుసు. ఇకపై సుదీర్ఘమైన క్రికెట్లో టీమిండియాకు విజయాలు అందించేందుకు పాటుపడాలని ఆశిస్తున్నాను’ అంటూ సచిన్ పోస్టు పెట్టాడు.