Jay Shah | టీ20 ప్రపంచకప్తో టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగింది. ఐసీసీ ట్రోఫీని నెగ్గి భారత ఆటగాళ్లు కోచ్కు ఘన వీడ్కోలు పలికారు. ఇక ప్రస్తుతం కాబోయే కోచ్ ఎవరనే చర్చ మరోసారి మొదలైంది. హెడ్ కోచ్ దరఖాస్తులు ఆహ్వానించడంతో పాటు ఇంటర్వ్యూలు సైతం నిర్వహించింది. ఇందులో ఎవరిని ఎంపిక చేశారన్నది ప్రకటించలేదు. తాజాగా బీసీసీఐ సెక్రటరీ జైషా కొత్త చీఫ్ నియామకానికి సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చారు. శ్రీలంక సిరీస్లో టీమిండియా కొత్త కోచ్తో ఆడుతుందన్నారు. ఇటీవల క్రికెట్ అడ్వైజరీ కమిటీ కొత్త కోచ్కు ఇంటర్వ్యూలు చేసిందని గుర్తు చేశారు. ఇందులో ఒకరిని హెడ్ కోచ్గా ఎంపిక చేసి.. త్వరలో ప్రకటిస్తారన్నారు. సీఏసీ నిర్ణయం ప్రకారం పని చేస్తామన్నారు. వీవీఎస్ లక్ష్మణ్ బింబాబ్వే టూర్కు వెళ్తున్నారని.. కానీ, కొత్త కోచ్ శ్రీలంక సిరీస్లో చేరుతారన్నారు. ఇక కొత్త కోచ్ పదవీకాలం జూలై 2024 నుంచి 31 డిసెంబర్ 2027 వరకు సాగుతుంది.
జూన్ 18న బీసీసీఐ క్రికెట్ అడ్వైజరీ కమిటీ గౌతమ్ గంభీర్, డబ్ల్యూవీ రామన్ ప్రధాన కోచ్ పదవికి ఇంటర్వ్యూ చేసిన విషయం తెలిసిందే. శ్రీలంక పర్యటనలో జూలై 27 నుంచి ఆగస్టు 7 మధ్య పర్యటించనున్నది. ఇందులో టీ20లతో పాటు వన్డే సిరీస్లో ఆడనున్నది. ఇక టీ20 వరల్డ్ గెలుపొందిన అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం టెస్టులు, వన్డేల్లోనే ఇండియాకు సారథ్య బాధ్యతలు చూసుకోనున్నాడు. ప్రస్తుతం టీ20 కెప్టెన్ రేసులో హార్దిక్ పాండ్యా ముందువరుసలో ఉన్నాడు. వెస్టిండిస్, అమెరికా వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్లో వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. అయితే, అంశంపై జైషా స్పందిస్తూ.. ‘కెప్టెన్సీపై నిర్ణయాన్ని సెలెక్టర్లు తీసుకుంటారు. వారితో చర్చించిన తర్వాత దాన్ని ప్రకటిస్తాం. హార్దిక్ గురించి అడిగారు. అతని ఫామ్పై చాలా ప్రశ్నలు ఉన్నాయి. కానీ, తాము, సెలెక్టర్లు విశ్వాసం చూపించాం. పాండ్యా తనను తాను నిరూపించుకున్నాడు’ అన్నారు. గత పదేళ్లలో పలు టోర్నీలో ఫైనల్కు చేరినా.. టైటిల్స్ను గెలుచుకోలేదని.. ప్రస్తుతం ఆ కరువును తీర్చిందన్నారు. ఇకపై విజయపరంపర కొసాగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.