Team India | బ్రిడ్జ్టౌన్(బార్బడోస్): భారత క్రికెట్ జట్టు బార్బడోస్ తుఫాన్లో చిక్కుకుంది. భారతీయుల సుదీర్ఘ కలను సాకారం చేసి స్వదేశంలో సగర్వంగా అడుగుపెడుదామనుకున్న టీమ్ఇండియాకు ఇబ్బందులు చుట్టుముట్టాయి. బెరిల్ తుఫాన్తో బార్బడోస్ తీర ప్రాంతం చిగురుటాకులా వణుకుతున్నది. సముద్రతీర ప్రాంతం కావడంతో పాటు బలమైన గాలులకు తోడు భారీ వర్షంతో బార్బడోస్ నగరం తడిసి ముద్దయ్యింది.
టైప్-4 తుఫాన్గా భావిస్తున్న బెరిల్ గంటకు దాదాపు 209 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. దీంతో నగరం మొత్తం అధికారులు కర్ఫ్యూ విధించారు. భీకరమైన గాలులు వీస్తున్న నేపథ్యంలో బయటికి ఎవరూ రావద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. దీనికి తోడు స్థానిక విమానాశ్రయం తుఫాన్తో జలమయమైంది. విమానాలు ప్రయాణం చేసేందుకు అనువైన వాతావరణం లేకపోవడంతో ఎయిర్పోర్ట్ను తాత్కాలికంగా మూసివేశారు.
ఈ కారణంగా ప్రస్తుతం హిల్టన్ హోటల్లో బస చేస్తున్న భారత క్రికెటర్లతో పాటు వారి కుటుంబ సభ్యులు, సహాయక సిబ్బంది, బీసీసీఐ అధికారులు హోటల్ గదులకు పరిమితమయ్యారు. సోమవారం తుఫాన్ తీరం చేరే అవకాశమున్న నేపథ్యంలో మంగళవారం తుఫాన్ ప్రభావం తగ్గే అవకాశాలు కనిపిస్తున్నట్లు తెలిసింది.
భారీ తుఫాన్ కారణంగా హోటల్ సిబ్బంది లేకపోవడంతో క్రికెటర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు కరెంట్ కూడా తీసేసినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతమే అక్కడే ఉన్న బీసీసీఐ కార్యదర్శి జై షా ఎక్స్లో స్పందిస్తూ ‘బార్బడోస్లో చిక్కుకుపోయాం. తుఫాన్ సద్దుమణిగిన తర్వాత స్వదేశంలో ప్లేయర్ల సన్మానం గురించి ఆలోచిస్తాం’ అని అన్నాడు.
70 మందితో చార్టెడ్ విమానంలో!
వాస్తవానికి ఆదివారమే న్యూయార్క్కు బయల్దేరాల్సి ఉన్నా..తుఫాన్ కారణంగా బార్బడోస్లోనే ఉండిపోయారు. ఉదయం సమయాన దక్షిణాఫ్రికా టీమ్..బార్బడోస్ నుంచి తిరుగు ప్రయాణమైంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం టీమ్ఇండియా క్రికెటర్లు, వారి కుటుంబ సభ్యులు, సహాయక సిబ్బంది, బీసీసీఐ ప్రతినిధి బృందం, స్పోర్ట్స్ జర్నలిస్టులు అంతా కలిపి 70 మంది వరకు ఉన్నట్లు అంచనా. వీరందరూ కలిసి చార్టెడ్ విమానంలో స్వదేశానికి వెళ్లేందుకు బోర్డు ప్రయత్నాలు చేస్తున్నది. ఎయిర్పోర్ట్ నుంచి క్లియరెన్స్ రాగానే ప్రయాణమయ్యేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. మొత్తంగా భారత క్రికెట్ జట్టు..క్షేమంగా చేరుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.