IND vs SA : పొట్టి ప్రపంచ కప్లో ఆఖరి యుద్ధం. ఓటమెరుగని రెండు జట్ల మధ్య ఉత్కంఠ రేపేలా టైటిల్ ఫైట్ జరగడం చరిత్రలో ఇదే ప్రథమం. ఈ మహా సంగ్రామంలో ఒకరు గెలిస్తే చరిత్ర.. మరొకరు ట్రోఫీని ముద్దాడితే రికార్డు. తొమ్మిదో సీజన్లో అజేయంగా టైటిల్ వేటకు దూసుకొచ్చిన భారత్ (India), దక్షిణాఫ్రికా (South Africa)లు కింగ్స్టన్ ఓవల్ మైదానంలో తాడోపేడో తేల్చుకోనున్నాయి. టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
భారత జట్టు : రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివం దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్.
దక్షిణాఫ్రికా జట్టు : క్వింటన్ డికాక్(వికెట్ కీపర్), రీజా హెండ్రిక్స్, ఎడెన్ మర్క్రమ్(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, అన్రిచ్ నోర్జి, ఒట్నిల్ బార్ట్మన్
టీ20 వరల్డ్ కప్లో భారత్, దక్షిణాఫ్రికా జట్లు ఓడిందే లేదు. అలాంటిది ఇప్పుడు ఏదో ఒక టీమ్కు ఓటమి తప్పని పరిస్థితి.
చోకర్స్ అనే అపవాదును బద్ధలుకొట్టిన సఫారీ జట్టు తొలి టైటిల్ వేటకు సిద్ధమవగా.. 13వ ఐసీసీ ఫైనల్ ఆడుతున్న టీమిండియా 11 ఏండ్ల ట్రోఫీ నిరీక్షణకు చెక్ పెట్టాలనే పట్టుదలతో ఉంది. టెస్టు గద, వన్డే వరల్డ్ కప్ను ఆస్ట్రేలియాకు అప్పజెప్పిన భారత్ టీ20 వరల్డ్ కప్లో ఆ పొరపాటు చేయొద్దని భావిస్తోంది.
కింగ్స్టౌన్ ఓవల్లో బిగ్ ఫైట్ అభిమానులను అలరించనుంది. ఈ మ్యాచ్ వరల్డ్ క్లాస్ బ్యాటర్లకు, బౌలర్లకు పెద్ద పరీక్ష కానుంది. రోహిత్ శర్మ బృందం విషయానికొస్తే.. సమిష్టితత్వమే మంత్రంగా ఆడుతోంది. టాపార్డర్లో కెప్టెన్ రోహిత్ శివాలెత్తుతుండగా.. రిషభ్ పంత్, సూర్యకుమార్, హార్దిక్ పాండ్యాలు ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నరు. ఇక దక్షిణాఫ్రికా సైతం దాదాపు ఇదే సూత్రంతో చెలరేగింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ టాప్లో దంచేస్తుంటే.. సారథి ఎడెన్ మర్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్లు తలా కొన్ని పరుగులు చేస్తూ భరోసా ఇస్తున్నారు.
బౌలింగ్ యూనిట్లో ప్రొటిస్ జట్టు పటిష్ఠంగా ఉంది. స్పీడ్స్టర్లు కగిసో రబడ, నోకియా, మార్కో జాన్సెన్లు బెంబేలెత్తిస్తున్నారు. ఇక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ తబ్రేజ్ షంసీ భీకర ఫామ్లో ఉన్నాడు. కేశవ్ మహరాజ్ సైతం వికెట్లు తీయగల సమర్ధుడే. దాంతో, ట్రోఫీ కోసం జరిగే ఈ పోరు ఆటగాళ్లనే కాదు అభిమానులను మునివేళ్లపై నిలబెట్టడం ఖాయం.