టెస్టులలో ఇదే అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీ. అన్నాబెల్ (ఆసీస్ 248 బంతుల్లో) రికార్డును షఫాలీ బ్రేక్ చేసింది.
చెన్నై: భారత మహిళల క్రికెట్లో ‘లేడీ సెహ్వాగ్’ అన్న గుర్తింపు దక్కించుకున్న యువ ఓపెనర్ షఫాలీ వర్మ (197 బంతుల్లో 205, 23 ఫోర్లు, 8 సిక్సర్లు) అందుకు తగ్గట్టుగానే టెస్టులలో రికార్డు ద్విశతకంతో మెరిసింది. చెన్నై వేదికగా దక్షిణాఫ్రికాతో శుక్రవారం నుంచి మొదలైన ఏకైక టెస్టు తొలి రోజే బౌండరీలు, సిక్సర్ల మోత మోగించి టెస్టులలో అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీని నమోదు చేసింది. కెరీర్లో అత్యద్భుత ఫామ్లో ఉన్న స్మృతి మంధాన (161 బంతుల్లో 149, 27 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి రికార్డు భాగస్వామ్యం (292) నెలకొల్పడంతో తొలి రోజు భారత్ 98 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 525 పరుగుల భారీ స్కోరు సాధించి తొలిరోజే తిరుగులేని స్థానంలో నిలిచింది.
కెరీర్లో ఐదో టెస్టు ఆడుతున్న షఫాలీ, సీనియర్ బ్యాటర్ స్మృతి ఆది నుంచే సఫారీ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ఏడో ఓవర్లో బౌండరీతో షఫాలీ బౌండరీల మోతకు శ్రీకారం చుట్టింది. డీక్లర్క్ 9వ ఓవర్లో రెండు ఫోర్లతో మంధాన కూడా అదే బాటలోకి వచ్చింది. తొలి సెషన్లోనే ఈ ఇద్దరూ అర్ధ సెంచరీలు పూర్తిచేసి క్రీజులో నిలదొక్కుకున్నా రు. 38 ఓవర్ ఆఖరి బంతికి షఫాలీ 113 బంతుల్లోనే షఫాలీ తన టెస్టు కెరీర్లో తొలి శతకాన్ని పూర్తి చేయగా మరుసటి ఓవర్ తొలిబంతికి మంధాన మూడంకెల స్కోరు చేసింది. గడిచిన ఐదు అంతర్జాతీయ మ్యాచ్లలో ఆమెకు ఇది నాలుగో సెంచరీ.
శతకాల తర్వాత ఈ జోడీ పోటీపడి బౌండరీలు బాదారు. ఓవర్కు ఒక్క ఫోర్కు తగ్గకుండా వీరి జోరు సాగింది. డెర్క్సెన్ 49వ ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లు బాదిన మంధానను టక్కర్ 52వ ఓవర్లో ఔట్ చేయడంతో రికార్డు భాగస్వామ్యానికి తెరపడింది. రెండో సెషన్లో షఫాలీ, మంధాన దూకుడుతో 32 ఓవర్లలోనే భారత్ 204 పరుగులు పిండుకోవడం విశేషం. మంధాన నిష్క్రమించినా జెమీమా రోడ్రిగ్స్ (55)తో కలిసి షఫాలీ జోరు కొనసాగించింది. 180లలోకి వచ్చాక టక్కర్ వేసిన 73వ ఓవర్లో 2 సిక్సర్లు బాదింది. మూడో బంతికి సింగిల్ తీసి ద్విశతకాన్ని పూర్తిచేసింది. ఈ క్రమంలో మిథాలీరాజ్ తర్వాత డబుల్ సెంచరీ చేసిన రెండో భారత బ్యాటర్గా షఫాలీ నిలిచింది. ఆఖర్లో కెప్టెన్ హర్మన్ప్రీత్ (42 నాటౌట్), రిచా(43 నాటౌట్) దూకుడుగా ఆడటంతో భారత్ భారీ స్కోరు దిశగా సాగుతోంది.
షఫాలీ-స్మృతి నమోదుచేసిన భాగస్వామ్యం (292) టెస్టులలో అత్యధిక ఓపెనింగ్ పార్ట్నర్షిప్. గతంలో ఈ రికార్డు పాక్ బ్యాటర్లు సాజిదా-కిరణ్ (వెస్టిండీస్పై 241) పేరిట ఉండేది. భారత్ తరఫున ఇదే అత్యధికం కాగా ప్రపంచ క్రికెట్లో ఏ వికెట్కు అయినా ఇది రెండో అత్యుత్తమం.
మహిళల టెస్టు క్రికెట్ చరిత్రలో ఒకరోజు అత్యధిక పరుగులు చేసిన జట్టుగా భారత్ రికార్డులకెక్కింది. 1935లో ఇంగ్లండ్ (కివీస్పై 431/2) ఈ ఘనత నమోదుచేసింది. ఇదే రోజు న్యూజిలాండ్ సైతం 44 రన్స్ చేసింది. అయినా ఇరుజట్లు కలిసిచేసింది (475) భారత్ కంటే తక్కువే. పురుషుల క్రికెట్లో సైతం ఒకరోజు అత్యధిక పరుగులు చేసిన జాబితాలో శ్రీలంక పేరిట ఉన్న (బంగ్లాదేశ్పై 509) రికార్డు కనుమరుగైంది.
2008 మార్చి 28, భారత్- దక్షిణాఫ్రికా మధ్య ఇదే చెన్నై వేదికగా జరిగిన టెస్టులో వీరేంద్ర సెహ్వాగ్ 194 బంతుల్లోనే ట్రిపుల్ సెంచరీ (319) చేశాడు. వ్యక్తిగత స్కోరు 190లలోకి వచ్చాక సిక్సర్ బాదాడు. భారత్కు పురుషుల విభాగంలో అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీ రికార్డు ఇప్పటికే అతడిదే. 2024, జూన్ 28న షఫాలీ సైతం ఇవే ఘనతలు నమోదు చేయడం విశేషం.
భారత్: 98 ఓవర్లలో 525/4 (షఫాలీ 205, మంధాన 149, టక్కర్ 2/141, డీ క్లర్క్ 1/60)