ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ ఆఖరి అంకానికి చేరుకుంది. అపజయమన్నదే ఎరుగకుండా ప్రత్యర్థులను చిత్తుచేస్తూ అజేయంగా ఫైనల్లోకి దూసుకొచ్చిన భారత్, దక్షిణాఫ్రికా తమ చిరకాల కల సాకారానికై సై అంటే సై అంటున్నాయి. గత 17 ఏండ్లుగా టీ20 ప్రపంచకప్ ట్రోఫీ కోసం టీమ్ఇండియా ఎదురుచూస్తుంటే.. తొలిసారి ఫైనల్ పోరుకు అర్హత సాధించిన సఫారీలు సత్తాచాటేందుకు తహతహలాడుతున్నారు. వరుణుడు అంతరాయం కల్గించే అవకాశమున్న నేపథ్యంలో మ్యాచ్ సజావుగా సాగేది సందిగ్ధంగా మారింది.
T20 World Cup | బ్రిడ్జ్టౌన్(బార్బడోస్): టీ20 ప్రపంచకప్లో భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఆఖరి సమరానికి సమయం ఆసన్నమైంది. మరికొన్ని గంటల్లో బార్బడోస్ వేదికగా రెండు జట్లు కదనరంగంలోకి దూకనున్నాయి. అఫ్గానిస్థాన్ను చిత్తుచేస్తూ సఫారీలు ఫైనల్లో అడుగుపెట్టగా..గత టోర్నీలో తమకు ఎదురైన పరాజయానికి ఇంగ్లండ్పై ప్రతీకారం తీర్చుకుంటూ టీమ్ఇండియా తుది పోరులో నిలిచింది.
సరిగ్గా పదేండ్ల తర్వాత పొట్టి ప్రపంచకప్లో టైటిల్ పోరుకు అర్హత సాధించిన భారత్..రెండో సారి కప్ను ముద్దాడాలని చూస్తున్నది. ఐసీసీ మెగాటోర్నీల్లో తమపై ఉన్న చోకర్స్ ముద్రను చెరిపివేస్తూ తొలిసారి ఫైనల్కు వచ్చిన సఫారీలు ప్రపంచకప్ను ఒడిసిపట్టుకునేందుకు తహతహలాడుతున్నారు. ఈ నేపథ్యంలో కప్ కోసం రెండు అత్యుత్తమ జట్లు కొదమసింహాల్లా కొట్లాడే అవకాశముంది. బలబలాల పరంగా చూస్తే..దక్షిణాఫ్రికా కంటే భారత్ బలంగా కనిపిస్తున్నా..అనిశ్చితికి మారుపేరైనా టీ20ల్లో అదృష్టం ఎవరిని వరిస్తుందనేది ఆసక్తికరం.
తమ కెరీర్లో చివరి టీ20 ప్రపంచకప్ ఆడుతున్న రోహిత్శర్మ, విరాట్కోహ్లీ, రవీంద్ర జడేజా ఆఖరాటలో ఆకట్టుకునేందుకు పట్టుదలతో ఉన్నారు. ముఖ్యంగా ఫామ్లేమితో సతమతమవుతున్న కోహ్లీకి ఓపెనింగ్ కలిసిరావడం లేదు. ప్రస్తుత టోర్నీలో స్థాయికి తగ్గ ఆటతీరు ప్రదర్శించలేకపోయిన కోహ్లీ..ఫైనల్లో బ్యాటు ఝులిపించేందుకు కసిమీద ఉన్నాడు. మరోవైపు మంచి ఫామ్మీదున్న కెప్టెన్ రోహిత్..ప్రత్యర్థి బౌలర్లపై ఆకలిగొన్న పులిలా విరుచుకుపడుతున్నాడు. ఒక ఎండ్లో కోహ్లీ విఫలమవుతున్నా..ఆ ప్రభావం కనిపించకుండా బ్యాటింగ్ భారాన్ని మోస్తున్నాడు.
ఆల్రౌండ్ కోటాలో తుది జట్టులో కొనసాగుతున్న జడేజా తన పాత్రకు న్యాయం చేయలేకపోతున్నాడు. అటు బ్యాటింగ్తో పాటు బౌలింగ్లో మెరుపులు మెరిపించలేకపోతున్నాడు. ఇదిలా ఉంటే ప్రధాన కోచ్గా ద్రవిడ్కు ఇదే చివరి మ్యాచ్. ఇంగ్లండ్తో సమిష్టి ప్రదర్శన కనబరిచిన టీమ్ఇండియా..అదే రీతిలో సఫారీల భరతం పట్టేందుకు పక్కా ప్రణాళికతో ఉంది. పిచ్పై పూర్తి అవగాహనకు వచ్చిన టీమ్ మేనేజ్మెంట్ స్పిన్నర్లతో సానుకూల ఫలితాలను రాబడుతున్నది. ఇంగ్లండ్తో సెమీస్ పోరులో అక్షర్పటేల్, కుల్దీప్యాదవ్ ప్రదర్శనే ఇందుకు నిదర్శనం. వీరికి తోడు బుమ్రా, అర్ష్దీప్సింగ్ వికెట్ల వేట కొనసాగిస్తున్నారు.
మెగాటోర్నీలో తొలిసారి ఫైనల్ ఆడబోతున్న సఫారీలు..భారత్కు దీటైన పోటీనిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. క్వింటన్ డికాక్, క్లాసెన్, కెప్టెన్ మార్క్మ్,్ర స్టబ్స్ పరిస్థితులకు తగ్గట్లు ఆడుతూ విజయాల్లో కీలకమవుతున్నారు. ఓపెనర్ డికాక్ నిలకడలేమి ఆందోళన కల్గిస్తున్నా..తనదైన రోజు అతడు సాగించే విధ్వంసం మాటలకందనిది. మిడిలార్డర్లో మార్క్మ్,్ర క్లాసెన్, మిల్లర్, స్టబ్స్ చెలరేగితే భారత్కు కష్టాలు తప్పకపోవచ్చు. రబాడ, జాన్సెన్, నోకియా, మహారాజ్, షంసీతో సఫారీలు బలంగా కనిపిస్తున్నారు. భారత బ్యాటర్లను వీరు ఏ మాత్రం నిలువరిస్తారో చూడాలి.
భారత్: రోహిత్(కెప్టెన్), కోహ్లీ, పంత్, సూర్యకుమార్, దూబే, హార్దిక్, అక్షర్, జడేజా, అర్ష్దీప్, కుల్దీప్, బుమ్రా.
దక్షిణాఫ్రికా: మార్క్మ్(్రకెప్టెన్), డికాక్, హెండ్రిక్స్, మిల్లర్, స్టబ్స్, క్లాసెన్, జాన్సెన్, మహారాజ్, రబాడ, నోకియా, షంసి/బార్ట్మన్.
2 2007లో తొలిసారి ప్రపంచకప్ గెలిచిన భారత్కు ఈసారి గెలిస్తే.. మన ఖాతాలో రెండోది చేరినట్లే.
ఫైనల్కు వేదికైన కెన్సింగ్టన్ ఓవల్..పేసర్లకు అనుకూలించనుంది. వర్షం అంతరాయం కల్గించే అవకాశముంది. వర్షంతో మ్యాచ్కు ఆటంకం ఏర్పడితే రిజర్వ్డే(ఆదివారం) కొనసాగించవచ్చు. కనీసం 10 ఓవర్ల మ్యాచ్ ద్వారా విజేతను ప్రకటించనున్నారు.