IND vs ENG : పొట్టి ప్రపంచ కప్లో భారత జట్టు(Team India)కు సెమీఫైనల్లో అసలైన సవాల్ ఎదరువ్వనుంది. డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ (England)తో గయానా వేదికగా టీమిండియా తలపడనుంది. 11 ఏండ్ల ఐసీసీ ట్రోఫీ నిరీక్షణకు తెరదించాలనుకుంటున్నరోహిత్ సేన.. జోస్ బట్లర్ బ్యాచ్ అడ్డుగోడను దాటుతుందా? లేదా? అని అభిమానుల్లో ఒకింత కలవరం. ఎందుకంటే.. రెండేండ్ల క్రితం ఆస్ట్రేలియా గడ్డపై భారత్, ఇంగ్లండ్లు సెమీస్లో ఎదురుపడ్డాయి.
అప్పుడు ఆడిలైడ్ ఓవల్లో జరిగిన ఆ మ్యాచ్లో క్రిస్ జోర్డాన్ మూడు వికెట్లతో విజృభించినా.. హార్దిక్ పాండ్యా (63) కోహ్లీ(50) లు అర్ద శతకాలతో రాణించారు. 168 పరుగుల ఛేదనలో ఓపెనర్లు అలెక్స్ హేల్స్(86 నాటౌట్), జోస్ బట్లర్(80 నాటౌట్లు) వీరకొట్టుడు కొట్టారు. దాంతో, మరో 4 ఓవర్లు ఉండగానే ఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో జయభేరి మోగించి ఫైనల్కు దూసుకెళ్లింది.
మరో విషయం ఏంటంటే అప్పుడు ఆ జట్టులో ఉన్నవాళ్లలో సగానికి పైగా(బట్లర్, హ్యారీ బ్రూక్, సామ్ కరన్, లివింగ్స్టోన్, మోయిన్ అలీ, క్రిస్ జోర్డాన్ మార్క్వుడ్, ఆదిల్ రషీద్) ఇప్పటి జట్టులో ఉన్నారు. పైగా.. సూపర్ 8లో ఇంగ్లండ్ చాంపియన్ తరహాలో ఆడింది. దక్షిణాఫ్రికా చేతిలో కడదాకా పోరాడి ఓడినా.. ఆ తర్వాత చావోరేవో పోరులో అమెరికాను హడలెత్తించింది. ముఖ్యంగా ఆ జట్టు సారథి బట్లర్, పేసర్లు జోఫ్రా ఆర్చర్, క్రిస్ జోర్డాన్లు భీకర ఫామ్లో ఉన్నారు. సెమీ ఫైనల్లో భారత్కు వీళ్లతో పాటు ఓపెనర్ ఫిలిప్ సాల్ట్, హ్యారీబ్రూక్ల నుంచి ముప్పు ఉంది.
ఇక భారత్ విషయానికొస్తే.. తొమ్మిదో సీజన్లో రోహిత్ శర్మ బృందం సమిష్టిగా రాణిస్తోంది. బ్యాటింగ్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలపై అతిగా ఆధారపడట్లేదు. ఈ ఇద్దరు సీనియర్లు విఫలమైనా ‘మేమున్నామంటూ’ రిషభ్ పంత్ (Rishabh Pant), సూర్యకుయార్ యాదవ్, హార్దిక్ పాండ్యాలు ఇన్నింగ్స్ నిర్మిస్తున్నారు. మిడిల్ ఓవర్లలో కీలక భాగస్వామ్యాలతో జట్టు భారీ స్కోర్కు బాటలు వేస్తూ భరోసాగా నిలుస్తున్నారు. మెగా టోర్నీలో ఒక్కటంటే ఒక్క చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడని విరాట్.. ఈసారైనా బ్యాట్ ఝులిపించాలని యావత్ భారతావని కోరుకుంటోంది.
పొట్టి ప్రపంచ కప్లో బుమ్రా నేతృత్వంలోని బౌలింగ్ యూనిట్ అయితే సూపర్ హిట్ అనే చెప్పాలి. పాకిస్థాన్పై 119 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవడంలో బుమ్రా, అర్ష్దీప్, పాండ్యాలు కీలక పాత్ర పోషించారు. ఈ టోర్నీలో ఇప్పటి వరకూ.. 6 మ్యాచుల్లో బుమ్రా 11 వికెట్లతో అదరగొట్టగా.. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్ష్దీప్ సింగ్ (Arshdeep Singh) 15 వికెట్లతో వారెవ్వా అనిపించాడు. సూపర్ 8 మ్యాచ్లతో ఎంట్రీ ఇచ్చిన స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కావాల్సిన సమయంలో బ్రేక్ ఇస్తున్నాడు. జూన్ 27న గయానా వేదికగా భారత జట్టు సమిష్టిగా ఆడితే ఇంగ్లండ్కు చెక్ పెట్టడం కష్టమేమీ కాదు.