ఎన్ని గుండెకోతలు! ఎంత వేదన!! ఒకటా రెండా? దశాబ్దకాలంగా అందినట్టే అందుతూ చేజారుతున్న ఐసీసీ ట్రోఫీ ఎట్టకేలకు భారత్ సొంతమైంది. గత ఏడాది కాలంలో మూడుసార్లు ఐసీసీ టోర్నీల్లో ఫైనల్ వరకు వెళ్లినా అన్నిసార్లు నిరాశే ఎదురైంది. నిరుడు స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్లో చేతులదాకా వచ్చిన ట్రోఫీని కంగారూలు పట్టుకుపోతుంటే హృదయం ముక్కలవని క్రికెట్ అభిమాని లేడంటే అతిశయోక్తి లేదు. 2011లో ధోనీ సారథ్యంలో వన్డే ప్రపంచకప్ గెలిచిన తర్వాత మళ్లీ ఐసీసీ టోర్నీ మన దరిచేరలేదు. ఆ తరువాత ఐదు సార్లు ఫైనల్ వరకూ చేరినా కప్పు దక్కలేదు. కానీ ఈసారి కరేబియన్ గడ్డ మీద మాత్రం 140 కోట్ల అభిమానుల కల నెరవేరింది. కోట్లాది అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ.. 17 ఏండ్ల (2007) తర్వాత టీ20 వరల్డ్ కప్ను భారత్ ముద్దాడింది. గత రెండు ప్రపంచకప్లలో తమను దెబ్బకొట్టిన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ను ఇంటికి పంపిన రోహిత్ సేన.. ఫైనల్లో సమిష్టి ఆటతీరుతో సఫారీలను మట్టికరిపించింది. పురుషుల క్రికెట్లో భారత్ ఐసీసీ కప్ను అందుకోవడం ఇది నాలుగోసారి. వన్డే క్రికెట్లో రెండుసార్లు ప్రపంచ చాంపియన్గా నిలిచిన భారత్, పొట్టి ఫార్మాట్లో కూడా దానిని సమం చేసింది.
వెస్టిండీస్లోని బ్రిడ్జ్టౌన్లో శనివారం దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. చివరి ఓవర్ వరకూ నరాలుతెగే ఉత్కంఠతో హోరాహోరీగా సాగిన ఫైనల్ పోరులో భారత్ 7 పరుగుల తేడాతో సఫారీలను మట్టికరిపించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. పొట్టి ఫార్మాట్ ఫైనల్ మ్యాచ్లో ఇంతవరకు ఇదే అత్యధిక స్కోరు. ఆ తరువాత బ్యాటింగ్కు దిగిన సఫారీలు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 169 పరుగులు మాత్రమే చేయగలిగారు.
భారత్ గ్రూప్ మ్యాచ్ల నుంచి సూపర్-8లో కూడా ఓటమి ఎరుగకుండా ఫైనల్ చేరింది. సెమీఫైనల్స్లో ఇంగ్లండ్ను సునాయాసంగానే ఓడించిన భారత్కు ఫైనల్లో దక్షిణాఫ్రికా గట్టి పోటీనిచ్చింది. అయితే గత33 ఏండ్లుగా క్రికెట్ వరల్డ్ కప్ సఫారీలకు అందని ద్రాక్షగానే మిగిలిపోయింది.
అద్భుతం ఆవిష్కృతమైంది! ఒకటా..రెండా 17 ఏండ్లుగా అందని ద్రాక్షగా ఊరిస్తూ వస్తున్న పొట్టి ప్రపంచకప్ ఎట్టకేలకు మన చెంత చేరింది. 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్ష ఫలించిన వేళ..కరీబియన్ గడ్డపై త్రివర్ణ పతాకం సగర్వంగా రెపరెపలాడింది. విజయమో, వీరస్వర్గమో అన్న రీతిలో సరిహద్దుల్లో సైనికుల్లాగా మన క్రికెటర్లు పోరాడిన తీరు చిరకాలం అభిమానుల మదిలో నిలిచిపోనుంది. మెగాటోర్నీలో ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తుచేస్తూ..అప్రతిహత విజయాలతో ఆఖరి పోరులో నిలిచిన రోహిత్సేన.. దక్షిణాఫ్రికాపై చారిత్రక విజయంతో కదంతొక్కింది. కింగ్స్టన్ ఓవల్ మైదానంలో కొత్త చరిత్ర లిఖిస్తూ రెండోసారి టీ20 ప్రపంచకప్ను ముద్దాడింది.
శనివారం ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన పోరులో సఫారీలపై భారత్దే సవారీ అయ్యింది. రన్మెషీన్ విరాట్ కోహ్లీ సాధికారిక అర్ధసెంచరీకి తోడు..అక్షర్పటేల్, దూబే బ్యాటింగ్తో భారత్ పోరాడే స్కోరు అందుకుంది. లక్ష్యఛేదనలో క్లాసెన్, డికాక్ భయపెట్టినా..భారత్ తలవంచలేదు. పోరాడితే పోయేదేమి లేదన్న తరహాలో కడదాకా కొట్లాడుతూ ప్రపంచకప్ను ముద్దాడింది. ఒకానొక దశలో క్లాసెన్ వీరబాదుడుతో కోట్లాది మంది అభిమానుల గుండెలు దడేల్ మన్నాయి. ఇక్కడే హార్దిక్ పాండ్యా అద్భుతం చేశాడు. ఆఖరి ఓవర్లో సూర్యకుమార్యాదవ్ సూపర్ క్యాచ్తో సఫారీల ప్రపంచకప్ ఆశలు ఆవిరయ్యాయి.
వెస్టిండీస్, ఇంగ్లండ్ తర్వాత రెండుసార్లు టీ20 వరల్డ్ కప్ గెలిచిన మూడో జట్టు భారత్.
టీ20 ప్రపంచకప్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడకుండా ట్రోఫీ నెగ్గిన జట్టు భారత్
టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఇదే అత్యధిక స్కోరు. 2021 ఎడిషన్లో ఆస్ట్రేలియా.. న్యూజిలాండ్పై 173 పరుగులు సాధించడమే ఇప్పటిదాకా అత్యుత్తమం.
టీ20 కెప్టెన్గా రోహిత్కు ఇది 50వ విజయం. పొట్టి ఫార్మాట్లో ఇదే రికార్డు.
ప్రైజ్మనీ విజేత: భారత్ రూ.20.40 కోట్లు
రన్నరప్: దక్షిణాఫ్రికా రూ.10.67 కోట్లు
Team India | బ్రిడ్జ్టౌన్: భారత్ చిరకాల కల నెరవేరింది! అందినట్లే అంది చేజారుతూ వస్తున్న ప్రపంచకప్ ఎట్టకేలకు మన చెంతకు చేరింది. శనివారం ఆఖరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన టీ20 ప్రపంచకప్లో టీమ్ఇండియా ఏడు పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై చిరస్మరణీయ విజయం సాధించింది. తొలుత విరాట్ కోహ్లీ(59 బంతుల్లో 76, 6ఫోర్లు, 2సిక్స్లు), అక్షర్పటేల్(31 బంతుల్లో 47, ఫోర్, 4సిక్స్లు) బ్యాటింగ్తో భారత్ తొలుత 20 ఓవర్లలో 176/7 స్కోరు చేసింది. మహారాజ్, నోకియా రెండేసి వికెట్లు తీశారు. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 169/8 స్కోరు చేసింది. క్లాసెన్(27 బంతుల్లో 52, 2ఫోర్లు, 5సిక్స్లు), డికాక్(39) రాణించారు. హార్దిక్పాండ్యా(3/20) మూడు వికెట్లతో విజృంభించగా, అర్ష్దీప్సింగ్(2/20), బుమ్రా(2/18) రెండేసి వికెట్లతో సత్తాచాటారు. అర్ధసెంచరీతో జట్టు విజయంలో కీలకమైన కోహ్లీకి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’, 15 వికెట్లతో అదరగొట్టిన బుమ్రాకు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ గా నిలిచాడు.
తొలుత టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకున్నది. మెగాటోర్నీలో ఫామ్లేమితో సతమతమైన విరాట్ కోహ్లీ ఫైనల్ పోరులో సత్తాచాటాడు. జాన్సెన్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లో మూడు ఫోర్లు బాది తన ఉద్దేశమేంటో చెప్పకనే చెప్పాడు. అయితే బౌలింగ్ మార్పుగా వచ్చిన లెఫ్టార్మ్ స్పిన్నర్ కేశవ్ మహారాజ్..టీమ్ఇండియాను ఆదిలోనే దెబ్బకొట్టాడు. వరుసగా రెండు ఫోర్లతో జోరు మీద కనిపించిన కెప్టెన్ రోహిత్శర్మ(9)తో పాటు వికెట్కీపర్, బ్యాటర్ పంత్(0)ను వెంటవెంటనే ఔట్ చేసి సఫారీ శిబిరంలో ఆనందం నింపాడు. తొలి రెండు ఓవర్లు ముగిసే సరికి టీమ్ఇండియా రెండు కీలక వికెట్లు కోల్పోయి 23 పరుగులు చేసింది. అప్పటికే కష్టాల్లో ఉన్న ఇండియాను రబాడ మరింత ఇబ్బందుల్లోకి నెట్టాడు.
భారీ షాట్ ఆడబోయిన ‘మిస్టర్ 360’ సూర్యకుమార్(3)..క్లాసెన్ క్యాచ్తో మూడో వికెట్గా వెనుదిరిగాడు. 34 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయిన తరుణంలో బ్యాటింగ్ ఆర్డర్లో ముందువచ్చిన అక్షర్పటేల్..కోహ్లీకి జతకలిశాడు. ఇక్కణ్నుంచి టీమ్ఇండియా ఇన్నింగ్స్ గాడిలో పడింది. వీరిద్దరు సఫారీ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పవర్ప్లే ముగేసి సరికి భారత్ 3 వికెట్లకు 45 పరుగులు చేసింది.
ఓవైపు సహచరులు నిష్క్రమించినా..కోహ్లీ పరిణతి కనబరిచాడు. ఇన్నింగ్స్ గాడిలో పడి ఊపందుకుంటున్న తరుణంలో అనవసర పరుగు కోసం ప్రయత్నించిన అక్షర్.. కీపర్ డికాక్ డైరెక్ట్ త్రోతో భారంగా పెవిలియన్కు వెళ్లాడు. దీంతో నాలుగో వికెట్కు 72 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శివమ్ దూబే(27) అడపాదడపా భారీ షాట్లు ఆడే ప్రయత్నం చేశాడు. హాఫ్ సెంచరీ తర్వాత బ్యాటు ఝులిపించిన విరాట్..రబాడ 18వ ఓవర్లో ఓ భారీ సిక్స్, ఫోర్తో ఆకట్టుకున్నాడు. అదే ఊపులో జాన్సెన్ను అరుసుకుంటూ 19వ ఓవర్లో కోహ్లీ 4, 6 జోరు కనబరిచాడు. మరో భారీ షాట్ ఆడే క్రమంలో బౌండరీ వద్ద రబాడ క్యాచ్తో కోహ్లీ ఔట్ కావడంతో ఐదో వికెట్కు 57 పరుగుల పార్ట్నర్షిప్ ముగిసింది. 20వ ఓవర్ వేసిన నోకియా..దూబే, జడేజా(2)ను ఔట్ చేసి తొమ్మిది పరుగులే ఇచ్చుకోవడంతో టీమ్ఇండియా 7 వికెట్లకు 176 పరుగుల వద్ద ఇన్నింగ్స్కు తెరపడింది.
భారత్ నిర్దేశించిన లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా సరైన శుభారంభం దక్కలేదు. 12 పరుగులకే ఓపెనర్ హెండ్రిక్స్(4), కెప్టెన్ మార్క్మ్(్ర4) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. ఓవైపు సహచరులు నిష్క్రమించినా..డికాక్ పోరాటాన్ని నమ్ముకున్నాడు. ఈ తరుణంలో కెప్టెన్ రోహిత్ బౌలర్లను మార్చి మార్చి ప్రయోగించినా లాభం లేకపోయింది. ఇంగ్లండ్తో గత మ్యాచ్లో విజృంభించిన స్పిన్నర్లు అక్షర్పటేల్, కుల్దీప్యాదవ్ ఈ మ్యాచ్లో పూర్తిగా తేలిపోయారు. 13వ ఓవర్లో భారీ షాట్ ఆడబోయిన డికాక్..కుల్దీప్ క్యాచ్తో ఔటయ్యాడు. ఆ తర్వాత క్లాసెన్ విశ్వరూపం ప్రదర్శించాడు. అక్షర్ పటేల్ వేసిన 15వ ఓవర్లో రెండు సిక్స్లు, రెండు ఫోర్లతో ఏకంగా 24 ఫోర్లతో దుమ్మురేపాడు. మ్యాచ్ పూర్తిగా చేజారిందన్న తరుణంలో హార్దిక్..క్లాసెన్తో పాటు మిల్లర్ను ఔట్ చేసి మ్యాచ్ను మన వైపునకు తిప్పాడు.
చివరి ఓవర్ తొలి బంతికి హార్దిక్ వేసినలో ఫుల్టాస్ను మిల్లర్ లాంగాఫ్ దిశగా భారీ షాట్ ఆడాడు. అక్కడికి కొద్దిదూరంలో ఫీల్డింగ్ చేస్తున్న సూర్య పరిగెత్తుకుంటూ వచ్చి బౌండరీ లైన్కు ఇంచు దూరంలో బాడీని బ్యాలెన్స్ చేసుకుంటూ రన్నింగ్ క్యాచ్ను అందుకున్నాడు. కానీ అప్పటికే బౌండరీ లైన్ ఆవలకు వెళ్తున్నానని గ్రహించిన సూర్య వెంటనే బంతిని గాల్లోకి ఎగిరేసి బౌండరీ లైన్ ఆవలకు వెళ్లి మళ్లీ లోపలికి వస్తూ పట్టిన క్యాచ్ ఈ మ్యాచ్కే హైలైట్గా నిలిచింది.
టీ20లకు కోహ్లీ గుడ్బై
భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికాడు. ఫైనల్లో దక్షిణాఫ్రికాపై విజయం సాధించిన తర్వాత కోహ్లీ ఈ విషయాన్ని వెల్లడించాడు. జట్టు విజయంలో కీలకమైన నేపథ్యంలో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్న కోహ్లీ మాట్లాడుతూ ‘ఇది నా కెరీర్లో చివరి టీ20 ప్రపంచకప్. ఏదైతే సాధించాలనుకున్నామో అది అందుకున్నాం. భారత్ తరఫున టీ20ల్లో ఇదే చివరి మ్యాచ్. ఇందులో ఎలాంటి రహస్యం లేదు. టీ20లను ముందుకు తీసుకెళ్లేందుకు యువ క్రికెటర్లు సిద్ధంగా ఉన్నారు. ఐసీసీ ట్రోఫీ కోసం ఏండ్లుగా ఎదురుచూశాం. రోహిత్కు ఇది తొమ్మిదో టీ20 ప్రపంచకప్ అయితే..నాకిది ఆరోది. భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోతున్నాం. ఇది చిరకాలం మా మదిలో నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు’ అని అన్నాడు.
‘ప్రపంచకప్ గెలిచినందుకు భారత జట్టుకు అభినందనలు. క్లిష్ట పరిస్థితులలో టోర్నీ ఆసాంతం జట్టు అత్యుత్తమ నైపుణ్యాలను ప్రదర్శించింది. ఫైనల్ మ్యాచ్లో అద్భుతంగా ఆడారు. వెల్ డన్, టీమ్ఇండియా’
– ద్రౌపది ముర్ము, రాష్ట్రపతి
‘చాంపియన్స్! టీ20 ప్రపంచకప్ను భారత్ స్వదేశానికి తీసుకొచ్చింది. మిమ్మల్ని చూసి దేశం గర్విస్తోంది. ఈ మ్యాచ్ చరిత్రాత్మకం’
– ప్రధాని మోదీ
భారత జట్టు సంచలనాత్మక ప్రదర్శనతో అన్ని విభాగాల్లో సత్తా చాటింది. ‘కింగ్’ విరాట్ కోహ్లీతోపాటు టీమ్ఇండియా బౌలర్లంతా సందర్భోచితంగా రాణించారు. 17 ఏండ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ రెండోసారి టైటిల్ను సాధించి కోట్లాది మంది భారతీయుల కల నెరవేర్చిన రోహిత్ సేనకు ధన్యవాదాలు”
– కేటీఆర్ (బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్)
భారత్: 20 ఓవర్లలో 176/7(కోహ్లీ 76, అక్షర్ 47, మహారాజ్ 2/23, నోకియా 2/26),
దక్షిణాఫ్రికా: 20 ఓవర్లలో 169/8(క్లాసెన్ 52, డికాక్ 39, హార్దిక్ 3/20, బుమ్రా 2/18)