India Vs South Africa | చెన్నై: స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే, టెస్టు సిరీస్లను గెలిచి జోరు మీదున్న భారత మహిళల క్రికెట్ జట్టు శుక్రవారం నుంచి మొదలుకాబోయే టీ20 సిరీస్లో తలపడనుంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శుక్రవారం చెన్నై వేదికగా జరుగబోయే తొలి టీ20లో సఫారీలతో అమీతుమీ తేల్చుకోనేందుకు హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమ్ఇండియా సిద్ధమైంది. వన్డేలతో పాటు ఏకైక టెస్టునూ ఓడిన సౌతాఫ్రికా పొట్టి ఫార్మాట్లో అయినా భారత్కు గట్టిపోటీనిచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఈ నెలలో జరిగే ఆసియా కప్తో పాటు అక్టోబర్లో బంగ్లాదేశ్ వేదికగా జరుగబోయే టీ20 ప్రపంచకప్నకు ముందు భారత్కు ఇదే చివరి పరిమిత ఓవర్ల సిరీస్.
సూపర్ ఫామ్:
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్లో రెండు సెంచరీలు చేసిన ఓపెనర్ స్మృతి మంధాన టెస్టులలోనూ శతకం బాది ఫుల్ ఫామ్లో ఉంది. వన్డే సిరీస్లో విఫలమైనా షఫాలీ వర్మ చెన్నై టెస్టులో డబుల్ సెంచరీ బాది టచ్లోకి వచ్చింది. హర్మన్ప్రీత్ కౌర్, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ కూడా టచ్లోనే ఉన్నారు. బౌలింగ్లో పేసర్లు రేణుకా, పూజా వస్త్రకార్, అరుంధతిరెడ్డి రాణిస్తుండగా స్పిన్నర్లు దీప్తి శర్మ, రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్ కీలకం కానున్నారు.