ఢిల్లీ: పొట్టి ప్రపంచకప్లో బంతితో పాటు బ్యాట్తోనూ రాణించి ఫైనల్లో టీమ్ఇండియా హీరోగా మారిన ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా రెండింతల ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. భారత్ వరల్డ్కప్ నెగ్గడంలో కీలకపాత్ర పోషించిన పాండ్యా బుధవారం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) విడుదల చేసిన పురుషుల టీ20 ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి దూసుకొచ్చాడు. తద్వారా భారత్ నుంచి ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా రికార్డులకెక్కాడు.
ప్రపంచకప్లో 150కి పైగా స్ట్రైక్ రేట్తో 144 పరుగులు చేసిన హార్దిక్.. బంతితో 11 వికెట్లు పడగొట్టాడు. దీంతో అతడు ర్యాంకింగ్స్లో రెండు స్థానాలు ఎగబాకి శ్రీలంక ఆల్రౌండర్ వనిందు హసరంగతో కలిసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. భారత పేస్గుర్రం జస్ప్రీత్ బుమ్రా 12 ర్యాంక్లు మెరుగుపరుచుకుని 12వ స్థానానికి చేరగా అక్షర్ పటేల్ (7), కుల్దీప్యాదవ్ (8) టాప్-10లో నిలిచారు. బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ రెండో ర్యాంక్లో ఉండగా ట్రావిస్ హెడ్ టాప్ర్యాంక్లో ఉన్నాడు.