Gautam Gambhir : భారత జట్టు ప్రధాన కోచ్ పదవి రేసులో ఉన్న గౌతం గంభీర్ (Gautam Gambhir) టీ20 వరల్డ్ కప్ విజేతలైన భారత క్రికెటర్లకు అభినందనలు తెలియజేశాడు. ఈ సందర్భంగా ఈ మాజీ క్రికెటర్ తన బాల్యానికి సంబంధించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. తాజాగా స్పోర్ట్స్కీడా షో ‘ఎస్కే మ్యాచ్ కీ బాత్’ (SK Match Ki Baat)లో మాట్లాడిన గంభీర్.. ఓ మ్యాచ్ చూశాకే తాను వరల్డ్ కప్ గెలవాలని డిసైడ్ అయ్యానని చెప్పాడు. ఆ మ్యాచ్ చూశాకే తనలో వరల్డ్ కప్ గెలవాలనే కోరిక బలంగా నాటుకుపోయిందని గౌతీ తెలిపాడు.
‘1992 వరల్డ్ కప్ సమయానికి నాకు 11 ఏండ్లు. గ్రూప్ దశలో భారత జట్టు ఒక్క పరుగు తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. అది చూసి చాలా బాధ పడ్డాను. ఆ రోజు రాత్రంతా ఏడ్చాను. ఆ మ్యాచ్ చూశాకే దేశం తరఫున వరల్డ్ కప్ గెలవాలని గట్టిగా అనుకున్నా. అదేందోగానీ.. నేను ఎప్పుడూ మళ్లీ అంతలా ఏడ్చింది లేదు’ అని గౌతీ వెల్లడించాడు.
వరల్డ్ కప్ ట్రోఫీతో సచిన్, గంభీర్
అన్నట్టుగానే గంభీర్ ఇండియా జెర్సీ వేసుకొని ఓపెనర్గా అదరగొట్టాడు. అంతేనా.. 2011లో జరిగిన వరల్డ్ కప్లో చెలరేగిపోయిన గౌతీ.. ఫైనల్లోనూ చితక్కొట్టాడు. శ్రీలంకపై 92 పరుగులు చేసి జట్టు ట్రోఫీని ముద్దాడడంలో కీలక పాత్ర పోషించాడు.
బ్రిస్బేన్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది. దాంతో, డక్వర్త్ లూయిస్ ప్రకారం భారత లక్ష్యాన్ని 47 ఓవర్లలో 236 పరుగులుగా నిర్ణయించారు. భారీ ఛేదనలో ఆఖరి బంతికి 4 రన్స్ అవసరమయ్యాయి. జవగళ్ శ్రీనాథ్ కొట్టిన బంతిని స్టీవ్ వా నేలపాలు చేశాడు. దాంతో, మూడో రన్ తీసే క్రమంలో వెంకటపతి రాజు రనౌట్ అయ్యాడు. దాంతో, టీమిండియా ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది.