IND vs SA : పొట్టి ప్రపంచ కప్ ఫైనల్కు మరి కొన్ని గంటలే ఉంది. టోర్నీలో అజేయంగా ఉన్న భారత్ (India), దక్షిణాఫ్రికా (South Africa)ల మధ్య బార్బడోస్లో జరుగబోయే టైటిల్ పోరు సర్వత్రా ఆసక్తిరేపుతోంది. ఈ మ్యాచ్లో అందరి కళ్లన్నీ విరాట్ కోహ్లీ (Virat Kohli) మీదే ఉండనున్నాయి. ఈ మెగా ఈవెంట్లో విరాట్ ఒక్కటంటే ఒక్క చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు.
కీలకమైన సెమీస్లోనూ కోహ్లీ 9 పరుగులకే కోహ్లీ వికెట్ పారేసుకున్నాడు. మొత్తంగా ఏడు మ్యాచుల్లో 10.21 సగటుతో 75 రన్స్ కొట్టాడంతే. అయినా సరే ఫైనల్లో విరాట్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడుతాడని మాజీలు అంటున్నారు. ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ (Monty Panesar) మాత్రం ఏకంగా కోహ్లీ సెంచరీ కొడుతాడని కామెంట్ చేశాడు.
‘సఫారీలతో జరిగే ఫైనల్లో విరాట్ కోహ్లీ శతకం సాధిస్తాడు. టీమిండియా ట్రోఫీని అందుకుంటుంది’ అని పనేసర్ అన్నాడు. భారత మాజీ సారథి సౌరవ్ గంగూలీ సైతం కోహ్లీకి అండగా నిలిచాడు. కోహ్లీ కూడా ఒక మనిషే. కొన్నిసార్లు అతడు కూడా ఫెయిల్ అవుతాడు. ఆ విషయాన్ని అందరూ అంగీకరించాలి అని దాదా అన్నాడు. మెగా టోర్నోలో దారుణంగా విఫలమవుతున్న విరాట్కు ఒక్క మ్యాచ్తో హీరో అయ్యే చాన్స్ ఉందని మాజీ ఆటగాడు కైఫ్ అన్నాడు.
టీ20 ప్రపంచ కప్ తొమ్మిదో సీజన్లో భారత్, దక్షిణాఫ్రికాలది అజేయ ప్రస్థానం. ఒకరకంగా ఇది ఐసీసీ టోర్నీల చరిత్రలో ఇదొక కొత్త అధ్యాయమనే చెప్పాలి. ఈ మెగా టోర్నీలో ఫేవరెట్ ట్యాగ్ను నిలబెట్టుకుంటూ టాప్ షోతో ప్రత్యర్థులను వణికించాయి. రెండు జట్లలో కామన్ పాయింట్ ఏమంటే.. బౌలర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. బార్బడోస్లోని కింగ్స్టన్ ఓవల్లో రాత్రి 8:00 గంటలకు జరిగే టైటిల్ పోరులోనూ ఇరుజట్ల బౌలర్లు చెలరేగడం ఖాయమనిపిస్తోంది.