Olympic Medal : ప్రపంచంలోని అథ్లెట్లు ఆతృతగా ఎదురుచూస్తున్న ఒలింపిక్స్(Olympics 2024)పండుగకు కౌంట్డౌన్ మొదలైంది. మరో 22 రోజుల్లో ప్యారిస్ వేదికగా మెగా టోర్నీ షురూ కానుంది. దాంతో, ఈ విశ్వ సమరంలో పతకాన్ని ముద్దాడడం కోసం ఆటగాళ్లంతా సర్వ శక్తులు ఒడ్డేందుకు సిద్ధమవుతున్నారు. ఎందుకంటే.. ఒలింపిక్స్ పతకం (Olympic Medal) అథ్లెట్లకు వెయ్యి ఓల్ట్ల ఎనర్జీని ఇస్తుంది. మెడల్ గెలిస్తే చాలు ప్రపంచాన్ని జయించినట్టుగా ఫీలవుతారు. పోడియం మీద నిల్చొన్నాక గోల్డ్ మెడల్ (Gold Medal) మెడలో పడగానే కోటి వెలుగుల కొవ్వొత్తుల వాళ్ల ముఖం వెలిగిపోతుంది. అంతేనా ఆ పతకాన్ని పండ్లతో కొరికి మరీ ఫొటోలకు పోజిస్తారు. ఇంతకూ ఈ సంప్రదాయం ఎప్పుడు మొదలైంది? అసలు మెడల్ విన్నర్స్ అలా ఎందుకు చేస్తారు? అనేది తెలుసుకోవాలనుందా.. అయితే చదివేయండి
ఒలింపిక్స్ మెడల్ అనేది అథ్లెట్ల ప్రతిభకు, కఠోర సాధనకు ప్రతీక. అందుకే ఆ పతకానికి విలువెక్కువ. అయితే.. మెడల్ను కొరికే సంప్రదాయం 3 వేల ఏండ్ల క్రితమే మొదలైందని చెప్తారు. అప్పట్లో విజేతలు స్వచ్ఛమైన బంగారంతో చేసిన పసిడి పతకాన్ని ఇచ్చేవారు. దాంతో, ‘అది నిజంగా శుద్ధమైన బంగారమా? కాదా?’ అనేది తెలుసుకోవడానికి అప్పట్లో గోల్డ్ మెడల్ విన్నర్స్ పంటితో కొరికి మరీ చెక్ చేసేవాళ్లు.
అది ఒకవేళ ప్యూర్ గోల్డ్ మెడల్ అయితే దానిపై ‘పంటి గాట్లు’ స్పష్టంగా కనిపించేవి. కానీ, 1912 నుంచి విజేతలకు స్వచ్ఛమైన బంగారంతో చేసిన గోల్డ్ మెడల్స్ను ఇవ్వడంపై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నిషేధం విధించింది. అయినా సరే విన్నర్స్ పతకాలను పంటి అంచున పెట్టుకొని కొరకడం మాత్రం ఆగలేదు.
తమకు బహూకరించేది 100 శాతం బంగారు పతకం కాదని తెలిసినా.. వాళ్లు అలానే ఫొటోలను పోజిచ్చేవాళ్లు. అందుకు కారణం ఎవరో తెలుసా ఫొటోగ్రాఫర్లు. అవును.. ఒలింపిక్స్ విజేతలు నోట్లో పతకాన్ని పట్టుకొని ఉన్న ఫొటోలను జనం ఇష్టపడడాన్ని ఫొటోగ్రాఫర్స్ గమనించారు. అందుకని ప్రతిసారి పతక వీరులను ఆ ఫోజ్తోనే క్లిక్ మనిపించేవాళ్లు.
‘కెమెరామెన్ల కోరిక మేరకే అథ్లెట్లు తమ మెడల్ను కొరుకుతున్నార’ని ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ ఒలింపిక్ హిస్టోరియన్స్ అధ్యక్షుడు డేవిడ్ వల్లెచిన్స్కీ(David Wallechinsky) వివరించాడు. ఇదండీ మ్యాటర్. అలా ఆ సంప్రదాయం నిన్నటి టోక్యో ఒలింపిక్స్లోనూ కనిపించింది. త్వరలో జరుగబోయే ప్యారిస్ విశ్వ క్రీడలు.. ఆ తర్వాత జరగనున్న టోర్నీల్లోనూ కొనసాగడం ఖాయమనిపిస్తోంది.