T20 World Cup History : పొట్టి ప్రపంచకప్ తొమ్మిదో సీజన్లో చాంపియన్ ఎవరో రేపటితో తేలిపోనుంది. టోర్నీలో అజేయంగా ఉన్న భారత్ (India), దక్షిణాఫ్రికాలు బార్బడోస్ వేదికగా టైటిల్ సమరానికి సిద్ధమయ్యాయి. సెమీస్లో రెండు సార్లు చాంపియన్ ఇంగ్లండ్ (England)ను చిత్తు చేసిన టీమిండియా తొలిసారి ఫైనలిస్ట్ సఫారీలకు చెక్ పెట్టాలని అనుకుంటోంది. ఇక టీ20 వరల్డ్ కప్ చరిత్ర విషయానికొస్తే.. ఆరంభ సీజన్ నుంచి విజేతగా నిలిచిన జట్టుకు ‘డిఫెండింగ్ చాంపియన్'(Defending Champion) ట్యాగ్ అచ్చిరాలేదనే చెప్పాలి.
అవును.. 2007 నుంచి 2024 వరకూ జరిగిందదే. చాంపియన్గా అవతరించిన ప్రతి జట్టు ఆ తర్వాతి సీజన్లో సెమీస్ మాత్రం దాటలేదు. తాజాగా జోస్ బట్లర్ (Jos Buttler) నేతృత్వంలోని ఇంగ్లండ్ కూడా అనూహ్యంగా సెమీస్లోనే ఇంటిదారి పట్టింది.
No team has defended their #T20WorldCup title ❌ pic.twitter.com/WhMU2KBGYH
— ESPNcricinfo (@ESPNcricinfo) June 28, 2024
ఐసీసీ 2007లో తొలిసారి పొట్టి వరల్డ్ కప్ను నిర్వహించింది. దక్షిణాఫ్రికా ఆతిథ్యమిచ్చిన ఆ టోర్నీలో ఎంఎస్ ధోనీ (MS Dhoni) సారథ్యంలోని భారత్ టైటిల్ను ఎగరేసుకుపోయింది. కానీ 2009లో తొలి సీజన్ రన్నరప్ పాకిస్థాన్ ట్రోఫీ గెలవగా.. టీమిండియా సూపర్ 8కే పరిమితమైంది. 2010 ఎడిషనల్లో కప్ కొట్టిన ఇంగ్లండ్ ఆ తర్వాతి సీజన్లో సూపర్ 8లోనే నిష్క్రమించింది.
డారెన్ సమీ(Daren Sammy) 2012లో వెస్టిండీస్ను చాంపియన్గా నిలిపాడు. కానీ, 2014లో శ్రీలంక చాంపియన్గా అవతరించగా విండీస్ సెమీస్లోనే వెనుదిరిగింది. 2016లో లంక సూపర్ 10 దశ దాటలేదు. ఆ ఏడాది విండీస్ విజేతగా నిలిచి రెండో ట్రోఫీతో చరిత్ర సృష్టించింది.
కానీ, 2021 ఎడిషనల్లో మాత్రం సూపర్ 12లోనే కరీబియన్ టీమ్ కథ ముగిసింది. ఇక అరోన్ ఫించ్ (Aaron Finch) సారథ్యంలో 2021లో పొట్టి ట్రోఫీ కొట్టేసిన ఆస్ట్రేలియా ఎనిమిదో సీజన్లో సొంతగడ్డపై సూపర్ 12కే పరిమితమైంది. ఆసీస్ గడ్డపై పాకిస్థాన్ను ఓడించి రెండో ట్రోఫీ కొల్లగొట్టిన ఇంగ్లండ్ 2024లో సెమీస్లో టీమిండియా ధాటికి నిలవలేకపోయింది.
పొట్టి వరల్డ్ కప్ తొమ్మిదో సీజన్లో అంతిమ సమరం రేపే. బార్బడోస్లోని బ్రిడ్జ్టౌన్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికాలమధ్య జరుగబోయే ఫైనల్ ఫైట్కు మరికొన్ని గంటలే ఉంది. ఐసీసీ టోర్నీల్లో సఫారీలకు ఇది తొలి ఫైనల్ కాగా.. టీమిండియాకు ఇది పదమూడో టైటిల్ పోరు.
క్రికెట్ చరిత్రలో మొదటిసారి సెమీస్ గండం గట్టెక్కిన ప్రొటిస్ టీమ్ ఐసీసీ ట్రోఫీ కలను నిజం చేసుకోవాలనే కసితో ఉంది. మరోవైపు 11 ఏండ్లుగా ఊరిస్తున్న ట్రోఫీని పట్టేయాలని పట్టుదల రోహిత్ సేనలో కనిపిస్తోంది. దాంతో, ఈసారి టైటిల్ మురిపెం ఎవరిది? అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఓటమెరుగని ఈ రెండు జట్ల మధ్య ఫైన్లను సమఉజ్జీల యుద్ధమని విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.