ఫ్రాంక్ఫర్ట్: యూరో కప్లో పోర్చుగల్ క్వార్టర్స్కు దూసుకెళ్లింది. మంగళవారం ఉత్కంఠగా జరిగిన రౌండ్ ఆఫ్ 16 పోరులో పోర్చుగల్ 3-0తో స్లోవేనియాను ఓడించింది. పెనాల్టీ షూటౌట్ ద్వారా తేలిన ఈ మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది.
మ్యాచ్ నిర్దేశిత సమయం(90 నిమిషాలు)తో పాటు ఎక్స్ట్రా టైమ్లోనూ ఇరుజట్లూ గోల్ చేయలేకపోవడంతో పెనాల్టీ షూటౌట్ ద్వారా ఫలితాన్ని తేల్చాల్సి వచ్చింది. షూటౌట్లో పోర్చుగల్ నుంచి క్రిస్టియానో రొనాల్డో, బ్రూనో ఫెర్నాండెజ్, బెర్నార్డొ సిల్వ గోల్స్ చేయగా స్లోవేనియా తరఫున జొసిఫ్, బల్కొవెక్, బెంజిమెన్ కొట్టిన గోల్స్ను పోర్చుగల్ గోల్ కీపర్ డియాగొ కొస్టా అద్భుతంగా అడ్డుకుని తన జట్టును క్వార్టర్స్ చేర్చాడు. అయితే ఈ మ్యాచ్ ఎక్స్ట్రా టైమ్లో వచ్చిన పెనాల్టీ కిక్ అవకాశాన్ని మిస్ చేసుకోవడంతో రొనాల్డో కన్నీటిపర్యంతమయ్యాడు.
ఈ సందర్భంగా స్టాండ్స్లో మ్యాచ్ చూస్తున్న అతడి తల్లి సైతం కన్నీళ్లు పెట్టుకోవడం నెటిజన్లను కలిచివేసింది. కానీ షూటౌట్లో మాత్రం రొనాల్డో ఆ తప్పు చేయలేదు. ఇక రౌండ్ ఆఫ్ 16లో బెల్జియంను 0-1తో ఓడించిన ఫ్రాన్స్తో క్వార్టర్స్లో పోర్చుగల్ అమీతుమీ తేల్చుకోనుంది. స్పెయిన్, జర్మనీ, ఇంగ్లండ్, స్విట్జర్లాండ్ సైతం క్వార్టర్స్ చేరాయి.