Border – Gavaskar Trophy : పొట్టి ప్రపంచ కప్ విజేతగా భారత జట్టు(Team India) నవంబర్లో ఆస్ట్రేలియాకు వెళ్లనుంది. కంగారూల గడ్డపై రోహిత్ శర్మ బృందం బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ(Border – Gavaskar Trophy) 2024-25 సిరీస్ ఆడనుంది. దాంతో, ఈ సిరీస్ కోసం భారత అభిమానులు ఆస్ట్రేలియాలో వాలిపోయేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో భారత్, ఆసీస్ టెస్ట్ సిరీస్ మ్యాచ్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది.
ముఖ్యంగా భారతీయులు పెద్ద సంఖ్యలో టికెట్లు కొంటున్నారని చెప్పింది. గత సీజన్ 2021-22తో పోల్చితే ఈసారి రికార్డు స్థాయిలో ఆరు శాతం అధికంగా టికెట్లు సేల్ అయ్యాయని సీఏ వెల్లడించింది. ‘బోర్డర్ – గవాస్కర్ సిరీస్ కోసం చాలామంది భారతీయులు ఆస్ట్రేలియాకు రాబోతున్నారు. వాళ్లకు ఇక్కడ అపూర్వ స్వాగతం లభిస్తుంది.
ఇక్కడకు వచ్చే ప్రతి ఒక్కరికి ఏ లోటూ రాకుండా చూడడమే కాకుండా వాళ్లు సిరీస్ను ఆస్వాదించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ సిరీస్ కచ్చితంగా మర్చిపోలేని జ్ఞాపకం అవుతుంది’ అని ఆ దేశ క్రికెట్ జనరల్ మేనేజర్ ఆఫ్ ఈవెంట్స్, ఆపరేషన్స్ జోయెల్ మొరిసన్ (Joel Morrison) ఓ ప్రకటనలో చెప్పుకొచ్చాడు.
బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీని 32 ఏండ్ల తర్వాత తొలిసారి ఐదు మ్యాచ్ల సిరీస్గా జరుపుతున్నారు. దాంతో, ఈ సిరీస్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నవంబర్ 22న పెర్త్ స్టేడియం వేదికగా జరిగే తొలి మ్యాచ్తో సిరీస్ ఆరంభం కానుంది. డే /నైట్ టెస్టు అయిన రెండో మ్యాచ్ అడిలైడ్ స్టేడియంలో డిసెంబర్ 6న షురూ కానుంది. అనంతరం డిసెంబర్ 14న గబ్బాలో మూడో టెస్టు, మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లోడిసెంబర్ 26న నాలుగో టెస్టు, కొత్త ఏడాది జనవరి 3న సిడ్నీ మైదానంలో ఐదో టెస్టు నిర్వహించనున్నారు.