Champions Trophy 2025 | ఐసీసీ ఛాంపియన్స్ ట్రోపీ వచ్చే ఏడాది పాకిస్థాన్లో జరుగనున్నది. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు కొనసాగనున్నది. ఫైనల్ 9న జరుగనుండగా.. ఏదైనా కారణంతో రద్దయితే మార్చి 10న రిజర్వ్ డే నిర్ణయించారు. ఈ టోర్నీ కోసం ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) విండో కోసం ప్రయత్నిస్తున్నది. ఇదిలా ఉండగా.. వచ్చే ఏడాది మార్చి 1న లాహోర్ వేదికగా చిరకాల ప్రత్యర్థి పాక్ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్తో కీలకమైన మ్యాచ్కు పీసీబీ షెడ్యూల్ను సిద్ధం చేసింది. అయితే, డ్రాఫ్ట్ షెడ్యూల్కు బీసీసీఐ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఈ విషయాన్ని ఐసీసీ బోర్డు సీనియర్ సభ్యుడు ఒకరు జాతీయ మీడియాకు తెలిపారు.
1996 తర్వాత తొలిసారిగా పాకిస్థాన్ ఐసీసీ ప్రధానమైన టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్నది. ఐసీసీ టోర్నమెంట్కు పాక్కు భారత జట్టును పంపుతుందా? లేదా? అనేది తేలాల్సి ఉంది. ఇప్పటికైతే ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తున్నది. గతంలో కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభిస్తేనే ఆ దేశానికి జట్టును పంపనున్నట్లు బీసీసీఐ స్పష్టం చేసింది. సమాచారం ప్రకారం.. పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన 15 మ్యాచుల షెడ్యూల్ను ఐసీసీకి అందజేశారు. ఇందులో భద్రత, రవాణా సంబంధిత కారణాలతో భారత్ మ్యాచులన్నీ లాహోర్లోనే నిర్వహించేలా డ్రాఫ్ట్ను సిద్ధం చేసింది.
దీనిపై ఐసీసీ బోర్డు సభ్యుడు ఒకరు మాట్లాడుతూ.. 15 మ్యాచుల ఛాంపియన్స్ ట్రోఫీ ముసాయిదాను పీసీబీ సమర్పించిందని తెలిపారు. లాహోర్లో ఏడు, కరాచీలో మూడు, రావల్పిండిలో ఐదు మ్యాచులు జరుగుతాయన్నారు. ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే ఎనిమిది జట్లను రెండుగ్రూపులుగా విభజించారు. పాక్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్తో కలిసి భారత్ గ్రూప్-ఏలో ఉన్నది. ఇక గ్రూప్-బీలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్థాన్ ఉన్నాయి. ఇటీవల ఐసీసీ ఈవెంట్ ఛీప్ క్రిస్ టెట్లీ ఇస్లామాబాద్లో పీసీబీ చైర్మన్ నఖ్వీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా భద్రతా, ఇతర ఏర్పాట్లపై చర్చించారు.