INDW vs SAW : భారత గడ్డపై బోణీ కోసం ఎదురుచూస్తున్న దక్షిణాఫ్రికా(South Africa) తొలి టీ20లో భారీ స్కోర్ కొట్టింది. ఓపెనర్ తంజిమ్ బ్రిట్స్(81), ఆల్రౌండర్ మరిజానె కాప్(57)లు హాఫ్ సెంచరీలతో కదం తొక్కడంతో సఫారీ జట్టు 20 ఓవర్లలో 189 స్కోర్ చేసింది. టెస్టు మ్యాచ్ చేజార్చుకున్న చెపాక్ స్టేడియంలోనే టీమిండియాకు పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత బౌలర్లలో రాధా యాదవ్(2/40), పూజా వస్త్రాకర్(2/23)లు రెండేసి వికెట్లు పడగొట్టారు.
టీ20 సిరీస్ తొలి పోరులో కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ టాస్ గెలిచి ప్రత్యర్థిని బ్యాటింగ్కు ఆహ్వానించింది. వన్డే సిరీస్, ఏకైకటెస్టు మ్యాచ్లో పరాభవంతో రగిలిపోతున్న దక్షిణాఫ్రికా జట్టుకు ఓపెనర్లు లారా వొల్వార్డ్త్(33), తంజిమ్ బ్రిట్స్(81)లు అదిరే ఆరంభం ఇచ్చారు. తొలి వికెట్కు 50 రన్స్ జోడించి పభారీ స్కోర్కు బాటలు వేశారు. అయితే.. రాధా యాదవ్ సూపర్ డెలివరీతో లారాను బౌల్డ్ చేసి బ్రేకిచ్చింది. కానీ, ఆ తర్వాత వచ్చిన మరిజానే కాప్ (57) ఆకాశమే హద్దుగా చెలరేగింది.
Tazmin Brits and Marizanne Kapp go big in Chennai 🔥 https://t.co/XXvMGTKq69 | #INDvSA pic.twitter.com/FqIE1ZejnP
— ESPNcricinfo (@ESPNcricinfo) July 5, 2024
తంజిమ్ జతగా ఆమె విధ్వంసం కొనసాగించడంతో సఫారీ స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. వీళ్లిద్దరూ భారత బౌలర్లను ఉతికారేస్తూ రెండో వికెట్కు 96 రన్స్ జమ చేశారు. భారత అమ్మాయిల చెత్త ఫీల్డింగ్ కూడా వీళ్లకు కలిసొచ్చింది. అయితే.. రాధా యాదవ్ 17వ ఓవర్లో ఈ జంటను విడదీసినా.. బ్రిట్స్ మాత్రం తన జోరు ఆపలేదు. ఆ తర్వాత వచ్చిన కొలే ట్రయాన్(12)తో కలిసి ధనాధన్ ఆడి జట్టు స్కోర్ 180 దాటించింది. ఆఖరి ఓవర్లో భారీ షాట్ కొట్టబోయి ఆమె ఔట్ కావడంతో దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది.