INDW vs SAW : భారత పర్యటనలో విజయం కోసం నిరీక్షించిన దక్షిణాఫ్రికా(South Africa) కల నిజమైంది. వన్డే, టెస్టు మ్యాచ్లో దారుణంగా ఓడిన సఫారీ జట్టు ఎట్టకేలకు టీ20 సిరీస్లో బోణీ కొట్టింది. చెపాక్ స్టేడియంలో జరిగిన తొలి పోరులో పర్యాటక జట్టు 12 పరుగుల తేడాతో గెలుపొందింది. భారీ ఛేదనలో జెమీమా రోడ్రిగ్స్(53 నాటౌట్), స్మృతి మంధాన(46)లు అదరగొట్టినా ఓటమి తప్పలేదు. పవర్ ప్లేలో భారీగా పరుగులిచ్చినా ప్రొటిస్ బౌలర్లు.. ఆఖర్లో కట్టడి చేసి జట్టుకు సూపర్ విక్టరీని అందించారు.
పొట్టి సిరీస్లో దక్షిణాఫ్రికా ఆల్రౌండ్ షోతో జయభేరి మోగించింది. వరుస విజయాలతో జోరుమీదున్న టీమిండియాకు చెక్ పెట్టి టీ20 సిరీస్లో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. సఫారీలు నిర్దేశించిన భారీ ఛేదనలో ఓపెనర్లు షఫాలీ వర్మ(18), స్మృతి మంధాన(46)లు బౌండరీలతో విరుచుకుపడి.. 5వ ఓవర్లోనే స్కోర్ 50 దాటించారు. పవర్ ప్లే మరో నాలుగు బంతుల్లో ముగుస్తుంనగా అయబొంగ ఖాకా డేంజరస్ షఫాలీని వెనక్కి పంపింది. ఆ తర్వాత దయలాన్ హేమలత.. విఫలమైంది. ఆకాసేపటికే మంధాన స్టంపౌట్గా వెనుదిరిగింది.
జెమీమా రోడ్రిగ్స్(53 నాటౌట్)
ఆ పరిస్థితుల్లో కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్(35 నాటౌట్), జెమీమా రోడ్రిగ్స్(53 నాటౌట్)లు గెలిపించే బాధ్యత తీసుకున్నారు. ఆఖరి మూడు ఓవర్లలో ఇద్దరూ వీరకొట్టుడు కొట్టారు. 19వ ఓవర్ ఆఖరి బంతికి సిక్సర్తో జెమీమా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. ఇక చివరి ఓవర్లో హర్మన్ప్రీత్ తొలి బంతికే బౌండరీ కొట్టింది. కానీ, మిగతా ఐదు బంతుల్లో కేవలం నాలుగు రన్స్ వచ్చాయంతే. దాంతో, సఫారీలు తొలి విజయాన్ని నమోదు చేశారు.
భారత గడ్డపై బోణీ కోసం ఎదురుచూస్తున్న దక్షిణాఫ్రికా తొలుత భారీ స్కోర్ కొట్టింది. టాస్ ఓడినా ఓపెనర్లు తంజిమ్ బ్రిట్స్(81), లారా వొల్వార్డ్త్(33)లు తొలి వికెట్కు 50 రన్స్ జోడించి శుభారంభమిచ్చారు. రాధా యాదవ్ సూపర్ డెలివరీతో లారాను బౌల్డ్ చేసి బ్రేకిచ్చినా ఆల్రౌండర్ మరిజానె కాప్(57) మెరుపు బ్యాటింగ్ చేసింది.
బ్రిట్స్తో కలిసి భారత బౌలర్లను ఉతికారేస్తూ రెండో వికెట్కు 96 రన్స్ జమ చేసింది. వీళ్లిద్దరూ హాఫ్ సెంచరీలతో కదం తొక్కడంతో సఫారీ జట్టు 20 ఓవర్లలో 189 స్కోర్ చేసింది. టెస్టు మ్యాచ్ చేజార్చుకున్న చెపాక్ స్టేడియంలోనే టీమిండియాకు పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత బౌలర్లలో రాధా యాదవ్(2/40), పూజా వస్త్రాకర్(2/23)లు రెండేసి వికెట్లు పడగొట్టారు.