లండన్: రెండ్రోజుల క్రితమే మొదలైన వింబుల్డన్లో పెను సంచలనం నమోదైంది. ఈ ఏడాది మహిళల సింగిల్స్లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన చెక్ రిపబ్లిక్ అమ్మాయి మర్కెట వొండ్రుసోవా 4-6, 2-6తో అన్సీడెడ్ జెస్సికా మనెరొ (స్పెయిన్) చేతిలో పరాభవం పాలైంది. సెంటర్ కోర్టు వేదికగా 66 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్లో వొండ్రుసోవా కనీస పోరాట పటిమ కూడా చూపకుండా వెనుదిరిగింది.
టెన్నిస్లో ఓపెన్ శకం మొదలయ్యాక వింబుల్డన్లో 1994 (స్టెఫీ గ్రాఫ్) తర్వాత డిఫెండింగ్ చాంపియన్ తొలి రౌండ్లోనే ఇంటిబాట పట్టడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. గతేడాది జరిగిన ఈ టోర్నీలో అనూహ్యమైన ఆటతీరుతో తనకంటే మెరుగైన ఆటగాళ్లను మట్టికరిపించి చాంపియన్గా నిలిచిన వొండ్రుసోవా ఈసారి మాత్రం మొదటి రౌండ్కే నిష్క్రమించింది. 21 ఏండ్ల స్పెయిన్ అమ్మాయి మనెరొ ఆరంభం నుంచే ఆధిక్యం చెలాయిస్తూ వరుస సెట్లతో పాటు మ్యాచ్నూ సొంతం చేసుకుంది.
పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో రెండో సీడ్, గతేడాది రన్నరప్ నొవాక్ జొకోవిచ్ 6-1, 6-2, 6-2తో అన్సీడెడ్ కొప్రివాపై అలవోకగా గెలిచాడు. నాలుగో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) 6-2, 6-4, 6-2తో రాబర్టొ (స్పెయిన్) పై విజయం సాధించాడు. కానీ ఆరో సీడ్ ఆండ్రీ రుబ్లెవ్ 4-6, 7-5, 2-6, 6-5 (5/7)తో అర్జెంటీనా ఆటగాడు ఫ్రాన్సిస్కో కొమెసన చేతిలో ఓడాడు. భారత యువ టెన్నిస్ ప్లేయర్ సుమిత్ నాగల్ 2-6, 6-3, 3-6, 4-6తో మియొమిర్ కెక్మనోవిక్ (సెర్బియా) చేతిలో పరాభవం పాలై తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు.