BCCI | న్యూఢిల్లీ: భారత క్రికెటర్లపై కనకవర్షం కురుస్తున్నది. సుదీర్ఘ కలను సాకారం చేసుకుంటూ కరీబియన్ గడ్డపై కొత్త చరిత్ర లిఖించిన టీమ్ఇండియాపై ఓ వైపు ప్రశంసలతో పాటు నగదు ప్రోత్సాహకాల పరంపర కొనసాగుతున్నది.
17 ఏండ్ల తర్వాత టీ20 ప్రపంచకప్ను దేశానికి అందించిన టీమ్ఇండియా క్రికెటర్లకు బీసీసీఐ ఏకంగా రూ.125 కోట్ల బంపర్ ప్రైజ్మనీ ప్రకటించింది. ఈ విషయాన్ని బోర్డు కార్యదర్శి జై షా ఆదివారం అధికారికంగా ప్రకటించారు. బార్బడోస్ వేదికగా దక్షిణాఫ్రికాతో హోరాహోరీగా సాగిన ఫైనల్లో రోహిత్సేన చిరస్మరణీయ విజయం సాధించిన వేళ షా..ఎక్స్లో స్పందిస్తూ ‘రోహిత్శర్మ అసమాన నాయకత్వంలో భారత్ అద్భుత పోరాటపటిమ కనబరిచింది.
అపజయమెరుగకుండా టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచిన తొలి జట్టుగా టీమ్ఇండియా నిలిచింది. అద్భుతమైన ప్రదర్శనతో విమర్శలకు దీటైన సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ప్రపంచకప్ గెలిచిన జట్టుకు రూ.125 కోట్ల ప్రైజ్మనీ ప్రకటిస్తున్నాం’ అని అన్నాడు.