ఢాకా: టీ20 వరల్డ్కప్లో ఇండియాతో జరిగిన సూపర్-8 మ్యాచ్ సమయంలో బంగ్లాదేశ్ వైస్ కెప్టెన్ తస్కిన్ అహ్మాద్ను ఆ జట్టు ఎంపిక చేయలేదు. కీలకమైన ఆ మ్యాచ్లో అతన్ని ఆడనివ్వలేదు. ఆ మ్యాచ్ రోజున ఉదయం టీమ్ బస్సును తస్కిన్ అందుకోలేకపోయాడు. అతిగా నిద్ర పోవడం వల్ల బస్సును మిస్సైనట్లు తెలుస్తోంది. అయితే టీమ్ బస్సు మిస్సైనా.. అతను స్టేడియంకు చేరుకున్నాడు. కానీ భారత్తో జరిగిన మ్యాచ్లో తుది జట్టుకు తస్కిన్ను బంగ్లాదేశ్ ఎంపిక చేయలేదు. నార్త్ సౌండ్లో జూన్ 22వ తేదీన జరిగిన ఆ మ్యాచ్లో బంగ్లాదేశ్ 50 రన్స్ తేడాతో ఓటమిపాలైంది. ఆ మ్యాచ్కు కేవలం తస్కిన్ స్థానంలో బంగ్లా జకీర్ అలీని తీసుకున్నది. దీనిపై తస్కిన్ అహ్మద్ వివరణ ఇచ్చాడు.
ఢాకాకు చెందిన ఓ పత్రికకు తస్కిన్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. స్టేడియంకు లేటుగా వెళ్లింది నిజమే అని, కానీ టాస్ కన్నా ముందే గ్రౌండ్కు చేరుకున్నట్లు చెప్పాడు. టాస్ వేయడానికి కనీసం 40 నిమిషాల ముందు గ్రౌండ్ చేరుకున్నట్లు తస్కిన్ తెలిపాడు. టీమ్ బస్సు మిస్సయ్యాయని, హోటల్ నుంచి బస్సు 8.35 నిమిషాలకు కదిలి వెళ్లిందని, అయితే గ్రౌండ్కు 8.43 నిమిషాలకు బయలుదేరానని, దాదాపు బస్సుతో పాటు గ్రౌండ్కు చేరుకున్నానని, ఆలస్యంగా రావడం వల్ల తనను జట్టుకు ఎంపిక చేయలేదన్నది నిజం కాదు అని, ఎలాగో ఆడడం లేదు కదా అని తస్కిన్ తెలిపాడు. అయితే ఆ తర్వాత జూన్ 24వ తేదీన ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్కు మళ్లీ తస్కిన్కు చోటు ఇచచారు.
ఈ ఘటనపై మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ స్పందిస్తూ.. తస్కిన్ క్షమాపణలు చెప్పారని, ఆలస్యంగా రావడం వల్లే అతన్ని తుది జట్టుకు ఎంపిక చేయడం కష్టమైందన్నాడు. హోటల్ నుంచి బస్సు అదే సమయానికి బయలుదేరుతుందని, టీమ్ బస్సు ఎవరి కోసం ఆగదు అని షకీబ్ చెప్పాడు. బస్సు మిస్సైనవాళ్లు మేనేజర్ కారు కానీ ట్యాక్సీలో కానీ రావచ్చు అన్నాడు. కానీ వెస్టిండీస్లో రవాణా చాలా కష్టమైన విషయమన్నాడు. టాస్కు పది నిమిషాలు ముందు అతను వచ్చాడని, కానీ అప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి అన్నాడు. తస్కిన్ క్షమాపణలు చెప్పడం వల్లే అందరూ ఆ సమస్యను లైట్గా తీసుకున్నట్లు వెల్లడించాడు.